ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు వెళ్లారు. మోదీ ఏది చేసినా అది ఒక ఈవెంట్ అవుతుంది కదా! ఆయన కేదారనాధ్ పర్యటన కూడా అలాగే జరిగింది.
మోదీ వేషధారణ మారింది. తాను వెళ్లిన ప్రాంతంలో కనబడే పహాడీ వస్త్రాలను ఆయన ధరించారు. బాడీ లాంగ్వేజ్ మారింది. అణకువగా, మౌనంగా ముకుళిత హస్తాలతో ఎక్కువ కనబడ్డారు. రెడ్ కార్పెట్పై నడక మాత్రం తప్పలేదు. భుజంపై వేసుకున్న వస్త్రవిశేషాన్ని ఏమంటారో తెలియదు కానీ, పాత కాలంలో రాజులు నడిచిన పద్ధతిలో పొడవాటి ఆ వస్త్రం ఎర్ర తివాచీపై జీరాడుతుండగా ప్రధాని ఆలయ ప్రదక్షిణ చేశారు.
అక్కడ చాలామంది జనం కూడా చేరారు. వారిలో కొందరు ‘హరహర మోదీ’ అంటూ నినదించారు. కొందరైతే ‘ఈ రోజు ఇద్దరు శంకరులను దర్శనం చేసుకునే భాగ్యం కలిగింద’ని పరవశించిపోయారు. చేతులు ఊపుతూ అందరికీ మోదీ అభివాదం చేశారు. ప్రధాని హోదాలో అధికారిక పర్యటన కాబట్టి కేదారనాధ్ పునరుద్ధరణ పనులను మోదీ సమీక్షించారు. కేదారేశ్వరుడి దర్శనం అనంతరం అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహ దగ్గరకు వెళ్లి అందులో కాషాయవస్త్రధారియై ధ్యానంలో కూర్చున్నారు. అక్కడికి మీడియాకు అనుమతి లేదు. అయితే కళ్లు మూసుకుని గంభీరంగా ధ్యానం చేస్తున్న ప్రధాని ఫొటో మాత్రం బయటకు వచ్చింది.
ప్రధాని మోదీ ఆధ్యాత్మిక చింతన రెండవ రోజు కూడా సాగుతుంది. ఆయన బద్రీనాధ్ కూడా సందర్శిస్తారు. చివరి దశ పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ రోజు నరేంద్ర మోదీ చేసే ఈ పర్యటనను మనం ఏమని పిలవాలి? ఆయన ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి ఈ అధికారిక పర్యటనను మనం పట్టించుకోనవసరం లేదా? ఈ పర్యటన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు రాదా?
ప్రధాని కేదారనాధ్, బద్రీనాధ్ ప్రాంతాలను అధికారికంగా పర్యటిస్తారని ఆయన కార్యాలయం కేంద్ర ఎన్నికల కమిషన్కు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉంది జాగ్తత్త సుమా అంటూ కమిషన్ సన్నాయి నొక్కులు నొక్కింది. దానికి తగ్గట్టు గానే ప్రధాని ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రఖ్యాతి చెందిన హిందూ దేవాలయాలను అధికారికంగా సందర్శించిన ఆ గొప్ప ఈవెంట్ను ఉత్తరాది మీడియా జుర్రుకుంది. పడీపడీ ప్రచారం కల్పించింది.
దేశం ఏం తెలుసుకోవాలని కోరుకుంటుందో ఎప్పటికప్పుడు క్షణాల్లో అర్ధం చేసుకునే అర్నబ్ గోస్వామి నాయత్వంలోని రిపబ్లిక్ టివి నిన్న కేదారనాధ్ ఆలయం దగ్గర ప్రధాని పర్యటన కోసం సిద్ధంగా ఉంది. మోదీ సందర్శన ఈవెంట్కు తరలించిన ప్రజలతో (ఈ విషయం రిపబ్లిక్ టివి ప్రతినిధితో కెమేరా ముందు మాట్లాడిన జనమే చెప్పారు) పదేపదే ఫిర్ ఏక్బార్ మోదీ సర్కార్ అనిపించారు.
ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు, పార్టీలు వోటర్లను అభ్యంతరకరమైన రీతిలో ప్రభావితం చేయకుండా చూసేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి రూపొందించారు. మతం ప్రాతిపదికన వోట్లు అడగడం కూడా ఆ అభ్యంతరకరమైన పద్ధతుల్లో ఒకటి. ఇప్పుడు చెప్పండి నరేంద్ర మోదీ కేదారనాధ్ పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా?
మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బిజెపి, భారతదేశాన్ని హిందూ మెజారిటీ సమాజంగా, ముస్లింలను అణిగిమణిగి ఉండాల్సిన ‘ఇతరులు’గా తయారుచేయడం అన్న ఎజెండాతో ఎన్నికలలో పోరాడుతున్నది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్ధినన్నా ఎంపిక చేయకుండా పోటీలోకి దిగడం ద్వారా వారు తమ అభిమతాన్ని దేశానికి స్పష్టంగా తెలియజెప్పారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో పాకిస్తాన్ను, ముస్లింలను (వారు ఇండియా ముస్లింలయినా, పాకిస్తాన్ ముస్లింలయినా బిజెపి దృష్టిలో తేడా లేదు) ఒకే గాటన కట్టడం ద్వారా మెజారిటీ మతం కంపు కొట్టే కుహనా జాతీయవాదాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఇందుకు బాలాకోట్పై వైమానిక దాడిని నిస్సిగ్గుగా ఉపయోగించుకున్నారు. ముస్లింలు మెజారిటీ అయిన కేరళ, వయనాడ్లో రాహుల్ గాంధీ నామినేషన్ ర్యాలీ చూస్తే అది పాకిస్తాన్ అనిపించిందని సాక్షాత్తూ ప్రధానమంత్రి వ్యాఖ్యానించడాన్ని మరో రకంగా అర్ధం చేసుకోవడం కుదరదు. ఆయన కూడా అందరూ అలా అర్ధం చేసుకోవాలనే మాట్లాడారు.
ఇలాంటి ప్రచారం నిర్వహించిన బిజెపి ప్రధానమంత్రి చివరిదశ పోలింగ్ ముందు రోజు కేదారనాధ్ పర్యటనకు వెళ్లేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుంది. నిజానికి నరేంద్ర మోదీ ప్రచారం ముగిసిన వెంటనే చార్థామ్ ఆలయాల పర్యటనకు వెళ్లాల్సిన పని లేదు. ఎవరైనా సూచించినా గానీ ఆయన రాజనీతిజ్ఞుడైతే, ఇలాంటి పర్యటన ఇప్పుడు తప్పు అని చెబుతారు. కానీ మోదీ రాజనీతిజ్ఞుడు కాదు కదా సమకాలీనులకు కాస్తోకూస్తో స్పూర్తి నివ్వగలిగే మంచి రాజకీయనాయకుడు కూడా కాదని ఉచ్ఛనీచాలు లేకుండా సాగించిన ఎన్నికల ప్రచారం ద్వారా తానే రుజువు చేసుకున్నారు. కాబట్టి ఆయన నుంచి మనం ఏమీ ఆశించలేం.
మరి ఎన్నికల కమిషన్ సంగతేమిటి? అదన్నా కాస్త నియంత్రణ చేయాలికదా! దురదృష్టవశాత్తూ ఎన్నికల కమిషన్ నుంచి కూడా మనం ఏమీ ఆశించలేం. బాలాకోట్ దాడులు, సైన్యం విజయాలు వేటినీ ప్రచారంలో ప్రస్తావించరాదని కమిషన్ మొదటే స్పష్టం చేసింది. మోదీ ప్రతి ప్రచారసభలో చేసిందే అది. అయితే విచిత్రంగా కమిషన్కు మోదీ ప్రసంగాలు కోడ్ ఉల్లంఘనల కింద కనబడలేదు. ఈ నిర్ణయాలతో విబేధించిన కమిషనర్ లావాసా అసమ్మతిని నమోదు చేసేందుకు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ సిద్ధంగా లేరు. కేదారనాధ్ పర్యటనకు అనుమతి ఇచ్చినందుకు ఎన్నికల కమిషన్కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పారంటే చెప్పారూ మరి!
ఆలపాటి సురేశ్ కుమార్