భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ వార్తలకు మీడియా మొదటినుంచీ చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన సైంటిఫిక్ టెంపర్మెంట్కు కనీసం ఆ సీజన్లో గౌరవం దక్కుతూ వచ్చింది. కొద్ది సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఏలుబడి మొదలయిన తర్వాత సైన్స్ కాంగ్రెస్ వార్తలకు ఇంకా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఆ ప్రాధాన్యతకు కారణమైన అంశాలు సంతోషించదగ్గవి మాత్రం కావు.
‘వేదాల్లోనే అన్నీ ఉన్నాయష’ అని కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు గారు అగ్నిహోత్రావధాన్లుతో చెప్పిస్తారు. వేదాలు విజ్ఞానసర్వస్వం అనే భావనపై ఆ మహనుభావుడు ఆ రోజుల్లోనే వదిలిన వ్యంగాస్త్రం అది. గురజాడ గతించి, ఆయన మనకు ఇచ్చిపోయిన గొప్ప కావ్యం కన్యాశుల్కానికి వందేళ్లు నిండిపోయిన తర్వాత కూడా మనం ఇంకా వేదాల గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో ఈ కారణాల వల్లే ఈ మధ్య కాలంలో సైన్స్ కాంగ్రెస్ వార్తల్లో ఎక్కువ నిలుస్తున్నది.
అధునాతన విజ్ఞానం అంతా హిందూమతానికి చెందిన ఇతిహాసాల్లో, పురాణాల్లో, వేదాలలో గంపల కొద్దీ దాగి ఉందని హిందూ ఆధిక్యతావాదులు చెబుతున్నారు. సూడో సైంటిస్టులు, దారిన పోయే దానయ్యలు ఏం మాట్లాడినా ఫరవాలేదు. బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నవారు, అంతకన్నా ముఖ్యంగా విద్యా వైజ్ఞానిక రంగాల్లో పనిచేస్తున్న వారు అలాంటి మాటలు అంటే దాని ప్రభావం ఎంతోకొంత సమాజంపై పడకుండా ఉంటుందా!
ఈ ధోరణికి నాంది పలికింది ప్రధానమంత్రి నరేంద్ర మోది: ‘మహాభారతంలోని కర్ణుడు తల్లి గర్భం నుంచి జనించలేదన్న సంగతి ఆనాడే కృత్రిమ గర్భధారణ టెక్నాలజీ అందుబాటులో ఉందన్నదానికి తార్కాణం. వినాయకుడికి ఏనుగు శిరస్సు ఉండడం ఆనాడే విశిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ విజ్ఞానం ఉండేదన్న మాటకు నిదర్శనం’. ఆశ్చర్యపోవద్దు, ఇవన్నీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సైన్స్ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ సెలవిచ్చిన సంగతులే. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ‘పురాణకాలం నాటి రుషులు దివ్యదృష్టితో వీక్షించేవారు. ఈనాటి టెలివిజన్ టెక్నాలజీకి అదే మూలం’ అని విద్యార్ధులకు బోధించారు.
గత మార్చిలో 105వ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభిస్తూ, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ సభలో ఉన్న సైంటిస్టులు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ద్రవ్యరాశి – శక్తి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన సమీకరణ కన్నా గొప్ప సిద్దాంతం వేదాలలో ఉన్నదని మరో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేర్కొన్నాడని మంత్రి ప్రకటించారు. ఆ మంత్రి స్వయనా వైద్యశాస్త్రం చదివిన వాడు.
గత సంవత్సరం ఇకొక సందర్భంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ, మానవుడు జీవ పరిణామక్రమంలో ఉద్భవించాడని చెబుతున్న కారణంగా డార్విన్ సిద్ధాంతం శుద్ధ తప్పు అని పేర్కొన్నారు. ఇవి తెలిసీ తెలియక మాట్లాడుతున్న మాటలు అనుకోవడం పొరపాటు. ఇది ఒక సంస్కృతిగా తయారయింది. హిందూ ఆధిక్యతా భావనను వ్యాప్తి చేసేందుకు దేశాన్ని పాలిస్తున్న వారే ఇలాంటి భావజాలాన్ని పని కట్టుకుని ప్రచారం చేస్తున్నపుడు దీనిని సంస్కృతి అనక మరే అనగలం!
ఇలాంటి సంస్కృతిలో విశ్వవిద్యాలయాల కులపతులు కూడా భ్రష్ట భావజాలాన్ని వ్యాపింపజేస్తే ఆశ్యర్యపోవాల్సిందేముంది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు మొన్నటి సైన్స్ కాంగ్రెస్లో మాటలాడిన మాటలను ఈ కోణంలో చూడాలి. పురాతన కాలంలోనే ఇండియాలో స్టెమ్ సెల్స్ టెక్నాలజీ, టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ఉందనేదానికి కౌరవుల పుట్టుకే నిదర్శనమని ఆయన అన్నారు.
దేశం అంతటా విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత వాటిని పాలించే విద్యావేత్తలు ప్రలోభాలకో, వత్తిడికో లొంగకుండా ఉంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీ జెఎన్యులో ఏం జరిగిందో మనం చూశాం. దేశం అంతటా కనబడని వత్తిడితో కూడిన వాతావరణం అలముకుపోయుంది. హిందూ ఆధిక్యతా భావనకు వ్యతిరేకంగా ఎవరైనా నోరు మెదిపితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ భయంకరంగా ఉంటోంది.
ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ప్రభుత్వాలు మారితే పరిస్థితి మారుతుందని అనుకుంటే పొరపాటే. ప్రభుత్వాలు మారినా గానీ దేశంలో హిందూ ఆధిక్యతా భావనను వ్యాపింపజేసే ప్రయత్నాలు ఆగవు. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆ మత రాజకీయాలే దిక్కు కదా! మహా అయితే వేరే ప్రభుత్వం ఉన్న కారణంగా ఆ ప్రయత్నాలకు సర్కారు దన్ను లేకుండా పోతుందమో, అంతే. అశాస్త్రీయమైన, హేతువిరుద్ధమైన ప్రాచీన వైభోగాన్ని స్తుతించడం మాత్రం ఆగదు.
ఈ పోకడలు సమాజం అభివృద్ధికి హానికరమైనవి. వీటిని ఎదుర్కోవడం అత్యావశ్యకం. దానికి రెండు దారులు లేవు. ఉన్న ఒకటే దారి ప్రతిఘటించడం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయినా వెనుకాడకుండా నిజం మాట్లాడడం. హేతువాదులు, ప్రజాస్వామిక వాదులు అందరి పవిత్ర కర్తవ్యం ఇది. రాజకీయ అధికారం కోసం సాగే వికృతక్రీడలో భారతసమాజం మొద్దుబారిపోవడాన్ని అనుమతించకూడదు.
ఆలపాటి సురేశ్ కుమార్