“అసమర్ధతకి ఓటేయాలా, అవినీతికి ఓటేయాలా?
ప్రచారానికి ఓటేయాలా, ప్రగల్భానికి ఓటేయాలా??
సొంత డబ్బాకి ఓటేయాలా, తాతల నాటి నేతి డబ్బాకి ఓటేయాలా??
ఎటూ తేల్చుకోలేక భవిత – నోటా బటన్ నొక్కేసింది యువత!”
మన ప్రజాస్వామ్యంలో ఎన్నుకునే హక్కే కాదు, ఎవ్వర్నీ ఎన్నుకోకుండా ఉండే హక్కు కూడా ఉందని మనకి తెలుసు. రెండువేల పదమూడు సెప్టెంబర్లో సుప్రీం కోర్ట్ ఈ హక్కును కల్పించింది. ముఖ్యంగా యువ వోటర్లకి ఈ కొత్త హక్కు గురించి బాగా తెలుసు. అసలు నోటా ఆప్షన్కి అవకాశం ఎందుకు కల్పించారు? ప్రజాస్వామ్యంలో మనకి మనస్ఫూర్తిగా నచ్చిన వ్యక్తిని మాత్రమే ఎన్నుకునే హక్కు అందరికీ ఉంది. అయితే అలా మనస్ఫూర్తిగా ఓటర్లకు నచ్చే అభ్యర్థులు నానాటికీ తగ్గిపోతున్నారనేది ఓ చేదునిజం. అలాంటి పరిస్థితుల్లో, మనకి సంపూర్ణంగా నచ్చినా, నచ్చకున్నా ఎవరో ఒకరికి వోటు వెయ్యక తప్పడం లేదు. ఇది సగటు మధ్య తరగతి ఆడపిల్లలు ఎవడో ఒక తలమాసినవాడి ముందు తలొంచి తాళి కట్టించుకోక తప్పని దుస్థితికి భిన్నమైన అవస్థ కాదు! ఈ దుస్థితి నుంచి మన వోటర్లని తప్పించేందుకే నోటా ఆప్షన్కి అవకాశం ఇచ్చారు.
అంతవరకూ బాగానే ఉంది.
ఎటొచ్చి ఈ కొత్త ఎంపికను ప్రవేశ పెట్టిన సుప్రీం కోర్ట్ మేధావులు, న్యాయ కోవిదులు ఎక్కువ దూరం ఆలోచించారా అన్నదే డౌట్. ఎందుకంటే ఒకానొక నియోజకవర్గంలో అత్యధికులు నోటా ఆప్షన్ వినియోగించుకున్నారనే అనుకుందాం. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఎన్నికల సంఘం ఆనాడే తేల్చి చెప్పింది. నోటా ఓట్లు ఎన్నిపడినా అవన్నీ “చెల్లని ఓట్లు” గా మాత్రమే లెక్కకి వస్తాయి. సదరు చెల్లని ఓట్లు, చెల్లని నోట్ల లాంటివే. అత్యధిక సంఖ్యలో నోటా ఓట్లు పడినప్పటికీ, ఎన్నికల ఫలితాలపై వాటి ప్రభావం పూజ్యం! అనగా, ఓటర్లలో అత్యధికులు అభ్యర్థులను తిరస్కరించినా, పురస్కరించినా ఎన్నికల ఫలితాల్లో మార్పు ఉండని కాడికి ఆ ఆప్షన్ ఉండేం? లేకేం? పైపెచ్చు, అలా జరిగిన పక్షంలో దాని ఫలితాలు ఘోరంగా ఉండే ప్రమాదం లేదూ?
ఎమ్మెల్యే గానో ఎంపీగానో ఎన్నికైన వ్యక్తి రాష్ట్ర స్థాయిలోనో కేంద్రంలోనో మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. అనగా, అతగాడి చేతిలో కొద్దో గొప్పో అధికారం కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందనేగా? ఈ నియోజకవర్గం లోని ఓటర్లలో ఎక్కువమంది నన్ను తిరస్కరించారని సదరు “అధికార రోగపూరిత బధిరాంధక శవము” భావించిన పక్షం లో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. అయినా, నోటా హక్కు కల్పించింది ఎందుకు? తప్పనిసరి తద్దినం లాంటి ఎంపికలకు పాల్పడవలసిన కర్మ దాపురించకూడదని. కానీ, ఎలాగు మనకి నచ్చని మహానీయుడు ప్రజాప్రతినిధి పదవిని అలంకరించనూ అలంకరిస్తాడు. మీదుమిక్కిలి, తనవంటి ప్రజా రాబందును ఎంచుకోనందుకు నోటా హక్కుదార్లని వేధించే ముప్పు కూడా ఉంది.
ఏతావాతా, ఎం తేలుతోందయ్యా అంటే, ఇప్పుడున్న రీతిలో నోటా ఆప్షన్ నిరర్థకమైన హక్కుగా మిగలడమే కాకుండా, చివరికి తలనొప్పిగా పరిణమించే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది.
అంచేతనే, నోటా ఆప్షన్ విషయంలో కొన్ని మార్పులు చేసి తీరాలి. మొదటిది – ఒకానొక నియోజకవర్గం లోని ఓటర్లు చెప్పుకోదగిన పరిమాణంలో నోటా హక్కు వినియోగించుకున్నట్లైతే, అక్కడ తిరిగి పోలింగ్ జరపాలి. సదరు “చెప్పుకోదగిన పరిమాణం” ఎంతటిదో నిర్ణయించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ మార్గం అనుసరించవచ్చు. ఉదాహరణకి- ఫలాని నియోజకవర్గం లో డిపాజిట్ దక్కడానికి ఎన్ని ఓట్లు రావాలో ఆ సంఖ్యతో సమానంగా కానీ, అంతకన్నా ఎక్కువగా కానీ నోటా ఓట్లు పోల్ అయ్యే పక్షంలో అక్కడ తిరిగి పోలింగ్ జరిపించాలని నిబంధన పెట్టుకోవచ్చు. నోటా ఆప్షన్ మాటవరసకు ఇచ్చి, దానికి ఏ విలువా లేకుండా చెయ్యడం కన్నా, ఆ అవకాశం కల్పించడం లోని ఆంతర్యానికి న్యాయం చెయ్యడం భావ్యంగా ఉంటుందని నేనంటాను.
మరి మీరేమంటారు?
–మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ