మహాత్మా గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా కీర్తించడం ఇది కొత్త కాదు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి హిందుత్వవాదులు గతంలో చాలా సందర్భాలలో నాధూరాం గాడ్సేని గొప్ప దేశభక్తుడిగా పొగిడారు. గాడ్సే మీద వారికున్న ప్రేమ ప్రాధమికంగా మహాత్ముడి మీద ఉన్న కోపం, ద్వేషం నుంచి ఉద్భవించినదే తప్ప మరోటి కాదు. హిందూ ముస్లింల ఐక్యతే భారత దేశానికి శ్రీరామరక్ష అని గాంధీజీ భావించారు. హిందుత్వవాదులకు ఆ భావనే బొత్తిగా గిట్టదు. ముస్లింలు ఈ దేశానికి పరాయివారని వారి నమ్మకం. హిందుమత పునరుజ్జీవనం (ఏదైనా అణగారిన తర్వాతే పునరుజ్జీవనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హిందూమతానికి వచ్చిన లోటేమిటో ఎంత ఆలోచించినా అర్ధం కాదు, అది వేరే విషయం) బాటలో పరచుకున్న పల్లేరు కాయల వంటి వారు ముస్లింలు అని వారి ప్రగాఢ విశ్వాసం.
ఈ భావజాలం మది నిండా నింపుకున్నవారికి గాంధీజీ పొడ గిట్టుతుందని ఎలా అనుకోగలం? ప్రజ్ఞాసింగ్ వంటి కొద్దిమంది ‘అతి మితవాద’ హిందుత్వశక్తులు మనసులోని మాటను బయటపెడతారు; అంతే. హిందుత్వ భావజాలం ఉన్నవారు ఎవరూ గాంధీజీని ప్రేమించేందుకు వీలు లేదు; కనీసం ముస్లింలకు సంబంధించీ, దేశవిభజనకు సంబంధించీ ఆయన తీసుకున్న వైఖరి విషయంలో.
అయితే ప్రజ్ఞాసింగ్ లాగా అందరూ మనసు విప్పరు. గాంధీజీ అంతటి మహోన్నతుడిపై ఇండియాలో మాట తూలితే రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందని భయం. సత్యం, అహింస అన్న రెండు ‘పనికిరాని’ మాటలు ఆయుధాలుగా ఆయన ప్రపంచాన్ని జయించారు. 70 ఏళ్ల క్రితం కన్నుమూసిన గాంధీజీ ఇండియాలోనే కాక ప్రపంచం అంతటా ఇప్పటికీ నిత్యఆరాధ్యుడిగా ఉన్నారంటే ఆయన ముద్ర ఎంత బలంగా పడిందో ఊహించవచ్చు. నిజానికి గాంధీజీ సిద్ధాంతాలు, ఆచరణ ఆయన జీవితకాలంలో కన్నా ప్రపంచానికి ఇప్పుడే ఎక్కువ అవసరమని రాజనీతిజ్ఞులు, మేధావులు ఎలుగెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూచూస్తూ గాంధీజీని తెగనాడే సాహసం ఎందుకు చేస్తారు?
ప్రజ్ఞాసింగ్ తాజాగా లోక్సభలో గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించిన మీదట బిజెపి ఆమెకు శిక్షగా పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశాల నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.(ప్రజ్ఞాసింగ్ను బిజెపి గెలిపించి ఊరుకోలేదు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీలో చోటు కల్పించింది). అయితే బిజెపి ప్రదర్శించినది నిజమైన ఆగ్రహమేనా? ప్రజ్ఞాసింగ్ను ఆ పార్టీ నిజంగా దారిలో పెట్టాలనుకుంటున్నదా? ఈ వివాదం పూర్వాపరాలు అలా అనుకోవడానికి వీలు కల్పించడం లేదు. 2019 ఎన్నికల ముందు కూడా ఆమె గాడ్సే దేశభక్తుడని బల్లగుద్ది చెప్పారు. భోపాల్ సీటులో నిలిపి ప్రజ్ఞాసింగ్ను లోక్సభకు పంపించే ప్రయత్నంలో ఉన్న బిజెపి నాయకత్వం ఆమెను కనీసం మందలించినట్లు కూడా లేదు.
ప్రజ్ఞాసింగ్ గాడ్సేను కీర్తించడం మాట అటుంచండి. ఆమె మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు. ఆ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. ఆ సంఘటనలో పది మంది మరణించారు. 80 మందికి పైగా గాయపడ్డారు. అలాంటి టెరరిజం కేసులో నిందితురాలిని బిజెపి లోక్సభకు పంపడం ఏమిటి? నేరం రుజువు కానంతవరకూ ఎవరైనా నిర్దోషులే అన్న సూత్రాన్ని బిజెపి అడ్డం పెట్టుకోదలచిందా? ఇదంతా చూసిన తర్వాత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్పై మొన్న బిజెపి ప్రదర్శించిన ఆగ్రహంలో చిత్తశుద్ధి ఉందని అనుకోగలమా!
మొదట మనమందరమూ ఒప్పుకుని తీరాల్సిన విషయం ఏమంటే గాడ్సేని కీర్తించేందుకు ప్రజ్ఞాసింగ్కు ఉన్న హక్కును హరించడం తప్పు. ఆ మాటకొస్తే గాంధీజీని తెగనాడేందుకు కూడా ఆమెకు హక్కుంది. వ్యక్తిగతంగా తాను నమ్మిన విషయాన్ని బయటకు చెప్పే హక్కు అందరికీ ఉన్నట్లే ప్రజ్ఞాసింగ్కూ ఉంది. పార్లమెంట్లో గాంధీజీ హంతకుడిని కీర్తించడం అపచారం కదా అని కాంగ్రెస్ అంటున్నది.
ఏ రకమైన అపచారం ఇది? గాంధీజీ హత్యకేసులో ఆ హత్యకు కుట్ర పన్నాడన్న అభియోగంతో విచారణ ఎదుర్కొన్న హిందూ మహసభ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ చిత్రపటం ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాలులో గాంధీజీ చిత్రపటం సరసనే వేలాడదీసి ఉంది. ఒకపక్క జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకాలను చెరిపేసేందుకు చూస్తూ మరోపక్క అసలైన జాతీయోద్యమ యోధుడిగా, దేశనాయకుడిగా కీర్తిస్తూ ఎవరి వారసత్వాన్నయితే సొంతం చేసుకునేందుకు ఇవాళ బిజెపి ప్రయత్నిస్తున్నదో ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ హత్య తర్వాత ఏమన్నారో తెలుసా: “నేరుగా సావర్కర్ కింద పని చేస్తున్న హిందూ మహాసభలోని ఒక తీవ్రవాద వర్గం గాంధీజీని హత్య చేసింది”. హంతకుడుగా పటేల్ విశ్వసించిన వ్యక్తికి బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ సెంట్రల్ హాలులో గౌరవస్థానం కల్సించింది. గాంధీజీ జ్ఞాపకాలకు చేయగల అపచారం ఇంతకన్నా ఏముంటుంది? ఇక్కడ కూడా బిజెపి ప్రజ్ఞాసింగ్ విషయంలో చేసిన వాదనే చేస్తుంది: సావర్కర్పై మోపిన అభియోగాలు రుజువు కాలేదు కదా!? ఈ వాదనను మనం కూడా ఆమోదిద్దామా?
పెద్ద ఎత్తున గొడవ అయ్యేసరికి ప్రజ్ఞాసింగ్ లోక్సభలో క్షమాపణ చెప్పారు. బిజెపి పెద్దలు చెప్పించారు. లేకపోతే ఆమె క్షమాపణ కోరే రకం కాదు. క్రితం సారి ఆమె గాడ్సేను కీర్తించినపుడు ఏమన్నారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి: “నాధూరాం గాడ్సే దేశ్భక్త్ థే, హై, అవుర్ రహేంగే”. మరణించక ముందు, వర్తమాన కాలంలో, భవిష్యత్తులో కూడా నాధూరాం గాడ్సే దేశభక్తుడని ఆమె చెప్పిన ఈ మాటలు వీడియో రూపంలో ఉన్నాయి. వాటికి కూడా మరణం లేదు. ఈ ఇంటర్నెట్ యుగంలో అవి ఎప్పటికీ ఉంటాయి.
ఇలాంటి ప్రజ్ఞాసింగ్తో క్షమాపణ చెప్పించడం ద్వారా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఏమి సాధించినట్లు? క్షమాపణ చెప్పి ప్రజ్ఞాసింగ్, చెప్పించి ప్రతిపక్షాలూ తప్పు చేశాయి. తాను నమ్మిన మాట చెప్పి ఆ తర్వాత పార్టీ వత్తిడితో క్షమాపణ చెప్పడం ప్రజ్ఞాసింగ్ ద్వంద్వ విలువలకూ, ఆమె సంగతి తెలిసీ ఎమ్.పిగా చేసి మధ్యలో ఇరకాటం వచ్చినపుడు ఆమెతో క్షమాపణ చెప్పించడం బిజెపి ద్వంద్వ విలువలకూ నిదర్శనం.
కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు చేసిన వత్తిడి వల్ల ఈ ద్వంద్వ విలువలు బయటపడ్డాయి కదా అని ఎవరైనా అనవచ్చు. ఈ ద్వంద్వ విలువలు బయటపడడంతో సరిపోదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకత్వంలో పనిచేసే బిజెపి ఏ విలువలకు కట్టుబడి ఉందో నిర్ద్వంద్వంగా బయటపడాలి. మతపరమైన విద్యేషాన్ని పెంచి పోషించి దేశాన్ని రెండుగా చీల్చేందుకు చూసే విలువలకూ, కుల మత వర్గ వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా సాటి మనిషిని ప్రేమించే సెక్యులర్ విలువలకూ మధ్య పోటీ ఉండాలి. ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా స్వల్పకాలిక నష్టాలు చూడకుండా సామాజికంగా దీర్ఘకాలిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సెక్యులర్ విలువలకు చిత్తశుద్ధితో కట్టుబడి వ్యవహరించినపుడు ఈ పోటీ సాధ్యమవుతుంది. మధ్యలో అప్పుడప్పుడూ వచ్చే ప్రజ్ఞాసింగ్ లాంటివారు ఈ పోటీ ఆవశ్యకతను గుర్తు చేసేందుకు పనికి వస్తారు.
ఆలపాటి సురేశ్ కుమార్