‘’ఆ తొలినాటి ప్రేమ కోసం నన్ను మళ్ళీ అడగొద్దు ప్రియా / నువ్వుంటే చాలు జీవితమంతా కాంతివంతమే అనుకున్నాను/ నీ తలపోతల దు:ఖం ముందు లోకపు దు:ఖం ఒక లెక్కా అనుకున్నాను/
నీ సౌందర్యంతోనే వసంతానికి ఒక ఉనికి వస్తుందనుకున్నాను/ నీ కళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు..? /కానీ అదంతా ఇప్పుడు కాదు ప్రియా/ ప్రేమను మించిన దు:ఖాలు చాలా వున్నాయి ప్రపంచంలో/ ప్రేమ సమాగమాన్ని మించిన ఆనందాలు చాలా వున్నాయి/ యుగాలుగా క్రూరమైన అంధకారం అల్లుకుని వుంది /వీధుల్లో మానవ దేహాలు అంగడి సరుకులయ్యాయి/ రక్తధూళిలో స్నానమాడిన శరీరాల తరాల గాయాల నుంచి నా కళ్ళు తిప్పలేను../ అప్పుడూ ఇప్పుడూ నీ ప్రేమ ఎంతో గొప్పది/ కానీ ప్రియా ప్రేమను మించిన దు:ఖాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో’’
ఇలా ఒక కవి తన తొలినాటి ప్రణయ కవిత్వం నుంచి ప్రపంచ మానవ కల్యాణం కోసం తన కలాన్ని కదిలించాడు. ప్రేయసి కోసం కార్చిన కన్నీటిని దు:ఖితుడైన మనిషి వైపు మరల్చాడు. అంతే కాదు, ‘’ ప్రియ మిత్రుడా..నా ప్రేమతో నీ గుండెల్లో దు:ఖానికి ఉపశమనం కలుగుతుందంటే నిన్ను హృదయానికి హత్తుకుంటాను. నా పాటలు నీకు ఆనందాన్నిస్తాయంటే నీ కోసం వసంతాలనీ వనాలనీ సూర్యోదయాలనీ వెన్నెలనీ నక్షత్రాలనీ గీతాలుగా మారుస్తాను. ప్రేమనీ సౌందర్యాన్నీ కథలుగా వర్ణిస్తాను. కానీ నా ప్రియ నేస్తమా నా పాటలు నీకు ఓదార్పునే ఇవ్వగలవు. నీ దు:ఖాన్ని నిర్మూలించలేవు. కేవలం నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే నీ దు:ఖాన్ని తొలగించుకోగలవు ‘’ అని సగటు మనిషిని విప్లవోన్ముఖుణ్ణి చేశాడు. ‘’మాట్లాడు..నీ మాటలింకా స్వతంత్రంగానే వున్నాయి. నీ నాలుక ఇంకా నీదే మాట్లాడు. నీ దేహం నీ అధీనంలోనే వుంది, అందులో ఇంకా ప్రాణం తొణికిసలాడుతోంది మాట్లాడు’’ అంటూ మనుషుల్ని జాగృతం చేశాడు. ఆయనే ఫైజ్ అహ్మద్ ఫైజ్. అతని దేశం పాకిస్తాన్ కావొచ్చు కాని, అతను ప్రపంచ కవి. ప్రజాకవి. విఖ్యాత విప్లవ కవి. 1962లో లెనిన్ శాంతి పురస్కరాన్ని అందుకున్నాడు. నోబెల్ పురస్కారానికి అతని పేరు పరిశీలనకు వెళ్ళింది. బతికినంతకాలం అతడిని చీకటి కొట్లలో బంధించారు. బతకడానికి దేశాలు పట్టి తిరగాల్సివచ్చేట్లు చేసారు. అదే దేశంలో మరణానంతరం ఆయనకు పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిషాన్ ఏ ఇంతియాజ్ అనే పురస్కారాన్ని 1990లో ప్రకటించింది. అంతటి మహాకవి రాసిన హమ్ దేఖేంగే కవిత ఇప్పుడు మన దేశంలో వివాదాస్పదంగా మారింది.
1985లో పాక్ సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ తమ దేశంలోని స్త్రీలు చీరలు ధరించకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసినప్పుడు దాన్ని ధిక్కరిస్తూ ప్రపంచ ప్రఖ్యాత పాక్ గాయకురాలు ఇక్బాల్ బానో ఒక నల్లచీర ధరించి లాహోర్ స్టేడియంలో 50వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హమ్ దేఖేంగే అంటూ ఈ పాట పాడింది. అప్పుడు స్టేడియం ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. పాక్ నియంత కంపించిపోయాడు. అంతకు ముందు ఏడాదే ఫైజ్ కన్నుమూశాడు. ఇస్లాం పేరు మీద పాకిస్తాన్ లో సాగుతున్న జియాఉల్ హక్ నియంతృత్వాన్నిసవాలు చేస్తూ 1979లో ఫైజ్ అక్షరాలతో నిర్మించిన అగ్నిపర్వతం ఆ కవిత. ఆ కవితకు దేశాల సరిహద్దులు అడ్డురాలేదు. ప్రపంచంలో ఏ మూల హక్కుల అణచివేత సాగినా అక్కడ ఆ కవిత పాటై బద్దలవుతుంది. లావా వెదజల్లుతుంది. అనేక సందర్భాల్లో అనేక మంది గాయకుల నోట అనేక మంది సమూహాల నోట ఈ పాట అగ్ని జలపాతమై ఉరికింది. అదే పాట ఇప్పుడు మన దేశంలో వివాదాస్పదంగా మారింది. మత నియంతృత్వాన్ని సవాలు చేసిన కవిని ఒక మతానికి కట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారు మన వాళ్ళు.
గుడ్డివాడు కేవలం లోకాన్ని మాత్రమే చూడలేడు. కానీ కళ్ళకు మతం గంతలు కట్టుకున్న వారు సత్యాన్ని కూడా చూడలేరు. అది భౌతికమైన అంధత్వం. ఇది ఆత్మికమైన అంధత్వం. ఇప్పుడీ అంధకారమే దేశమంతా వ్యాపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మతాన్ని ధిక్కరించి మానవతనే తన అక్షరానికి ఆత్మగా ప్రకటించుకున్న కవి ఫైజ్. ఆయన బతుకంతా మతం ముసుగులో సాగిన నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరు సాగించాడు. పాకిస్తాన్ లో సైనిక నియంతల దురహంకారానికి గురై జీవితంలో చాలా భాగం కటకటాల్లోనో అజ్ఞాతంగానో గడిపిన వాడు. అలాంటి అద్భుత కవి ఇప్పుడు మన దేశంలో వివాదాస్పదం కావడం ఆశ్చర్యం. ఫైజ్ గురించి తెలిసిన వారెవరూ అతని కవిత్వానికి మతం రంగు పులిమే సాహసం చేయలేరు. కానీ కాన్పూర్ ఐఐటీ విద్యాసంస్థలో ఓ ప్రొఫెసర్ ఆ పనికి పూనుకోవడంతో దేశం కొంచెం సిగ్గుతో తల దించుకోవలసి వచ్చింది. దేశమంతా ఆలోచనాపరులను ఈ ఘటన కలచివేసింది. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు డిసెంబరు 17న ఒక ప్రదర్శన చేశారు. అందులో విద్యార్థులు ఫైజ్ రాసిన ఒక చారిత్రాత్మక కవితను నినాదంగా గానం చేశారు. అదే తప్పయిపోయింది. కవితలో అల్లా అన్న పదం అభ్యంతరకరమైపోయింది. అదే విద్యాసంస్థకు చెందిన అధ్యాపకుడు డా. వి.ఎన్.శర్మ దాని మీద ఫిర్యాదు చేశారు. ఫైజ్ కవిత హిందూ మనోభావాలను దెబ్బతీసేదిగా వుందని ఆయన ఫిర్యాదు. దాని మీద కాన్పూర్ ఐఐటి డైరెక్టర్ ఒక కమిటీని కూడా వేశారు. కవి ప్రజాహక్కుల కోసం ఏ దేశంలోకైనా చొరబడతాడు. ఏ సరిహద్దు గస్తీ దళాలూ అతడిని అడ్డుకోలేవు. అలా కాన్పూరు ఐఐటీలో ఫైజ్ చొరబడ్డాడు. దేశాన్ని ముక్కలు కానివ్వం అంటూ నినదిస్తున్న యువకుల గళాల్లో అలలు అలలుగా పోటెత్తాడు. అదే మన వారికి తప్పుగా కనిపించింది. ఆఖరికి అంతటి ప్రజాకవి ఫైజ్ కూడా వీరికి చొరబాటుదారుడిగా కనపడ్డాడు. ఇంతకీ ఆ కవితలో అంత మహాపరాధం ఏముంది? ఒకసారి చూద్దాం.
ఈ కవితలో ఫైజ్ చెప్పేది ఒకటే. నియంతృత్వాలు నేలకూలతాయని.. దైవ సృష్టిలో నిజమైన మానవులెవరో ఆ సామాన్యమానవులే ఏలికలవుతారని ఆరోజు తప్పకుండా వస్తుందని..అది మనం చూస్తామని అంటాడు. అల్లా అనే పేరును ఫైజ్ దేవుడికి పర్యాయపదంగా వాడాడు. ఫైజ్ ఒక కమ్యునిస్టు. ప్రగతి వాది. స్వేచ్ఛాప్రియుడు. ఖురాన్ పవిత్ర గ్రంథంగా మెజారిటీ ప్రజలు పూజించే చోట అదే ఖురాన్ లోని విషయాన్ని తీసుకుని తన సందేశం వినిపిస్తాడు. తీర్పుదినం ఒకటి వస్తుందని ఖురాన్ చెప్తుంది. నువ్వు చేసిన వాటికన్నింటికీ నువ్వు జవాబు చెప్పుకోవలసిన రోజు ఒకటి వస్తుంది. పర్వతాలు దూదిపింజల్లా ఎగరిపోతాయని చెప్తుంది. ఆ ఇమేజరీలనే వాడుకుని తెలివిగా నియంతల దౌర్జన్యాల మీద కలాన్ని కత్తిలా దూశాడు ఫైజ్. అల్లా అనే పేరు ఒక సంకేతమే. చివరికి ఆ భగవంతుడు..అది నువ్వే అది నేనే అని తేల్చాడు. ఖురాన్ సందేశాన్ని సామ్యవాదంలోకి కుదించాడు. అందుకే ఆనాడు అది పాక్ నాయకులకు గుబులు పుట్టించింది. మరి ఇస్లాం మత ఛాందస నియంతలను భయపెట్టిన కవి హిందూ మనోభావాలను ఎలా దెబ్బతీస్తున్నాడు? ఇదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అంటే ఆధిపత్య భావాలను ధిక్కరించిన అక్షరం ఏ భాషకు..ఏమతానికి సంబంధించింది అయినా అది మరో భాషలో మరో మతానికి చెందిన ఆధిపత్య భావాలకు కూడా అభ్యంతరకరంగానే మారుతుంది.
మహాకవీ ఫైజ్. క్షమించు మా అజ్ఞానాన్ని. కానీ మాకు నమ్మకం వుంది. నువ్వన్నట్టు మనం తప్పనిసరిగా చూస్తాం. నియంతృత్వాల శిఖరాలు దూది పింజెల్లా ఎగిరిపోవడం తప్పకుండా చూస్తాం. హమ్ దేఖేంగే.
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ