కరోనాతో కులాన్ని అంటగట్టే మేధావుల కోసం..!!
కాశీ యాత్రకు వెళ్లి వచ్చిన ఎనిమిది మంది యాత్రికులకు.. వాళ్లను తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ కు.. మొత్తం 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు. ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మార్చిలో బయలుదేరి కాశీ, చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలను సందర్శించారు. లాక్ డౌన్ ప్రకటించడంతో వీరంతా కొద్దిరోజులు కాశీలోనే ఉన్నారు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకుని ఈ నెల 2న రాజమండ్రి చేరుకున్నారు. వీరి ఫలితాలు శుక్రవారం పాజిటివ్ గా వచ్చాయి. వీరందరూ దాదాపు ఏడు పదుల వయస్సు నిండిన వారే. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇంకా వందమందికి పైగా యాత్రికులు ఉన్నట్లు సమాచారం. మిగతా జిల్లాల్లోనూ ఇలాంటి వారు ఉండడంతో వీరందరి పైన దృష్టి పెట్టాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇక్కడ..
కరోనా కు కులం తెలియదు.
తమిళనాడు రాష్ట్రాన్ని కరోనా కేసులు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. రాష్ట్రంలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం కోయంబేడు మార్కెట్. ఇది చాలా పెద్దది. నిత్యం వేల సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. సరిహద్దు జిల్లా అయిన చిత్తూరు నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఆ మార్కెట్ కు వెళ్తుంటారు. వీకోట సత్యవేడు వరదయ్యపాలెం నాగలాపురం గుడిపాల మండలాల్లో శుక్రవారం ఒక్క రోజే 20 కొత్త కేసులు బయటపడ్డాయి. అవన్నీ కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉన్నవే. బాధితులంతా వ్యాపారులు, డ్రైవర్లు, క్లీనర్లు. ఆ మార్కెట్ కు వెళ్లి వచ్చిన సుమారు 185 మందిని గుర్తించారు. ఇంకా చాలా మంది ఉన్నట్లు సమాచారం. కోయంబేడు మార్కెట్ కారణంగా చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగనుందని అధికారులు చెబుతున్నారు. డిల్లీ జమాతే కేసుల తర్వాత ఇప్పుడు మనం మళ్లీ వారణాసి, కోయంబేడు లింకులతో భయపడాల్సి వస్తోంది. ఇక్కడ కూడా..
కరోనా కు కులం తెలియదు.
కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం విజలాపురానికి చెందిన డ్రైవర్ కుటుంబం పట్ల స్థానికులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. ట్యాంకర్ వద్ద నీళ్ళు కూడా పట్టుకోనివ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడా..
కరోనా కు కులం తెలియదు.
తిరుపతి ఆసుపత్రిలోని ‘క్యాజువాలిటీ ‘లో పనిచేసే ఒక పీజీ డాక్టర్, మరొక స్టాఫ్ నర్స్ కు పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఓ వైద్యుడు కరోనాతో మరణిస్తే ఆ ప్రాంత వాసులు అంత్యక్రియలకు కూడా అనుమతించలేదు. ఇక్కడ అంతే..
కరోనా కు కులం తెలియదు.
కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులందరికీ నెగటివ్ తేలింది. అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను అంబులెన్స్ లో తిరుపతిలోని పద్మావతి నిలయం (క్వారంటెన్ కేంద్రం) నికి తరలిస్తుండగా.. వారంతా పూతలపట్టులో ఆంబులెన్స్ నిలిపివేసి పరారయ్యారు. కారణం భయం. చస్తే రామని మొండికేసిన వాళ్లను అధికారులు అవగాహన కల్పించి ఎట్టకేలకు తీసుకెళ్లారు.
కరోనా కు కులం తెలియదు.
దశాబ్దాలుగా ఈ దేశంలో మనమందరం కలిసి ఉంటున్నాం. దేశం మీద అందరికీ బాధ్యత ఉంది. అలాగే హక్కులూ ఉన్నాయి. నాలాంటి మిత్రులు మీకు ఖచ్చితంగా ఉంటారు. నాకు కూడా మీలాంటి మిత్రులు ఉన్నారు. మన వృత్తిలో, వ్యాపారంలో, విద్యాసంస్థల్లో, పక్కింట్లో, పక్క వీధిలో.. ఇలా అన్ని చోట్లా అందరం కలిసి ఉంటున్నాం. కలిసి పనిచేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఎక్కడా ఏ తప్పూ జరగలేదు. ఎక్కడో కేవలం కొంత మంది (అలాంటి కొంత మంది అన్ని వర్గాల్లోనూ ఉంటారు) చేసిన కొన్ని వెధవ పనులకు .. ఆ నిందను అందరినీ అంట కట్టవద్దు. ఎందుకంటే..
కరోనా కు కులం తెలియదు.
– కరీముల్లా షేక్, చక్రాయపేట(కడప)
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ