ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే, ఆయన తమ్ముడయిన స్వామినాధన్ అంకాళేశ్వర్ అయ్యర్ గురించి చాలామందికి తెలిసి ఉండదు. స్వామినాధన్ ప్రముఖ ఆర్ధిక నిపుణుడు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ‘స్వామినామిక్స్’ పేరిట ఓ వీక్లీ కాలమ్ రాసేవారు. అందులో చిత్రవిచిత్రమైన అభిప్రాయాలు ప్రకటించి మేధావులూ రాజకీయ కార్యకర్తల నోళ్లలో నానడం స్వామినాధన్ అయ్యర్ హాబీ. ఉదాహరణకి ఒకటి మనవి చేస్తాను – 1990 దశకంలో ఆర్ధిక వ్యవస్థ సరళీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులను టోకున పీకి పారేస్తున్న సమయంలో అయ్యర్ ఒక కాలమ్ రాస్తూ, ఈ విధానం వల్ల నిరుద్యోగం పెరుగుతుందన్న వాదం తప్పని వాదించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారంతా కుటుంబ సమేతంగా పొట్టకూటి కోసం పుట్పాత్లపై చిన్నా చితకా వ్యాపారాలు పెట్టుకుని ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంటారని ఆయన వాదించారు. ఆ విధంగా ఉద్యోగుల కుటుంబ సభ్యులందరినీ సంపాదనపరులుగా మారుస్తున్న విధానం తప్పెలా అవుతుందని ఆ ఆర్ధిక నిపుణుడు నిలదీశారు. ఆయన వాదనా పటిమకు – ముఖ్యంగా అయ్యర్ ధైర్యసాహసాలకు – దిగ్భ్రమ చెందినవారిలో పివి నరసింహారావు ఒకరంటారు!
ఇన్నాళ్లకు స్వామినాధన్ అయ్యర్ను జ్ఞాపకం చేసే రీతిలో మాట్లాడి – కేంద్ర ఆర్ధిక మంత్రి – మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ శభాషనిపించుకున్నారు. అంతకు మించి బడ్జెట్ పదజాలాన్ని ఇతోధికంగా సుసంపన్నం చేయడం ద్వారా తన స్మృజనాత్మకతను ఆమె మరోసారి ప్రదర్శించారు. ఆర్ధికమంత్రి సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘థాలినామిక్స్’ అనే పారిభాషిక పదాన్ని ప్రయోగించారు. థాలీ అనే హిందీ వాడుక మాటకు అన్నం తినే కంచం, విస్తరి అన్నది అర్ధం. ఒక పూట భోజనం అనే అర్ధంలో కూడా ఈ మాట వాడతారు. శాకాహార, మాంసాహార భోజనాల మీద యూనిట్ వారీగా పెట్టే ఖర్చు ప్రాతిపదికగా నిర్వహించిన సర్వేను మన మంత్రి మహోదయ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశంలోని పాతిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం దేశ జనాభా పుష్కర కాలంగా ఒక్కో భోజనంపై పెడుతున్న ఖర్చును ఆమె విశ్లేషించారు. ఈ విశ్లేషణలో తేలిందేమిటయ్యా అంటే, 2006-19 మధ్య కాలంలో సామాన్యుల కొనుగోలు శక్తి శాకాహార భోజనం మీద 29 శాతం, మాంసాహార భోజనం మీద 18 శాతం పెరుగుతూ వచ్చిందని మంత్రిగారి నిర్ధారణ!
ఈ పుష్కర కాలంలో సగానికి సగం మోదీ మహాశయుడి పాలనలోనే గడిచిఉండడం మంత్రిగారికి తెలియని విషయమేమీ కాదు! తమ పాలన కాలంలో ప్రజలు ‘సుభిక్షంగా’ వర్ధిల్లుతున్నారని గడుసుతనం వలకబోస్తూ సెలవిస్తున్నారు మన మంత్రి మహోదయ. కానీ, ఆర్ధికరంగంలో నిపుణుల అభిప్రాయాలు మంత్రిగారి సిద్ధాంత ప్రవచనాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గత ఆరేళ్లుగా దేశంలో ఆర్ధికాభివృద్ధి వేగంగా కుంటుపడుతూ వస్తోందని ఆర్ధిక నిపుణులు హాహాకారలు చేస్తున్నారు. డి-మానిటైజేషన్తో మొదలయిన మోదీ ఆర్ధిక విధాన వైఫల్యం కనీవినీ ఎరుగని ఫలితాలను తెచ్చిపెట్టిందన్నదే ఈ నిపుణులందరి ఏకాభిప్రాయం. అంతర్జాతీయ సంస్థల గణాంక వివరాలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. యుపియే పాలనా కాలంలో ఏడు ఎనిమిది శాతంగా ఉన్న అభివృద్ధి వేగం ఆరు కన్నా తక్కువకు పడిపోయిందని ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలు అందరికీ గుర్తుండే ఉండాలి.
ఆర్ధిక విధాన రంగంలో “మోడి”ఫికేషన్కు వ్యతిరేకంగా హాహకారాలు చేసేవాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సుబ్రమణియన్ స్వామి. ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ జ్ఞానపీఠం హార్వర్డ్ విశ్వవిద్యాలయం అనే మహావృక్షానికి పూసిన పువ్వే డాక్టర్ స్వామి. సరళీకృత పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం రంగంలో దిగ్గజాల్లాంటి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లాంటి సంస్థల్లో కీలక స్థానాల్లో తిష్టవేసుకుని కూర్చున్న వాళ్లతో సహా అత్యధికులు ఈ జ్ఞానపీఠానికి పూసిన పూలే. అంతకు మించి డాక్టర్ స్వామి బిజెపి అగ్రశ్రేణి నాయకుల్లో ప్రధమగణ్యులు!
ప్రపంచబ్యాంక్ – అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బ్రాండ్ ఆర్ధిక నిపుణుల్లోకే లెక్కకొచ్చే మరో ప్రముఖుడు అరుణ్ శౌరీ. వాజ్పేయీ ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఈ ప్రముఖుడు గత అర్ధ దశాబ్దంగా మోదీ ప్రభుత్వ ఆర్ధిక విధానాలను తూర్పార బడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు శౌరీ ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. దేశంలోని మోదీ వ్యతిరేకశక్తులన్నీ ఒకే తాటిమీదకు వచ్చి ఐక్యంగా నిలబడకపోతే దేశాన్నీ, మన ప్రజాస్వామ్యాన్నీ దేవుడు కూడా రక్షించలేడని శౌరీ హెచ్చరించారు.
ఇక రఘురామ్ రాజన్ సరేసరి! ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన విధాన పత్రాలను రాజన్ పెద్ద బాలశిక్ష – చిన్న బాలశిక్షలుగా అధ్యయనం చేస్తారని అంటారు. సరళీకృత ఆర్ధిక విధానాలకే తన మేధస్సు సర్వస్వాన్నీ ధారపోసిన ఆర్ధికవేత్త రాజన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జనరల్గా ఆయన ప్రసిద్ధి పొందారు. అలాంటి వ్యక్తి డిమానిటైజేషన్తో మొదలయిన “మోడి”ఫికేషన్ విధానాలను ఎప్పటికప్పుడు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు.
“మోడి”ఫికేషన్ ఆర్ధిక విధానాలను ఎక్కడికక్కడ విమర్శిస్తూ వస్తున్న ఇదే బాపతు మేధావులు అనగా ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బ్రాండ్ ఆర్ధిక నిపుణులు మరెందరో ఉన్నారు. పి. చిదంబరం మొదలుకొని రామ్ జెత్మలానీ వరకూ వీళ్లు ఏ పార్టీలో ఉన్నా అందరిదీ ఒకటే వాణి అందరిదీ ఒకటే బాణి. ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా “మోడి”పికేషన్ ఆర్దిక విధానాలను బలంగా సమర్ధిస్తూ వచ్చినవాళ్లు ప్రధానంగా ఇద్దరు. ఒకరు కీర్తిశేషులు అరుణ్ జైట్లీ. రెండో వ్యక్తి ప్రస్తుత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్!
పోయినోళ్లు అందరూ మంచోళ్లన్న కవి వాక్కును గౌరవించి అరుణ్ జైట్లీని పక్కనపెట్టండి. ఇన్నాళ్లకి నిర్మలా సీతారామన్ తన సృజనాత్మకతను “థాలినామిక్స్” ద్వారా ప్రదర్శించినందుకు ఆమెను అభినందించి తీరాల్సిందే మరి. అబివృద్ధి చెందుతున్న దేశం అనే దశ నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే దశకు మన ఆర్ధిక వ్యవస్థను తీసుకుపోతానని మోదీ చెప్పారు. ట్రంప్ లాంటి ఆయన శ్రేయోభిలాషులు కూడా ఆ దిశగా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ పూట కూడు ప్రాతిపదికగా మన ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యం పరమాద్భుతంగా ఉందని రుజువు చేసే సాహసానికి మాత్రం ఇంతవరకూ ఎవరూ తెగించలేదనే చెప్పాలి. అత్యంత ప్రాధమికమైన అవసరాల ప్రాతిపదికగా అభివృద్ధిని నిర్ధరించడం ఏ శాస్త్రమయినా కాగలదు కానీ అర్ధశాస్త్రం మాత్రం కాజాలదు.
కడుపు కాలుతున్న వాడు నాలుగు మెతుకులు నోట్లో వేసుకోవడం, గోచిపాతరాయుడు తన మానం కాపాడుకోవడానికి మూరెడు బట్టను ఉపయోగించడం కనీస అవసరాలు తీర్చుకోవడం కాగలదు కానీ అభివృద్ధికి సూచికలు కాజాలవు! జేఎన్యూ లాంటి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన మంత్రి మహోదయకు ఇంత చిన్న విషయం తెలియదనుకోవడం కష్టం!!
-మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ