మహారాష్ట్ర రాష్ట్రంలోనే అది పెద్ద కారాగారం అయిన ఎరవాడ కేంద్ర కారాగారం ఖైదీలని అష్టకష్టాలు పెట్టడంలో ప్రసిద్ధి గాంచింది.
ఎరవాడ కేంద్ర కారాగారంలో క్రితం నెల 80 సంవత్సరాల వరవరరావు పడుకోవడానికి పరుపు అడిగారు. అడిగింది పరుపు అయితే ఆయనకు ఇచ్చింది అదనపు దుప్పట్లు. ఆయన న్యాయవాది ఈ విషయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించినప్పుడు ఇచ్చిన ఆ దుప్పట్లనీ వెనక్కి తీసేసుకున్నారు.
భీమా కొరేగావ్ కేసులో గత సంవత్సరం జూన్, ఆగస్ట్ నెలల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిలో హైదరాబాదు వాసి కవి, సామాజిక కార్యకర్త అయిన వరవరరావు ఒకరు. మహారాష్ట్ర పోలీసుల కథనం ఏమిటంటే పూణే దగ్గరలోని భీమా కొరేగావ్ గ్రామంలో 2018 జనవరి 1 నాడు హింసని ప్రేరేపించటానికి నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తో కలిసి పనిచేశారు అని. నవంబర్ నెలలో సమర్పించిన నేరారోపణ పత్రంలో పేర్కొన్నదేమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చడానికి, దేశాన్ని అస్థిరపరచడానికి పన్నిన పెద్ద కుట్రలో ఇది ఒక భాగం అని. భద్రతా నిపుణులు ఈ కథనాలని ప్రశ్నిస్తూ ఈ ఆరోపణలకి “కట్టు కథలకి ఉండవలసిన ముఖ్యలక్షణాలు” అన్నీ ఉన్నాయి అని పేర్కొన్నారు.
పూణే పోలీసులు ఫిబ్రవరి 2 నాడు మరోకరిని ముంబాయిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అధ్యాపకులు అయిన ఆనంద్ తెల్తుంబ్డే. హైకోర్ట్ ఈ అరెస్ట్ చట్ట వ్యతిరేకం అని ఉత్తర్వులు ఇచ్చాక మరుసటి రోజు ఆయన్ని విడిచి పెట్టారు. ఆ తరువాత బొంబాయి హైకోర్ట్ ఆయనకీ ఫిబ్రవరి 12 వరకు అరెస్ట్ నుండి రక్షణ కలిపించింది.
జనవరి మధ్యలో తెల్తుంబ్డే, తను ఆ నెల మొదట్లో తనపై మోపిన అభియోగాలను కొట్టివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించినపుడు తన ఆశలు ఏ విధంగా ఆడుగంటాయో వివరిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. “నాకు అరెస్ట్ అంటే కేవలం కారాగార జీవితంలో ఉండే కష్టాలే కాదు” అని గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్, అలాగే నిరంతరంగా రచనలు చేస్తూ ఉండే ఆనంద్ తెల్తుంబ్డే రాశారు. “ అది నన్ను నా శరీరంలో ఒక అంతర్భాగంగా ఉంటున్న లాప్ టాప్ నుండి, నా జీవితంలో ఒక భాగమైపోయిన నా గ్రంధాలయం నుండి, సగం రాసిన రచనలు నుండి , ప్రచురణకర్తలకి మాట ఇచ్చిన పుస్తక రచనల నుండి, వివిధ దశలలో ఉన్న పరిశోధన పత్రాల నుండి, నా వృత్తి ప్రఖ్యాత మీద తమ తమ భవిష్యత్తు గురించి నమ్మకం పెట్టుకున్న విద్యార్ధుల నుండి, నా మీద ఎన్నో వనరులని పెట్టుబడి పెట్టి ఈ మధ్యనే ఆ సంస్థ బోర్డు సభ్యుడిగా నియమించిన నేను పని చేస్తున్న సంస్థ నుండి దూరంగా ఉంచుతుంది.”
ఇది ఏమి అన్యాయమైన ఊహ కాదు. ఈ కేసులో అదుపులోకి తీసుకుని ఎరవాడ కేంద్ర కారాగారంలో ఉంచిన తొమ్మిది మంది ముద్దాయిల స్నేహితులతోనూ, న్యాయవాదులతోను ‘స్క్రోల్.ఇన్’ వెబ్సైట్ మాట్లాడింది. వారు చెప్పేది ఏంటంటే ప్రాధమిక సౌకర్యాలు అయినటువంటి బట్టలు, వైద్య పత్రాలు, చదువుకోవడానికి పుస్తకాలు, పత్రాలు లాంటి వాటి కోసం కూడా న్యాయస్థానానికి వెళ్ళవలసి వస్తుంది అని. ఒక న్యాయవాది అంచనా ప్రకారం జూన్ నెల నుండి ఆహార పదార్ధాలు, బట్టలు, పుస్తకాల కోసం ఇప్పటికి 25 దరఖాస్తులు కోర్టులో దాఖలు చేశారు.
వరవరరావు దరఖాస్తు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.
‘పరోక్ష చిత్రహింస’
ఒకానొక మొదటి ఫిర్యాదు జూన్ నెలలో నాగపూర్ లో అరెస్ట్ అయిన నాగపూర్ విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖాధిపతి షోమా సేన్ నుండి వచ్చింది.
“ మా అమ్మ గత పదిహేను సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థరైటీస్తో బాధపడుతున్నది. అందువలన గొంతుక్కూర్చునే ఇండియన్ టాయిలెట్ వాడటం తనకి కుదరటం లేదు.” అని సేన్ కుమార్తె కోయల్ సేన్ పేర్కొన్నారు.
ఆ నెలలోనే దానికి అయ్యే ఖర్చు తన కుటుంబ సభ్యులు కడతారని, తనకొక పోర్టబుల్ కమోడ్ కావాలని షోమా సేన్ అభ్యర్దించింది. కారగార అధికారులు మిగతా కారాగార వాసులకి కూడా అటువంటి సదుపాయం కలిపించాల్సి వస్తుంది అని కారణం చెప్పి ఆ అభ్యర్ధనను తిరస్కరించారు. వైద్య ధృవపత్రం అడిగారు. పోర్టబుల్ కమోడ్ అందచేయ్యమని న్యాయస్థానం ఆదేశించాక కూడా దానిని అందచెయ్యటంలో కారాగార అధికారులు ఆలస్యం చేశారు.
“ఇది పరోక్ష చిత్రహింస” అని కోయల్ సేన్ అన్నారు. “చివరాఖరికి మీడియాని ఇందులో భాగస్వాములని చేశాక ఆ మరుసటి రోజే కమోడ్ అందచేశారు. కానీ ఇది లేకపోవటం వలన రెండు నెలలు పాటు తను ఇబ్బంది పడుతూనే ఉంది.”
అటవీ హక్కుల కార్యకర్త అయిన మహేష్ రౌత్ తన పిత్తాశయం నుండి రక్తస్రావం అవుతుండడంతో పరీక్ష చేయించుకోవడానికి నాగపూర్ వచ్చినప్పుడు జూన్ నెలలో అదుపులోకి తీసుకున్నారు. అది కేన్సర్ కారకమా కాదా అని తెలుసుకోవడానికి రౌత్ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంది. అదుపులోకి తీసుకున్న రెండువారాల తరువాత-జూన్ 23న- ఈ విషయాన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వైద్యుల దగ్గరికి రౌత్ను తీసుకువెళ్లాలని న్యాయస్థానం ఆదేశించినట్టు ఆయన న్యాయవాది నిహాల్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు.
ఒకసారికి మాత్రం కారాగారం అధికారులు రౌత్ను తీసుకువెళ్ళారు. మరొకసారి పరీక్షకి తీసుకురావలసిందిగా ఆ వైద్యులు చెప్పారు. కానీ కారాగార అధికారులు దీనిని ఆలస్యం చేశారు. ఏరోజైతే రౌత్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలో దానికి ఒక్కరోజు ముందు మాత్రం అక్కడ వైద్యులు ఉన్నారా లేరా అని ముందస్తుగా వాకబు చెయ్యకుండా తీసుకువెళ్తున్నారు అని రాథోడ్ చెప్పారు. జూన్ నుండి రౌత్ వైద్యులని కలవటం అవ్వలేదు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం ప్రకారం నక్సలైట్లగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కేసులని చాలా ఫలవంతంగా వాదించి గెలిచిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ని కూడా జూన్లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న రెండు రోజులకి గాడ్లింగ్ అధిక రక్తపోటుకి గురి అయ్యారు. ఇది గుండె పోటుకి దారి తీస్తుందేమో అని భయం వేసింది. వైద్యం కోసం పూణేలోని శాసూన్ వైద్యశాలకి తనని తీసుకువెళ్ళారు. అక్కడ తనని కలవటానికి ఆయన భార్యకి కూడా అనుమతి ఇవ్వలేదు. 15,000 రూపాయలు విలువ చేసే మందులు కొనమని తన భార్యకి చెప్పినా, ఆ మందులు మాత్రం వెంటనే గాడ్లింగ్ కి అందలేదు.
ఆ సమయంలోని తన వైద్య పత్రాలు బయట ఉండే ఎవరైనా ఒక వైద్య నిపుణులు పరీక్షించాలని గాడ్లింగ్ కోరుకున్నారు. ఆసుపత్రిలో తనకి చేసిన ఏంజియోగ్రఫి పరీక్షలో తనకి ధమనులలో అవరోధాలు ఏర్పడ్డాయి అని తేలినట్లు ఆయనకు అనుమానం. కానీ ఇప్పటికి ఏడు నెలల తరువాత కూడా ఆ వైద్య పత్రాలు ఇవ్వటానికి ఆసుపత్రి, కారాగార అధికారులు నిరాకరిస్తున్నారు.
ఆశకి ఆవల ప్రాంతం
కారాగారాల ఇన్స్పెక్టర్ జనరల్కి కేంద్ర కార్యాలయం అయిన ఎరవాడ కేంద్ర కారాగారం మహారాష్ట్ర లోనే అతి పెద్ద కారాగారం. అందులో ఆ కారాగారం సామర్ధ్యానికి మించి జనం ఉన్నారు. దాని సామర్ధ్యం 2,500 మంది కాగా 2017 లో అందులో సుమారుగా 5,000 మంది ఉన్నారు. అంతేకాక వాళ్ళు నిందితులు అయినా, దోషులు అయినా అక్కడ వారికి చాలా కఠినమైన పరిస్థితులే ఎదురవుతాయి.
చట్టం ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలు నేరం రుజువయ్యేవరకూ దోషులు కారు. కాబట్టి కారాగారంలో వారికి కాస్త ఎక్కువ సౌకర్యాలు లభిస్తాయి. కాని ఎరవాడలో మాత్రం కాదు అని న్యాయవాదులు చెప్పారు. ముఖ్యంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమ హక్కు కోసం పోరాడవలసిందే అని వారు పేర్కొన్నారు.
“ఈ కారాగారానికి వచ్చిన వారు పూర్తిగా ఆశలు వదిలేసుకుని వస్తారు.” అని ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలకి న్యాయవాదిగా ఉన్న రోహన్ నహర్ పేర్కొన్నారు. “ అరుదుగా మాత్రమే ఇక్కడ జనాలు తమ హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఈ కేసులో అలా ఆశ్రయిస్తున్నారు అంటే వీరందరూ బాగా చదువుకున్నవారు, తమ హక్కులు గురించి తెలిసినవారు కాబట్టి.”
ఈ కారాగారంలో ఇంతకుముందు శిక్ష అనుభవించి పేరు చెప్పటానికి సుముఖత వ్యక్తం చెయ్యని ఒకరి ప్రకారం ఈ కారాగారంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. “పట్టణంలో నీటి ఎద్దడి ఉంటే రెండు రోజులపాటు నీరు లేకుండా గడిపేవాళ్ళం” అని అతను పేర్కొన్నారు. “గచ్చు కడగటానికి మంచినీరు వాడేవారు, మాకు తాగటానికి మురికి నీరు ఇచ్చేవారు. ఇక్కడ పరిస్థితులు నరకమే.”
పుస్తకాలకి అనుమతి లేదు
అనుభవజ్ఞుడు అయిన గాడ్లింగ్ తన కేసుని తనే వాదించుకుంటున్నారు. జూన్ నెలలో తను చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, క్రిమినల్ మాన్యువల్ లాంటి ఏడు పుస్తకాలు కావాలని విజ్ఞాపన అందచేశారు. న్యాయస్థానం ఈ విజ్ఞాపనకి అంగీకరించింది. కానీ రాథోడ్ ఈ పుస్తకాలు అందచేయ్యటానికి వెళ్ళినప్పుడు మొదట్లో కారాగారం అధికార గణం ఒప్పుకోలేదు.
అధికార గణం అనేక రకాలుగా ఇందులో జోక్యం చేసుకుంది. గాడ్లింగ్ జామీను దరఖాస్తు రాసి రాథోడ్ గాడ్లింగ్ కి పంపితే అది తెరిచి చూసి అందులో ఉన్న ఉత్తరాన్ని రాథోడ్కి తిరిగి పంపించింది. ఇంకొక అనుభవజ్ఞులైన న్యాయవాది ఈ కేసుకి సంబంధించి గాడ్లింగ్కు నోట్స్ పంపితే దానిని కూడా తిరిగి పంపించేశారు. ఆ నోట్స్ మొత్తం చింపి, చిందర వందర చేసి పంపారు.
ఇది కేవలం న్యాయ పుస్తకాలకి మాత్రమే పరిమితం కాదు. పురస్కారాలు గెలుచుకున్న, అక్షయ్ ముకుల్ రచించిన గీతా ప్రెస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా పుస్తకం కోసం రౌత్ సెప్టెంబర్ నెలలో విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వ న్యాయవాదులు ఈ పుస్తకం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని దానిని ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. ఈ తొమ్మిది మంది ఏ పుస్తకం అడిగినా కూడా ఆ విజ్ఞప్తి ముందు ప్రభుత్వ న్యాయవాది దగ్గరికి వెళ్తుంది. తను అ పుస్తకాన్ని ముందు చూస్తారు.
మొదట్లో జైలర్ కారాగార గ్రంధాలయంలో 30,000 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఇరుకుగా ఉన్న కారాగారంలో వేరే పుస్తకాలు అనుమతించడం అనవసరం అని తిరస్కరించేవాడు అని ఇద్దరు ముద్దాయిలకి న్యాయవాదిగా ఉన్న రాహుల్ దేశ్ ముఖ్ పేర్కొన్నారు. న్యాయస్థానం చివరికి 20 పుస్తకాలు వరకూ అనుమతి ఇచ్చింది. జైలర్ దఫాకి ఏడు నుండి తొమ్మిది పుస్తకాలు వరకూ ఖైదీలకి ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మిగతా పుస్తకాలు గ్రంధాలయంలో ఉంచారు.
స్క్రోల్.ఇన్ ఎరవాడ కారాగారంలో ఉన్న మహారాష్ట్ర డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు)ను సంప్రదించేందుకు ప్రయత్నించింది. అటునుండి ఎటువంటి జవాబు లేదు.
హక్కుల గురించి అవగాహనా రాహిత్యం
అతి కొద్ది మంది విచారణలో ఉన్న ఖైదీలకి మాత్రమే తమ హక్కుల గురించి అవగాహన ఉంది.
ఉదాహరణకి ఐదు సంవత్సరాల క్రితం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టే పద్ద్దతి మొదలయిన దగ్గర నుంచీ వాయిదా ఉన్న రోజున అరుదైన సందర్భాలలో మాత్రమే న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు. అందుకు బదులుగా వారిని జైలులోనే ఉంచి, వారి చుట్టు పక్కల రక్షక భటులు ఉంటున్నారు. విచారణలో ఉన్న ఖైదీలు తమ న్యాయవాదికి ఏమన్నా చెప్పుకోవాలంటే బెదిరించటానికి ఈ భటులు ఉన్నారు. జనాలు తమ న్యాయవాదులని కలుసుకునేటప్పుడు ఈ భటులు ఉంటున్నారు. అందువలన వారు తమ న్యాయవాదులతో గోప్యంగా మాట్లాడలేకపోతున్నారు.
“ కేవలం చిన్న చిన్న నేరాలు చేసినా కూడా పేదవారైన ఖైదీలు కొన్ని సంవత్సరాలకి ఒక సారి కూడా కారాగారం గోడల బయటకి రాలేరు” అని మాజీ ఖైదీ ఒకరు పేర్కొన్నారు. “మనం కనుక ఈ విషయం మీద ఫిర్యాదు చేస్తే దృశ్య మాధ్యమ సమావేశాలు కానీ మామూలు సమావేశాలు కాని రద్దు చేస్తారు. దానితో మనకి బయటవారితో మాట్లాడే అవకాశమే పూర్తిగా పోతుంది.”
అదుపులోకి తీసుకున్న ఈ తొమ్మిది మంది పెద్ద స్థాయి వారు అవ్వటం వలన ప్రతి వాయిదాకి వీరిని న్యాయస్థానానికి తీసుకువెళుతున్నారు. దీనితో మిగతా ఖైదీల నుండి కూడా తమని కూడా కోర్టుకు తీసుకువెళ్లాలని డిమాండ్లు వస్తున్నాయి.
న్యాయస్థానాలు కూడా విచారణలకు తగిన విధంగా లేవు. అండర్ ట్రయిల్స్ను కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకువెళ్లినపుడు వారిని ఉంచే లాకప్ రూముల్లో టాయిలెట్ సౌకర్యం ఉండదు. అంటే విచారణలో ఉన్న ఖైదీలు టాయిలెట్కి వెళ్ళాలంటే తమను ఉంచిన గదిలోనే ఆ పని కానిచ్చేయ్యాలి అని అర్థం అంటారు రాథోడ్. ఈ విషయం గురించి గాడ్లింగ్ దరఖాస్తు చేసిన తరువాతనే వారిని మరుగుదొడ్డికి తీసుకువెళుతున్నారు. న్యాయస్థానంలో ఈ విచారణలో ఖైదీలని ఉంచే గదిలో ఇప్పటికీ లైటు లేదని రాథోడ్ పేర్కొన్నారు.
మృదులా చారి
‘స్క్రోల్.ఇన్’ వెబ్సైట్ సౌజన్యంతో