ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత నవ్వులాటగా మారిపోయిందో మహా రాష్ట్ర రాజకీయ పరిణామాలు తేటతెల్లం చేశాయి. ఓటర్లను కేవలం ఓటేయడానికే తప్ప మరెందుకూ కొరగాకుండా నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులకే దక్కుతుంది. నీచంగా నికృష్టంగా పదవి మాత్రమే పరమార్థంగా భావించే అత్యంత స్వార్థపరులున్న దేశంగా మన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రసిద్ధికెక్కిందనడానికి మహారాష్ట్ర పాలిట్రిక్స్ను పరమోదాహరణగా చూపించవచ్చు. నోటుకో.. వింత వింత వాగ్దానాల పోటుకో లొంగిపోయిన జనత ఓటేసేశాం ఇక మీ ఇష్టం అన్నట్టు తమాషా చూడ్డం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయులుగా మారిపోయారు. ఏది పవిత్రత..ఏది అపవిత్రత…ఏది నీతి..ఏది అవినీతి అనే అంశాల మధ్య రేఖ చెరిగిపోయింది. ఇక ఎంత దిగజారుడు రాజకీయ నాటకాలు ముందు ముందు చూడాలో అన్నదే ముఖ్యం. కనీసం మన చట్టాల్లో ఉన్న లోపాలను సవరించుకుంటే ఇలాంటి పోస్ట్ పోల్ స్వార్థ డ్రామాలను అరికట్టవచ్చన్న స్పృహ ఇకముందైనా మనవారికి కలుగుతుందని ఆశించడానికి కూడా అవకాశాలు కనపడ్డం లేదు.
ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం మొత్తానికి ఒక కొలిక్కి చేరింది. ఏదో పెనుభారం దిగినట్టయ్యింది. ఏభైవేల కుటుంబాల కన్నీటి బరువు నా హృదయం మీదే గడ్డకట్టినట్టు గిలగిల్లాడిపోయాను. అందుకే ఏం చేయాలో ఏం రాయాలో తెలీక కేసీయార్ గారిని ప్రాధేయపడుతున్నట్టు మొన్న రాత్రి ఒక పోస్టు పెట్టాను. అనునయంతో కాదు ఆగ్రహంతో పెట్టండి అని ఒక మిత్రుడు మెసేజ్ పంపాడు. ఇప్పుడు దానికి సమయం కాదు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఎవరూ నిలవలేకపోయారు. ఏదో ప్రళయం వస్తుందన్న ఆశలు సన్నగిల్లాయి. ఏ దిక్కూ లేకనే కార్మికులు రాజీపడ్డారు. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది చేతుల్లోంచి జారిపోతున్న జీవితమే. కేవలం జీతమే. బిడ్డల కళ్ళల్లోకి చూడలేని భయాందోళన. ఎటు చూసినా చీకటి. సముద్రంలో దూకడమా ఉరిపోసుకు చావడమా అన్న పీకులాట. వారు ఏమైపోతారా అన్న దిగులు ఎందరిలోనో ఉంది. నాలాగా ఎందరో దు:ఖితులై ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం అందరికీ ఓ ఊరట. కాలం ఎప్పటికీ ఒకే లెక్కనుండదని అందరికీ తెలుసు కదా. ఇప్పటి లెక్కలు ఇప్పటివే.
దొర దిగొచ్చాడని అనలేం. అలాగని కనికరించాడని సరిపెట్టుకోవాలా? స్వామివారి మనసు అలా సంతృప్తి చెందితే అలాగే అనుకుందాం. కథ సుఖాంతమా దు:ఖాంతమా? ఇప్పటికి ఇలాంటి మీమాంసలు అనవసరం. అన్ని యుద్ధాలనూ గెలుపోటముల తరాజులోనే తూయలేం. ఓడిపోయామనుకుంటూ ఒకరు గెలవొచ్చు. గెలిచామనుకుంటూ ఒకరు ఓడొచ్చు. ఒక్కోసారి జయాపజయాల మధ్య విభజన రేఖ ఏమాత్రం కనిపించకపోయినా ఆశ్చర్యం లేదు. వారి వారి అవగాహనల స్థాయికి అది ఒదిగిపోతుంది. నేను మొన్న నా పోస్టులో రాసిన విషయాలు మరోసారి గుర్తుచేసుకుంటున్నాను.
‘’ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో అని దాశరథి అన్న మాటల అంతరార్థం ఏమిటో పండితులైన కేసీయార్ గారికి బాగా తెలుసనుకుంటాను. తనను గెలిపించిన జన కంఠాల మహాఘోష మరో రూపంలో తనకు తగల కూడదన్న స్పృహ ఆయనకు తప్పక వుంటుందనే అనుకుంటాను. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా ఆయన పాదాలను లక్షల చేతులు చుట్టుకొని వుంటాయి. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా లక్షల కన్నీటి చుక్కలు ఆయన పాదాల మీద కురుస్తూ వుండివుంటాయి. మరి ఆయన చలించకుండా ఎలా ఉండగలరు? ఏది తప్పు..ఏది ఒప్పు..ఏది హక్కు..ఏది అహంకారం ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అని, యాభై వేల కుటుంబాల ఇళ్ళలో కళ్ళలో గడ్డ కట్టిన చీకట్లను బద్దలు కొట్టడమే ప్రస్తుత కర్తవ్యమని ముఖ్యమంత్రి గారు గమనిస్తారనే అనుకుంటాను. సమ్మెలు ఎవరు చెయ్యాలి..ఎప్పుడు చెయ్యాలి..ఎవరికోసం ఎవరి కనుసన్నల్లో చెయ్యాలి అని సమస్త కార్మిక లోకం ఒక చోట కూర్చుని తీరుబడిగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కాలం ఏం తీర్మానిస్తుందో ఇప్పుడు ఊహించలేం. ఇప్పటికి మాత్రం తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి హృదయానికి హత్తుకున్నట్టు ముఖ్యమంత్రి గారు తన అత్యంత బలమైన రెండు చేతులతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటారని నేను కూడా ఓ కార్మికుడినై కలగంటాను.’’
ఎంతో దిగులుతో ఎంతో ఆవేదనతో రాసుకున్న మాటలివి. మొత్తానికి తెల్లారింది. తాత్కాలికంగానైనా చీకట్లు వీడిపోయాయి. కార్మికుల కళ్ళలో వారి కుటుంబాలలో బతుకు జీవుడా అన్న ఒక తక్షణ ఉపశమనం వెలుగులు చిమ్ముతుంది. ఈ సమ్మె ఏం సాధించిందో ఇప్పుడు చెప్పలేం. పాఠాలు మాత్రం చాలా నేర్పింది. ట్రేడ్ యూనియన్లు..కార్మిక నాయకులు..కార్మికులకు తామే దిక్కనుకునే పార్టీలు..కులాల సంఘాలు..సొంత ఎజెండాలతోనే పోరాటాలు చేసినా..విరమించుకున్నా అన్నట్టు నిరూపించుకుంటున్న పార్టీలు అన్నీ ఎలాంటి అనైక్య అశక్త అయోమయ స్థితిలో ఉన్నాయో అర్థమైపోయింది. ఒక గ్రహణం వీడింది సంతోషిద్దాం. ఇప్పటికింతే.
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ