అందరిలాంటోడివే నువ్వూ అనుకుంటే సరిపోయేదే. అనుకోలేదు. ఎవరనుకోలేదు? ఇదీ ప్రశ్న. కమ్యూనిస్టులు అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! యువకులు చాలా మంది అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! అభ్యుదయవాదులు..ప్రజాస్వామ్య వాదులు అనుకోలేదా? ఏమో అనుకోలేదేమో! నీ గుండెల మీద చేగెవారా బొమ్మ చూసి మురిసిపోయి వుంటారు. ఇంకా చాలా మందిలాగే నేను కూడా కొంచెం ఎక్కడో మనసులో నీ మీద మమకారం పెంచుకునే వుంటాను. రెండు బలమైన సామాజిక వర్గాల ఆధిపత్యాలకు ధీటుగా నువ్వు నిలబడి బడుగు బలహీన వర్గాలకు పొలిటికల్ హీరోగా వెలిగిపోతావని నేనూ అనుకునే వుంటాను. అన్నింటికంటె ముఖ్యంగా నువ్వెప్పుడూ శ్రీశ్రీ, శేషేంద్రల కవితా వాక్యాలను నినాదాలుగా వల్లిస్తే ఒక కవిగా నాకు భలే గొప్పగా అనిపించేది. ఎంతైనా వీడిలో ఏదో వుందిరా బుజ్జీ అనుకునేవాడిని. ఒకప్పుడు తెలీక ఆ తెలుగుదేశంతో పాటు కాషాయం వారితో కలిశాడులే కానీ మనోడు ఎంతకంతే మంచోడురా బ్రదరూ అని లోపలెక్కడో ఏదో ఆశతో వుండే వాడిని.
ఇప్పుడు చరిత్రలో గొప్ప విప్లవకారులుగా పేరుపొందిన వారి పేర్లు వల్లించే వారి నిజాయితి పట్ల..వారి రాజకీయ పరిణతి పట్ల నమ్మకం పోతోందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను చెలికాడా. ‘’నేనింతా గుప్పెడు మట్టే కావొచ్చు. కానీ తలెత్తితే ఒక దేశం జెండాకున్నంత పొగరుంది నాకు’’ అని శేషేంద్ర అన్న కవితా వాక్యం నీ నోట వింటే పులకింత కలిగేది. కానీ దేశాన్ని స్వార్థ ప్రజయోజనాల కోసం విభజించి పాలించే కాషాయ పతాకమే నీ పొగరు కావడం జీర్ణించుకోలేనంత వగరుగా వుంది. విజయమే పరమావధిగా ఎత్తులు..పొత్తులు కొనసాగడం రాజకీయాల్లో సహజమే. తప్పులేదు. రేపో మాపో తెలుగుదేశం వారు కూడా కాషాయ వర్ణం పూసుకుని ఊరేగినా హాశ్చర్యం లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు నిజమే. శత్రువు శత్రువు మనకు మిత్రుడవుతాడు అదీ నిజమే. కానీ దేనికైనా ఒక లెక్కుండాలి కదా! నీకు తిక్కుంది నిజమే కాని ఈ తిక్కకు ఏ లెక్కుందో నీకైనా తెలుసా సోదరా?
పౌరసత్వ చట్టం తెచ్చి దేశానికి నిప్పు పెట్టిన వారితో దోస్తీ కడతానంటే నీ టైమింగుని ఎలా అవగాహన చేసుకోవాలో నీ లెక్కేంటో నువ్వే చెప్పాలి మరి. చెప్పలేవు. నోట్లోంచి కాషాయం కురుస్తున్నప్పుడు చెగెవారా మాటలు రావు. మోడీ షాల మాటలే వస్తాయి. క్రీస్తు శిలువ మోసినట్టు రైతు నాగలి మోస్తున్నాడని కదా శేషేంద్ర అన్నాడు. నువ్వు కూడా ఎన్నిసార్లు అనలేదు చెప్పు? ఇప్పుడు అల్ప జనుల భుజాల మీద శిలువ పెట్టి తమాషా చూస్తున్న వారిని నీ సహసైనికులుగా ప్రకటిస్తే లక్షలాది నీ జనసైనికులకు ఏది దిక్కు మిత్రుడా? ఏమో నిన్నే నమ్ముకున్న వారు నీ దారినే నడుస్తారేమో! దేశాన్ని ముక్కలు చేసే వారిని నీ దోస్తులుగా చేసుకుంటున్నావు. మరి దేహాలు ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వమంటున్న యువకులు నీ వెంట ఎలా నడుస్తారు కామ్రేడ్? ‘’సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు. పర్వతం ఒకడికి వొంగి సలాం చేయదు’’. ఈ శేషేంద్ర మాటలే కదా నువ్వు భట్టీపట్టి మరీ తొడకొట్టి చెప్పావు. ఇప్పుడిలా పర్వతాలనీ సముద్రాలనీ తుఫానుల్నీ నియంతల పాదాల దగ్గర ఊడిగం చేయించే బృహత్కార్యానికి ఎలా తలపడ్డావు నేస్తం? నీకిష్టమైన శేషేంద్ర మాటలే మళ్ళీమళ్ళీ గుర్తుకొస్తున్నాయి తమ్ముడూ.
‘’రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా
లోకబాంధవుడసలే లేకుండా పోతాడా?’’
అవును కదా. ఇప్పుడు దేశానికి రాహువు పట్టింది. కాని ఇది తాత్కాలికమే అనుకుంటున్నాం. మత రాహువు పటాపంచలై జనహిత భానుడి ప్రచండోదయం తప్పదని విశ్వసిస్తున్నాం. నువ్వు రాహువులో భాగమవుతావో..వేకువలో ఏకమవుతావో నువ్వే తేల్చుకోవాలి. రాజకీయాల కోసం ఏ స్తంభాల ఆటలైనా ఆడు. దేశానికి మూల స్తంభమైన సహజీవన సౌందర్యాన్నే ధ్వంసం చేసే కర్కోటక ఆటలాడే వారితో కలిసేది మాత్రం రాజకీయం కాదు. ఐక్యపోరాటాల పేరుతో ఎవడితోబడితే వాడితో చేయికలిపితే చివరికి ఏం మిగిలిందో కమ్యునిస్టుల అనుభవం కంటే గొప్ప గుణపాఠం చరిత్రలో మరొకటి ఏమున్నది స్నేహితుడా? సొంతలాభం కొంత మానుకోమని మహాకవి చెప్పిన మాట ఎవడికీ చెవికెక్కలేదు. చివరికి నీక్కూడా అంతేనా?
క్షమించు కల్యాణ్.. నీ తాజా రాజకీయ పొత్తు, వ్యూహం కాదు..అది ఏ దాహమో నీకు తెలియంది కాదు. సరే కానీయ్. ఇకనిప్పుడు గుండెల మీద చెగెవారా బొమ్మ తీసి మోషా బొమ్మ వేసుకొంటావేమో. ఒళ్ళంతా కాషాయం పూసుకుంటావేమో. నెత్తుటి చరిత్రలో నీ లెక్క ఎలా సరిచూసుకుంటావో భయంగా వుంది హితుడా. నువ్వు ముఖ్యమంత్రివి కావొచ్చు..ప్రధానమంత్రివి కావొచ్చు. చెగెవారా అనుచరుడివి మాత్రం కాలేవని బాధగా వుంది సహోదరా. క్షమించు కల్యాణ్ నిన్ను కీర్తించలేను.
డా. ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ