ఈ మధ్య నా కలల నిండా పిల్లల్ని ఎత్తుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న తల్లులే కనిపిస్తున్నారు
ఢిల్లీ తల్లులు..కాన్పూర్ తల్లులు..లక్నో తల్లలు..ముంబై తల్లులు..
బీహార్, రాజస్థాన్, పంజాబ్, హైదరాబాద్, కాశ్మీర్, అహ్మదాబాద్ ఎటు చూసినా..తల్లులే తల్లులు..
నగరాల్లో తల్లులు పట్టణాల్లో తల్లులు వీధుల్లో తల్లులు
గుంపులు గుంపులుగా తల్లులు..కన్నీళ్ళతో తల్లులు..కలతలతో తల్లులు..కల్లోల హృదయాలతో తల్లులు
పిల్లల్ని ఒడుల్లో పెట్టుకుని..పిల్లల్ని భుజాలపై పెట్టుకుని..పిల్లల్ని గుండెలపై పెట్టుకుని
పిల్లల్ని చేతులతో పట్టుకుని..పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని నినదిస్తున్న తల్లులు
పిల్లల్ని అరచేతుల్లో పట్టి ఆకాశానికి చూపిస్తున్న తల్లులు
ఇప్పుడు నా కలల నిండా తల్లులు..పిల్లలు..తల్లడిల్లుతున్న తల్లీపిల్లలు
పిల్లల మొహాల్లోకి చూసి భయపడుతున్న తల్లులు
తల్లుల కళ్ళల్లోకి చూసి బావురుమంటున్న పిల్లలు
ఏమిటిదంతా? ఎందుకిదంతా?
రోజుకో అయిదొందల కూలీ కోసమే అన్న ఆ పెద్దమనిషి ఎవడో గాని వాడికి తల్లులంటే ఎవరో పిల్లలంటే ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఆ పాఠం కోసం తప్పకుండా షాహీన్ బాగ్ వెళ్ళాలి. అక్కడ సమూహాలు సమూహాలుగా నిరసన వ్రతం చేస్తున్న తల్లులను పిల్లలనూ ఒకసారి కళ్ళారా చూసి రావాలి.
నీచమైన వ్యాఖ్యలతో..చవకబారు నిందలతో..ద్వేషపూరిత ఉన్మాదంతో తల్లులనూ పిల్లలనూ బెదరగొట్టలేమని అతనికి అర్థమవుతుంది. అక్కడ అర్థం కాకుంటే షాహీన్ బాగ్ తల్లులకు మద్దతుగా నగరాలకు నగరాలే కదిలిపోతున్న దృశ్యాలు చూడాలి. అయినా ఇదంతా ఒక వర్గం వారే, అణచివేయడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటే లావాలు వెదజల్లుతున్న యూనివర్సిటీల అగ్నిపర్వతాల్ని చూడాలి. కళ్ళుండీ చూడని వారు..చెవులుండీ వినని వారు..గుండెలుండీ కరగని వారు దేశం నెత్తి మీద మంటల మబ్బులు కప్పుతారు.
అంతే కదా! కానీ ఎవరిని తగలబెడతారు? ఎందరిని తగలబెడతారు? మంటలకు మతం తెలీదు. మంటల్లో మాడిపోయేవారు ఒక మతం వారుండరు. ఒక దగ్ధ భారతాన్ని రచిస్తున్న స్వార్థశక్తులు మరెంతకాలం తమాషా చూడగలవు?
తల్లులు హెచ్చరిస్తున్నారు. మనది మతరాజ్యం కాదని గుర్తుచేస్తున్నారు. పిల్లల నొసళ్ళ మీద రాజ్యాంగాన్ని చిత్రిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన గుండెకాయ అని ఘోషిస్తున్నారు. లౌకిక ధర్మాన్ని కాపాడుకుందామని ప్రాధేయపడుతున్నారు. దేశాన్ని సహజీవన సౌందర్య ప్రతీకగా నిలబెడదామని బోధిస్తున్నారు.
తల్లులే ఇప్పుడు. తల్లుల తల్లులు..కాబోయే తల్లులు. దేశమంతా నడుం చుట్టూ చున్నీ బిగించి కదులుతున్న స్వప్నాలే నన్ను చుట్టుముడుతున్నాయి. తిండి కోసం కాదు..ఉపాధి కోసం కాదు..గూడుకోసం గుడ్డ కోసం కాదు. తమ ఉనికి కోసం..తమ ఉనికితో ముడిపడిన దేశం ఉనికి కోసం రోడ్డెక్కిన మహిళా సముద్రాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
రోడ్ల మీద నిద్రపోయి..రోడ్ల మీద నిద్ర లేచి..రోడ్ల మీద వంటలు చేసి..రోడ్ల మీద పిల్లలకు స్నానాలు చేయించి..రోడ్ల మీద ప్రార్థనలు చేసి..రోడ్ల మీద జీవితాలు పరిచిన తల్లులు ఇప్పుడు దేశమంతా పుట్టుకొస్తున్నారు. అయ్యా దేశాన్ని ఇలా రోడ్ల పాలు చేసినందుకు మీకు శతకోటి వందనాలు.
దేశమంటే చట్టాలు కాదు..దేశమంటే లాఠీలు కాదు..దేశమంటే సైనిక కవాతులు..విషవాయు ప్రయోగాలు అసలే కాదు. దేశమంటే తల్లులూ పిల్లలూరా బాబూ. దయచేసి మీరు మరీ మరీ గుండెల్ని కళ్ళుగా మార్చి చూడాలి.
ఎందుకంటే వారు తల్లులు కదా. కోటి కలల శిశువుల జన్మల కోసం గర్భాశయాలను మోసుకుంటూ వచ్చే మన దేవతలు వారు. ప్రేమిస్తారు..పాలిస్తారు..నెత్తురిస్తారు. అవసరమైతే ప్రాణాలిస్తారు.
అంటుకుంది దేశం తల్లుల ఆక్రోశాల అగ్నిజ్వాలలతో. నీళ్ళతో ఆర్పలేరు. కన్నీళ్ళతో తప్ప.
కాస్త మీకళ్ళల్లో నిప్పుల్ని ఆర్పి నీళ్ళు నింపండి
ఆ తల్లులు ఆ పిల్లలు నా కలల్లోనే కాదు..మీ కలల్లో కూడా నీడలై ధారాపాతంగా కురుస్తారు
జాగ్రత్తపడండి.
మనందరి తల్లుల కోసం మనందరి పిల్లల కోసం
-డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ