దాదాపు నాలుగు దశాబ్దాల కిందట, వేగుంట మోహన ప్రసాద్ “దిస్ టెన్స్ టైం” అనే కవితా సంకలనం ప్రచురించారు. తెలుగు కవితల ఇంగ్లిష్ అనువాదాలు ఆ సంకలనంలో కూర్చారు వేగుంట. ఆ పుస్తకాన్ని తన తండ్రికీ, “ఆధునిక తెలుగు కవిత్వ పిత” (Father of Modern Telugu Poetry) శ్రీశ్రీకీ ఉమ్మడిగా అంకితం చేశారు సంపాదక మహాశయులు. అదే పెద్ద గొడవకు దారితీసింది. ఆచార్య రోణంకి అప్పలస్వామి శ్రీశ్రీ ఆధునిక తెలుగు కవితకు Father కాజాలడని పుస్తకావిష్కరణ సభలోనే ప్రకటించారు. ఆ స్థానం గురజాడదేనని కూడా స్పష్టం చేశారు. శ్రీశ్రీతో సహా ఎందరో ఈ వివాదంలో తలదూర్చారు. గురజాడది పితామహ స్థానమని, తనది పితృ స్థానమని శ్రీశ్రీ “సృజనాత్మకమైన” వ్యాఖ్య జోడించారు కూడా. రోణంకిని టెక్కలి పోయి ఇంగ్లిష్ ట్యూషన్లు చెప్పుకోమని ఉచిత సలహా కూడా పారేశారు మహాకవి శ్రీశ్రీ. ఎవరెంత నోరుపారేసుకున్నా, చివరికి ఆచార్య రోణంకి అన్న మాటే నిరూపితమైంది. సంచలనాలూ, వివాదాల గాలివానలకన్నా వాస్తవాలనే వటవృక్షాలు చాలా బలమైనవని దాంతో మరోసారి రుజువైంది.
ఇటీవల ఇంతకు పదింతలు సంచలనాత్మకమూ, విదాస్పదము అయిన సునామీ విరుచుకుపడింది. ఈ మధ్యన ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ చరిత్రకు తెలిసినంతలో అత్యంత వివాదాస్పదమైన ప్రకటన ఒకటి చేశారు. ట్రంప్, మోడీని భారత జాతిపితగా అభివర్ణించి, అపారమైన తన చారిత్రిక పరిజ్ఞానాన్నీ దుస్సాహసిక ప్రవృత్తినీ ఏకకాలంలోనే ప్రదర్శించారు. ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందన సైతం దానికి తగినట్లే ఎదురయింది. భారత జాతిపిత స్థానం గాంధీజీదే తప్ప మోడీకీ అమిత్ షాకీ, మోహన్ భాగవత్కీ ఆ స్థానం కల్పించడం భావ్యం కాదని భారతీయ మేధావి వర్గం, రాజకీయులు, పత్రికా రచయితలూ అభ్యంతరం ప్రకటించారు. అంతకు మించి, భారత జాతిపిత ఎవరో ట్రంప్ నుంచి నేర్చుకునే దౌర్భాగ్యం మనకింకా పట్టలేదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. దానిమీదట, దేశభక్తిని గుత్తకు పుచ్చుకున్న “కాషాయ దళం”, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ తరఫున బరిలోకి దిగిపోయింది. గాంధీజీని జాతి పితామహుడనీ, మోడీని జాతిపిత అనీ అంటే తప్పేముందని కాషాయదళం ప్రశ్నించింది కూడా! సంతోషం- మోడీయే భారత జాతి పిత, అతగాడే జాతిపితామహుడు కూడానని ట్రంపూ, కాషాయ దళమూ బరితెగించి శాసిస్తే నోరులేని భారతజాతి చేయగలిగేది ఏముంటుంది?
అయినప్పటికీ పాపం గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ, మౌనం పాటించలేక, ట్రంప్ వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. అంతేకాదు- సర్కారు “ఘనంగా” జరిపించదల్చిన గాంధీజీ 150వ జయంతిని వాస్తవానికి “కేవల లాంఛనంగా మాత్రమే” పాటిస్తున్నారని కూడా తుషార్ గాంధీ వ్యాఖ్యానించడం గమనార్హం. గాంధీజీని నిలువునా హత్యచేసిన నత్తూరాం గోడ్సే ని ఘనంగా కీర్తించేందుకు సంఘపరివారం చేస్తున్న ప్రయత్నాల్లోని సంభావ్యతను గురించి కొందరు పాత్రికేయులు తుషార్ గాంధీని ప్రశ్నించారు. “ఈ విషయంలో ఏది మంచిదో, ఏది కాదో చరిత్ర నిర్ణయిస్తుంది” అని మాత్రమే అన్నారు తుషార్ గాంధీ. “విద్వేషాన్నీ, హింసనూ ఆరాధించేవాళ్ళు కావాలనుకుంటే గోడ్సేని పూజించ వచ్చు. నేను వారిని వ్యతిరేకించను” అని మాత్రమే అన్నారాయన. అక్కడితో ఆగక “ఇవాళ భారత జాతిపిత స్థానంలో మోడీని కూర్చోపెడుతున్న ట్రంప్, రేపు జార్జ్ వాషింగ్టన్ స్థానంలో తాను చతికిలబడినా వింత లేదు” అని కూడా అన్నారు తుషార్ గాంధీ. గాంధీజీ మునిమనవడు తన ముత్తాత చూపిన బాటలోనే స్పందించడం గమనార్హం.
కానీ, కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు. వారిలో ముందుగా చెప్పవలసింది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యల గురించి. “మోడీ నిజమైన దేశభక్తుడే అయితే అక్కడే, ట్రంప్ సమక్షంలోనే, ఆ దుర్వ్యాఖ్యానాన్ని ఖండించి ఉండాల్సిన”దని సిద్దరామయ్య అన్నారు. అంతేకాదు- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను “అజ్ఞాని”గా అభివర్ణించారాయన. అక్కడితో ఆగక, ట్రంప్కూ, మోడీకీ తేడా లేదని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. భారత జాతిపిత ఎవరో ట్రంప్ కనీసం బరాక్ ఒబామాను అడిగి ఉండాల్సిందని కూడా సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ట్రంప్ చేసిన వ్యాఖ్య కేవలం చరిత్ర (అ) జ్ఞానానికి పరిమితమైన విషయం కాదు. అది మౌలికంగా నైతిక విషయం.
భారతీయుల మనసులలో జాతీయ భావన పాదుకొల్పిన వాడు గాంధీజీ.
లాల్, బాల్, పాల్ లు మొదలుపెట్టిన జాతి నిర్మాణాన్ని మేలిమలుపు తిప్పిన వాడు గాంధీజీ.
“జడలు విచ్చిన, సుడులు రెచ్చిన” మతోన్మాదం జాతిని నమిలి మింగేయకుండా అహర్నిశలూ పాటుపడినవాడు గాంధీజీ.
చివరికి, జాతి సంక్షేమంకోసం ప్రాణాలను సైతం బలిపెట్టిన త్యాగశీలి గాంధీజీ. మార్టిన్ లూథర్ కింగ్ (జూ), నెల్సన్ మండేలా, ఒకదశలో చే గెవారా తదితరులను ప్రభావితం చేసిన మూర్తిమత్వం గాంధీజీది.
అందుకే ఆయన్ను రబీన్ద్రనాథ్ టాగోర్ “మహాత్ముడి”గా భావించి సంభావించాడు.
ఆ నాటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానకార్యదర్శి పూరన్ చంద్ (పీసీ) జోషీ, గాంధీజీని జాతిపితగా పిలిచిన మొదటి వ్యక్తి.
అటువంటి మహాత్ముడి స్థానంలో, మోడీని ప్రతిష్ఠించాలన్న ట్రంప్ ప్రయత్నం అతగాడి సంస్కారానికి మచ్చుతునక!
విదేశీ గడ్డమీద, స్వదేశీయుల సమక్షంలో, ఎన్నికల సభలో మాట్లాడిన రీతిలో ప్రసంగించిన ఓ సామాన్య నాయకుణ్ణి, జాతిపిత స్థానంలో ప్రతిష్ఠించాలనుకోవడం నైతిక సమస్య కాక మరేమిటి?
పదుల వేలమంది స్వదేశీయుల సమక్షంలో తెలిసీ తెలియని ఒకానొక పరదేశి జాతిపితను అవమానిస్తుంటే ప్రసన్నవదనంతో చూస్తుండడం కచ్చితంగా నైతిక సమస్యే!
చట్టపరంగా అది నేరం కాకపోవచ్చు- నైతికంగా మాత్రం అది ఘోరమే!
చట్టపరమైన లొసుగులు ఉపయోగించుకుని వందల కోట్లు సంపాదించానని నిర్భయంగా చెప్పిన ట్రంప్ ఏమాటైనా అనగలడు.
బజారు మనుషులు మాట్లాడ్డానికి కూడా సిగ్గుపడే బూతులు సైతం పలకగలడు.
కానీ, అలాంటి వ్యక్తి జాతి పితను అవమానిస్తుంటే చూసి ఊరుకున్న ప్రధాన మంత్రి మోడీని గురించి ఏమనుకోవాలి??
ఇదీ మనముందున్న అసలైన నైతిక సమస్య!
-మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ