అనగనగా, ఓ సీనియర్ జర్నలిస్టు.
ఆయనకి ఓ వానాకాలపు సాయంత్రం ఆకలేసింది.
వేడివేడిగా, నోటికి రుచిగా, ఏదైనా తింటే బావుణ్ణని ఆయనకి అనిపించింది.
అయితే, మన సీనియర్ జర్నలిస్టు గారు భార్యాబిడ్డల జంఝాటం లేని వాడు.
అంచేత అయన ఇంటావంటా, వంటావార్పులు కూడా లేకుండా పోయాయి!
“పోతే పోనీ పోరా!” అనుకుని, ఆయన ఓ ఫుడ్ సప్లయర్ కి ఫోన్ చేశాడు.
ఆనవాయితీ ప్రకారం రెండు పీజ్జాలు ఆర్డర్ చేశాడు.
పదినిమిషాల్లో పీజ్జాలు ఆయన ముంగిట వాలాయి.
వానలో తుడుచుకుంటూ వచ్చి, వేడివేడిగా పీజ్జాలు అందించిన కుర్రాణ్ణి చూడగానే, అప్పుడప్పుడే సీనియర్ సిటిజెన్ కూడా అవుతున్న సీనియర్ జర్నలిస్ట్ గుండె కరిగిపోయింది.
“నాకూ ఓ కొడుకుంటే ఇతనంత ఉండేవాడేమో!” అనుకున్నాడు.
చటుక్కున అతనికి ఓ ఆలోచన వచ్చింది.
గుమ్మం లో నిలబడి నీళ్లు ఓడ్చుకుంటున్న కుర్రాణ్ణి ఇంట్లోకి రమ్మన్నాడు.
“వద్దు లెండి – మీ ఇల్లంతా తడైపోతుంది! ఇక్కడ సైన్ చేసిస్తే నేను బయల్దేరతా” అన్నాడు కుర్రాడు. వానకి తడిసినందువల్లనేమో అతని గొంతు సన్నగా వణికింది.
“అది కాదోయ్- ఆ రెండో పిజ్జా నీ కోసం ఆర్డర్ చేసిందే! నాకు కంపెనీ ఇద్డువుగాని రా!” అని లోపలికి ఆహ్వానించాడు సీనియర్ జర్నలిస్ట్.
కుర్రాడు నవ్వాడు. “థాంక్స్ అండీ! నాకొద్దు లెండి- పైగా, నాకింకా డెలివరీలు ఉన్నాయి. అంచేత ఇక్కడ సైన్ చేసిస్తే నేను వెళ్తా”నన్నాడు కుర్రాడు.
ఈసారి అతని గొంతులో వణుకూ లేదు- బెరుకూ లేదు.
సీనియర్ జర్నలిస్ట్ ఆశ్చర్యపోయాడు.
“అదికాదు తమ్ముడూ, నేను ఒక్కణ్ణే ఉంటా- కాస్త కంపెనీ ఇస్తే నీ సొమ్మేం పోతుంది?” అని ఉడుకుమోత్తనంగా అడిగాడు.
“సరే సార్ ఉన్న విషయం చెప్పేస్తా- నేను జంక్ ఫుడ్ తినను. మీలాంటి పెద్దమనుషులు, ఇంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తే, ఈ డెలివరీ బాయ్ పని కూడా చెయ్యను. పోతే, ఇంటి దగ్గిర అమ్మ ఒక్కత్తే వెయిట్ చేస్తూ ఉంటుంది. డ్యూటీ చేసుకుని వెళ్ళాలి- నన్ను వదిలెయ్యండి….” అంటూ ఆ కుర్రాడు ఓ కాయితం సీనియర్ జర్నలిస్ట్ ముందుంచాడు.
ట్రాన్స్ లో ఉన్నవాళ్ళా దానిమీద అప్రయత్నంగానే సంతకం చేసేశాడు మన సీనియర్ జర్నలిస్ట్.
“ఆ కుర్రాడికి ఉన్నపాటి జ్ఞానం మనకి లేకపోయిందే!” అని సీక్రెట్ గా సిగ్గుపడ్డాడు.
ఫినిష్!
కథ బావుంది కదూ!
కల్పన కదా, ఎందుకు బావుండదూ?
ఎటొచ్చి, నిజమే అంత తియ్యగానూ, కమ్మగానూ ఉండదు మరి!
మన దేశంలో, ఆ మాటకొస్తే ప్రతి దేశంలోనూ, ఫాస్ట్ ఫుడ్ కి ఆదరణ దినదినాభివృద్ధి -కాదు కాదు అక్షరాలా క్షణక్షణ అభివృద్ధి- చెందుతోంది. మనకి ఈ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి ఈమధ్యనే సోకినప్పటికీ, ఇది అగ్గితెగుల్లా వ్యాపించిపోతోంది. అన్ని అత్యాధునిక సంస్కృతులకూ పుట్టినిల్లయిన అమెరికాయే ఈ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికీ పురిటిగడ్డ!
అక్కడ, మెక్డొనాల్డ్ కంపెనీ సెకనుకు 75 హ్యామ్బర్గర్లు అమ్ముతోందట!
సగటు అమెరికన్లు ఏడాదికి 54 గాలన్ ల కార్బోనేటేడ్ సాఫ్ట్ డ్రింక్స్ – మన భాషలో కూల్ డ్రింక్స్ – తాగుతారట!
ఒక అంచనా ప్రకారం అమెరికన్స్ లో 44 శాతం మంది పాలిట ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంటులే అన్నపూర్ణలట!
ఎంత చెడ్డా, అది అమెరికా! అక్కడ, అన్నీ లెక్కప్రకారం రికార్డులకు ఎక్కాల్సిందే! అది మంచయినా చెడ్డయినా… కనకనే ఈ సమాచారం బయటపడింది.
ఇందుకు మినహాయింపులు లేవని కాదు.
ఎదో మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ కుమ్మక్కు, ఫలితంగా ఇబ్బడి ముబ్బడి అయ్యే సైనిక వ్యయం లాంటి సున్నితమయిన వ్యవహారాల్లో కించిత్తు దాపరికం ఉంటే ఉందేమో! కాదనలేం!!
అలాగే, ఆఫ్రికన్ అమెరికన్లు అనే నల్లజాతి వాళ్ళ విషయంలో- ముఖ్యంగా వాళ్ళ ఆడవాళ్ళ పై తెల్లజాతి కుర్రకారు చేసే అత్యాచారాల విషయంలో- కొంత దాపరికం వుంటే ఉంటుందేమో కానీ, తిండీ తిప్పల గురించి దాచిపెట్టడం ఏ కోశానా ఉండదు!
కానీ, మన విషయం లో అలా చెప్పలేం కదా!
మనకి బోఫార్స్, రఫాల్ లాంటి కుంభకోణాలకు కొదవేం లేదు! అందులో మనల్ని అమెరికన్లు కొట్టలేరు. కానీ, ఆధార్ లాంటి సర్వసమగ్రమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ ఇక్కడ ఏ విషయం గురించీ అధికారిక సమాచారం దొరకదు. మనకి -పొలమంటూ ఉంటే- దానిగురించి కచ్చితమైన సమాచారం ఎక్కడా దొరకదు. మళ్ళీ ఏ కరణమో, మునసబో దయతలచి నీ పొలం ఫలానా చోట ఏడ్చింది, పోయి అమ్ముకోవోయ్ అంటే తప్ప మనకి పబ్బం గడవదు. మనం ఎక్కడ, ఏ రోజు పుట్టామనే సమాచారం అమ్మమ్మో, బామ్మో చెప్తే తప్ప మనకి తెలీదు. మనకి పొరపాటున ఏ గుమస్తా ఉద్యోగమో వచ్చిచచ్చిందే అనుకోండి- ఫినిష్! మన సర్టిఫికెట్లు మర్నాడే అవతల పారేస్తాం! జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం విషయంలోనే ఇంట ఉదాశీనంగా ఉండే మనం మరీ అంత ముఖ్యం కానీ వాటిని పట్టించుకుంటామా?
ఉదాహరణకి ఫాస్ట్ ఫుడ్స్ విషయమే తీసుకోండి.
అసలు, మనదేశంలో ఫాస్ట్ ఫుడ్ ను నిర్వచించడమే కష్టం! బజ్జీలూ, బోండాలూ, పకోడీలూ, సమోసాలూ, చాట్లూ, పానీపూరీలూ, వడాపావులూ, పావుభాజీలూ, కెబాబులూ, హలీములూ ఇవన్నీ నిజానికి “దేశీ” ఫాస్ట్ ఫుడ్ లు. కానీ మనల్ని ఫాస్ట్ ఫుడ్ గురించి అడిగితే మనం బర్గర్లూ, పీజ్జాలూ, పాస్తాలూ, ఫ్రైడ్ రైసులూ, డోనట్లూ వగైరాల గురించే మాట్లాడతాం! అవి మాత్రమే ఆరోగ్యానికి హాని కలగచేస్తాయన్నట్లు నటిస్తాం. ఏ ఆయిలు కంపెనీ ఎం చెప్తే అదే వేదం మనకి! ఒకడొచ్చి పొద్దుతిరుగుడు గింజలతో చేసిన ఆయిలుతో విషం ఒండుకున్నా అది గుండెకి అమృతం అయిపోతుందని ఒక డాక్టరు వేషధారితో చెప్పిస్తాడు. మర్నాటినుంచీ మన పిచ్చి తల్లులు అదే ఆయిలుతో పిల్లలకి విషం వండి పెడుతూవుంటారు. మన పత్రికల్లో ఎక్కడో మారుమూల ఓ సింగిల్ కాలం ఐటెం పడుతుంది- ఫాస్ట్ ఫుడ్స్ పిల్లలకీ, పెద్దలకి కూడా మంచివికాదని. అది చూసిన మనమందరం, సాయంత్రం బజ్జీలూ జిలేబీల బండి దగ్గిర చేరి బర్గర్లు, పీజ్జాలూ ఎంతచెడ్డవో నోరారా మాటాడుకుంటాం!
“నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు- మన గడ్డ మీద పుట్టిన బజ్జీలూ, జిలేబీల కాలిగోటికి కూడా ఈ బర్గర్లూ పీజ్జాలూ పోలవు సోదరా!” అంటూ ఓ దేశభక్తి వ్యాధి పీడితుడు ముక్తాయిస్తాడు. ఆ ముక్తాయింపు మనకందరికీ కమ్మగానూ, కారంకారంగానూ బలే రుచిగా ఉంటుంది! మర్నాటి నుంచీ అతగాడు అసిడిటీ వ్యాధి పీడితుడు కూడా కాబోతున్నాడనే చేదు నిజం అప్పుడు మనకి తట్టనే తట్టదు!
నన్నడిగితే, ఫాస్ట్ ఫుడ్స్ కన్నా ఈ తీపి అబద్ధాలే ఎక్కువ హానికరం. ఎంత చేదుగా ఉన్నా, నిజమే మనకి మంచిది!! ఇది తిండికి మాత్రమే పరిమితం కాదని గమనించ ప్రార్థన!!
– మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ