అమ్మ ఫోన్ చేస్తుంది ఎప్పుడొస్తున్నావు నాన్నా అని అడుగుతుంది. వస్తానమ్మా అని నా ప్రయాణాన్ని వాయిదా వేస్తుంటాను. ఊరంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? ఊరు జ్ఞాపకం రాగానే ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. అమ్మ, నాన్నల మాటలా వుంచి ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ‘ చెరువును మొలకు చుట్టుకుని చెట్లెక్కిన జ్ఞాపకాలు, కాలువ తోక పట్టకుని గిర్రున తిప్పిన గుర్తులు,పచ్చని పైరు బొమ్మలు కత్తిరించుకుంటూ కలలకు అతికించుకున్న కాలాలు’ అంటూ నేను ఒక కవితలో రాసుకున్నాను. ఊరంటే ఎవరికైనా వారి బాల్యం నాటి ఊరి ముచ్చట్లే ముప్పిరిగొంటాయి. ఇప్పుడు మాత్రం ఊరంటే భయం వేస్తోంది. అక్కడ అమ్మా నాన్న మాత్రమే ఉన్నారు. కానీ ఆ చిన్ననాటి ఊరు లేదు. ఊరుంది గాని నా జ్ఞాపకాల్లోని ఊరు లేదు. ఊరు గుర్తుకొస్తే ఏదో పసరు వాసన మనసంతా కమ్ముకుంటుంది.
గోదావరి జిల్లాల్లో త్రాగు నీటికి కరువొస్తుందని ఎవరైనా కలలోనైనా ఊహించారా? ఊరెళ్తే ఆకుపచ్చని పంటపొలాల వర్ణచిత్రాలు కనిపించవని ఎపుడైనా మాట వరసకైనా అనుకున్నామా? ఊరంటే పంట కాలవల్లో ఉరకలెత్తే తేటనీరు కదా. అలాంటి కాలవలు ఇప్పుడు మచ్చుకైనా కానరావంటే నమ్మగలమా? చెట్లూ పక్షులూ కూడబలుక్కుని మాయమైపోతాయని ఏనాడైనా భావించామా? ఇప్పుడు ఊరంటే ఇవేమీ లేవు. రక్తమాంసాల్లాంటి ఈ దృశ్యాలు పోయి కేవలం ఎముకల గూడులా మిగిలిన ఊరికి ఎలా పోగలం? అలాగని వెళ్ళకుండా ఎలా వుండగలం? ఇదే మీమాంస ఇదే సందిగ్ధం ఇదే డోలాయమానం ఈ మధ్య ఎక్కువైంది. కూలి దొరక్కపోయినా నీరు తాగి బతికే పేదజనం కూడా ఇప్పుడు నీరు కొనుక్కుంటున్నారు. తక్షణ లాభాపేక్షతో వరిపంటలు వదిలేసి చేపల చెరువులు..రొయ్యల చెరువులు తవ్వకాల్లో ఆసాములు తలమునకలైపోయారు. వాటికి చోటిస్తూ పంటపొలాలు..వాటితో పాటు చెట్టూ పుట్టా పక్షులూ గూళ్ళూ సమస్తం మాయమైపోయాయి. కాలవల్లోకి ఊళ్లోని చెరువుల్లోకి విషరసాయనాలు ప్రవహిస్తున్నాయి. అక్కడిప్పుడు తాగడానికే కాదు, అంట్లు తోముకోడానికి, ముడ్లు కడుక్కోడానికి కూడా అందుబాటులో ఉన్న నీరు అంటుకోబుద్ధి కాదు. ఆ భయంతోనే ఈ మధ్య ఊరికి ప్రయాణం వాయిదా వేస్తున్నాను. ఇది అమ్మకెలా చెప్పాలి? గోదావరి జిల్లాలకే ఇంతటి విపత్కర పరిస్థితి వస్తే ఏ కరువు ప్రాంతం గురించి ఇక కన్నీళ్ళు పెట్టగలం?
మా ఊళ్ళను అంటిపెట్టుకుని వుండే కొల్లేరు కూడా ఇప్పుడు కొంచెం కొంచెం తనను తాను కత్తిరించుకుంటూ ఎటో పారిపోతోంది. మొన్నామధ్య మా ఊరు వెళ్ళినప్పుడు మా చెరువును చూస్తే గుండె చెరువైపోయింది. అప్పుడిలా ఓ కవితలో రాసుకున్నాను.
‘’చెరువు చూస్తే ఇది మా ఊరే అనిపించింది
చెరువులో పుశువుల్ని చూస్తే కాసేపు కాదేమో అనిపించింది
అవును మరి ఒకప్పుడు
పెద్ద పెద్ద తామరాకుల మీద సూర్యుడు
తూరుపు నుంచి పడమర దాకా
ఎర్రని ఎండ జుట్టు ఎగరేసుకుంటూ నడిచేవాడు
చెరువులో క్రిక్కిరిసిన తెల్లతామార పూల సాక్షిగా
ఊరు ఊరంతా సూర్య నమస్కారం చేసేది
నేనే దారి తప్పానో మా ఊరే దారి తప్పిందో కొంచెం తికమక
దోసిట్లోకి నీళ్ళు తీసుకుంటే ఎగిరే పక్షులు కూడా
కాసేపు ఆగి మొహాలు చూసుకుని రెక్కలు దువ్వుకుని మురుసుకునేవి
రాత్రంతా ఏ దేవతలో మా చెరువును
కొబ్బరినీళ్ళతో నింపిపోతారనుకునే వాళ్ళం
ఇప్పుడు ముదురు ముదురు పసరు
మొహానికి పూసుకుని పళ్ళికిలిస్తోంది
పచ్చదనాన్ని ఊడ్చిపారేయడానికి
రొయ్యలూ చేపలూ కొత్త పారలు మోసుకొచ్చాయి
అవి విదిలించే నోట్లు మనుషులకు
అవి విసర్జించే మలినాలు మా ఊరి చెరువుకు బట్వాడా అవుతుంటే
నాకంతా తారుమారుగా వుంది
ఎంతైనా ఈ నీరు తాగి ఇంతటి వాడినయ్యాను
ఒరే బాబూ ముక్కు మూసుకు నడవరా అని
మా ఊరి చెరువిప్పుడు హెచ్చరిస్తుంటే
ఒంట్లో ప్రవహిస్తున్న మా చెరువు నీళ్ళ
పైకి తన్నుకొచ్చి కళ్ళు మూసుకున్నాను’’
మరి ఈ పరిస్థితుల్లో ఊరికెలా వెళ్ళాలి? అమ్మా మీరే వచ్చేయండి అంటే చెరువులాగే పసరు నిండిన కళ్ళతో అలా చూడ్డం తప్ప అమ్మ మాత్రం ఏం చెబుతుంది? వ్యవసాయం వ్యాపారమైపోయింది. నోట్లు తప్ప నాట్లు లేవు. పచ్చదనం మచ్చుకైనా లేదు. ఏమీ కొనే స్థితి లేకున్నా నీళ్ళు మాత్రం కొనుక్కోలేకపోతే అక్కడ బతకడానికి అనర్హులే. ఇది ఓ గోదారి ఊరు గాథ. మా ఊరు పసరు చిత్రం.వాటర్ వాటర్ ఎవరివేర్. నో డ్రాప్ టూ డ్రింక్. దేశం మాట దేవుడెరుగు. నీళ్ళనే అందించలేని వారు ఇంక ఊళ్ళనేం ఉద్ధరిస్తారు? నీటికి కరువు లేని ఊళ్ళనే నీటి కరువు కాటేస్తున్న విషాదాన్ని ఏ మాటలతో వర్ణించాలి? ఏం చెప్పమంటారు? ఊరికెలా వెళ్ళను చెప్పండి?
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ