ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56 అంగుళాల ఛాతీ ఘనతగా చెప్పుకోకపోతే ఆశ్చర్యపోవాలి గానీ చెప్పుకుంటే ఆశ్చర్యం ఎందుకు?
దేశ రక్షణ వంటి సందర్భాలలో ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా మాట్లాడడం కొంచె కష్టమే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ పని చేయగలిగారు. ‘పుల్వామా సంఘటనకు దారి తీసిన ప్రభుత్వ ఉదాశీనత’ను ఆమె ప్రస్తావించారు. దాడి జరగవచ్చన్న ఇంటలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఆ తర్వాత మరికొందరు ప్రతిపక్ష నాయకులు అందిపుచ్చుకున్నారు.
మమత లేవనెత్తిన సందేహం తర్వాత చాలా జరిగాయి. మంగళవారం తెల్లవారు జామున ఇండియా వైమానిక దళం విమానాలు వాస్తవాధీన రేఖ దాటి బాల్కోట్లో ఉన్న జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబులు కురిపించాయి. అంతవరకూ మోదీ, అమిత్ షా ద్వయం బాగానే ఉన్నారు. మధ్యాహ్నం రాజస్థాన్లో ఒక బిజెపి కార్యక్రమానికి వెళ్లిన మోదీ అక్కడ గొంతు విప్పారు. పేరు పెట్టకుండా ఇంతవరకూ అధికారంలో ఉన్నవారు దేశభద్రత గురించి పట్టించుకోలేదనీ, ఇప్పుడు దేశం భద్ర హస్తాలలో ఉందనీ ఆయన చెప్పుకొచ్చారు.
పుల్వామా దాడికి ప్రతిగా ఇండియా జరిపిన వైమానిక దాడిని అన్ని ప్రతిపక్షాలూ స్వాగతించాయి. దేశరక్షణ రాజకీయాలకు అతీతం అని చాటాయి. పొరుగు దేశమైన పాకిస్థాన్తో ఇండియా ఇప్పటికి మూడు యుద్ధాలు చేసింది. పరిమిత స్థాయిలో జరిగిన కార్గిల్ పోరు వాటికి అదనం. పాకిస్థాన్తో మరో యుద్ధానికి దారితీయగల పరిణామాలను ప్రధాని మాత్రం తన ప్రచారానికి, ఎన్నికల ప్రయోజనాలకూ ఉపయోగించుకోజూశారు.
మోదీ దారి చూపిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎంతసేపు ఉరుకోగలరు! ఆయన కూడా నోరు విప్పారు. పాకిస్థాన్కు తగిన జవాబు ఇచ్చి, టెరరిజాన్ని రూపుమాపి దేశాన్ని రక్షించగల సత్తా ఒక్క నరేంద్ర మోదీకే ఉందని పేర్కొన్నారు. కాబట్టి సరిహద్దులో ఉద్రిక్తతలు బిజెపి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అవరోధం కాబోవని ఆయన ప్రకటించారు.
ఆయన అన్నట్లే బిజెపి నేతల కార్యక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి. బుధవారం ప్రధాని వేరే కార్యక్రమాలతో బిజీగా ఉండగా ఉన్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు చత్తీస్గఢ్ వెళ్లారు.
మరోపక్క సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ భారత మిలటరీ స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. అడ్డుకుని ఒక ఎఫ్16 విమానాన్ని కూల్చిన ఇండియా ఒక మిగ్ విమానాన్ని కొల్పోయింది. దాని పైలట్ అభినందన్ పాక్కు బందీగా చిక్కారు. మరి ప్రధాని మోదీ ఏంచేస్తున్నారు? బుధవారం ఖేలో ఇండియా యాప్ను ఆవిష్కరించారు. గురువారం బిజెపి బూత్ స్థాయి కార్యకర్తలతో ‘ప్రపంచంలో ఇంతవరకూ జరగనంతటి పెద్ద వీడియో కాన్ఫరెన్స్’ ద్వారా ముచ్చటించారు.
అక్కడ ఆయన ఏం మట్లాడతారో మనం ఊహించుకోవచ్చు: ‘పాకిస్థాన్ ఇండియాను విచ్ఛినం చేసి తద్వారా దేశాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నది. మనలను విభజించాలని చూస్తోంది. వారి పన్నాగాలను సాగనివ్వం. దేశమంతా సాయుధ బలగాల వెనుక ఉంది. భారత సైన్యాన్ని విశ్వసించండి. నా ప్రభుత్వం కొత్త ఇండియాను రూపొందిస్తున్నది. ఇండియా పురోగతి ఆగదు’.
ఈ మాటలతో మోదీ ఆగలేదు. దేశంలో రానున్న ఎన్నికలను ప్రపంచం అంతా చూస్తుందని అంటూ ఎన్నికలతో లింకు పెట్టారు. నిజానికి ఆ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందే ఎన్నికల కోసం కదా! కాబట్టి అదే ఊపులో ప్రతిపక్షం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పధకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
పాకిస్థాన్తో యుద్ధవాతావరణం నెలకొని ఉన్న తరుణంలో బిజెపిని మళ్లీ గెలిపించడానికి కృషి చేయడంటూ కార్యకర్తలకు పిలుపునిస్తూ, పాకిస్థాన్ ఇండియాను విడదీయాలని చూస్తున్నదని మోదీ అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలకు తాను ఇస్తున్న సందేశం దేశమంతా న్యూస్ ఛానళ్లలో ప్రత్యక్షప్రసారం అవుతోందని మోదీకి తెలుసు. మోదీ ఇచ్చిన సంకేతాన్ని బిజెపి కర్నాటక నాయకుడు యడ్యూరప్ప చక్కగా అర్ధం చేసుకున్నారు. మెరుపు దాడుల కారణంగా కర్నాటకలో బిజెపి అన్ని సీట్లూ గెలుస్తుందని ఢంకా బజాయించారు.
ఒకపక్క సరిహద్దులో యుద్ధమేఘాలు అలముకుని ఉన్నాయి. ఇరు దేశాల మధ్యా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తోయోనని ప్రపంచ దేశాలు అందోళన చెందుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి అంతవాడు ఈ విషయంపై మాట్లాడాడు. ప్రధాని మాత్రం అధికారికంగా ఇంతవరకూ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. ‘పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ చెప్పిన మాటలే నా సందేశం వినుకోండి’ అన్న వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల్లో ఇంత జరిగితే, ఒక యుధ్దవిమానం కూలిపోయి దాని పైలట్ శత్రుదేశానికి బందీగా చిక్కితే అఖిలపక్ష సమావేశం పెట్టి అందరితో విషయాలు పంచుకోవాలని ఆయన ఇంతవరకూ అనుకోలేదు.
దేశానికి తన నాయకత్వం తప్ప మరో దిక్కు లేదని వీలైనంత ఎక్కువ మంది ప్రజలు భావించాలన్నది నరేంద్ర మోదీ ఆకాంక్ష. అంతవరకూ బాగానే ఉంది. అలా అనుకోవడంలో తప్పు లేదు. కనీసం దేశ భద్రతకు బయటనుంచి సవాలు ఎదురయిన సందర్భంలోనైనా సంకుచిత రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి పదిమందీ మెచ్చుకునే నాయకత్వం ప్రదర్శించాలి కదా.
ఆలపాటి సురేశ్ కుమార్