ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా 260 మందికి పైగా ప్రపంచ రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు మోదీని కోరారు. పెన్ ఇంటర్నేషనల్ అనేది లండన్ కేంద్రంగా పని చేసే అంతర్జాతీయ రచయితల సంఘం.
నిజానికి ఇక్కడ మనకి కావాల్సింది పెన్ ఇంటర్నేషనల్ వివరాలు కాదు; ఆతిష్ తసీర్కి పట్టిన గతి; అతనిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ విధంగా టార్గెట్ చేసిందన్న సంగతి.
ముందు ఒసిఐ హోదా అంటే ఏమిటో చూద్దాం. ఓవర్సీస్ సిటెజెన్ ఆఫ్ ఇండియా (ఒసిఐ) హోదా విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ సంతతి వారికి ఇస్తారు. ఈ కార్డు ఉన్నవారు ఇండియాకు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు. భారతీయ సంతతి వారైఉండి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మినహా విదేశీ పాస్పోర్టు కలిగిఉన్నవారు దీనికి అర్హులు.
ఇక ఆతిష్ తసీర్ ఎవరన్న విషయం చూద్దాం. ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్టు అయిన పంజాబీ సిక్కు తవ్లీన్ సింగ్ తసీర్ తల్లి. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రం గవర్నర్గా చేసిన ఉదారవాది సల్మాన్ తసీర్ ఆతిష్ తసీర్ తండ్రి. భయంకరమైన పాకిస్థాన్ దైవదూషణ చట్టాన్ని సల్మాన్ తసీర్ బహిరంగంగా ఖండించారు. పంజాబ్ గవర్నర్గా ఉండగానే ఆసియా బీ అనే మహిళపై దైవదూషణ చట్టం ప్రయోగాన్ని ఆయన వ్యతిరేకించారు. దాని పర్యవసానంగా సల్మాన్ తసీర్ను 2011లో ఆయన అంగరక్షకుడే కాల్చిచంపాడు.
తవ్లీన్ సింగ్తో 1980లో ఢిల్లీలో సల్మాన్కు పరిచయమైంది. ఇద్దరి మధ్యా సాగిన చిన్నపాటి ఎఫైర్ పర్యవసానంగా ఆతిష్ పుట్టాడు. ఆ ఎఫైర్ తర్వాత సల్మాన్, తవ్లీన్ మరి కలుసుకోనేలేదు. తవ్లీన్ ఆతిష్కు తల్లీతండ్రీ తానే అయి పెంచింది. 20 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఆతిష్ ఇండియాలోనే పెరిగాడు. ఆతిష్ తనకు 21 సంవత్సరాల వయసు వచ్చేవరకూ తండ్రిని ఒక్కసారి కూడా చూడలేదు. రచయిత, జర్నలిస్టు అయిన ఆతిష్ ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్నాడు.
ఇటీవల భారత ప్రభుత్వం ఆతిష్ ఒసిఐ హోదా రద్దు చేసింది. దానికి చూపిన కారణం ఏమంటే ఓసిఐ హోదాకోసం దరఖాస్తు చేసుకున్నపుడు ఆతిష్ తన తండ్రి పాకిస్థానీ అని రాయలేదట. ఆతిష్ తన దరఖాస్తులో తండ్రి పేరు ఉన్నదున్నట్లే రాశాడు. ఆయన పాకిస్థానీ అని రాయకపోవచ్చు. అయితే తన తండ్రి ఎవరన్నది దాచేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతిష్ ఎవరో తెలిసిన వారందరికీ అతని తండ్రి ఎవరన్నది తెలుసు. నిజానికి ఆతిష్ రాసిన మొదటి పుస్తకం ‘స్ట్రేంజర్ టు హిస్టరీ’లో అతను తన తల్లిదండ్రుల మధ్య స్వల్పకాలం నడిచిన సంబంధం గురించి వివరంగా చర్చించాడు.
ఇక అసలు విషయానికి వద్దాం. ఆతిష్ ఓసిఐ హోదా రద్దు చేయాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించినట్లు? 2019 ఎన్నికల ముందు తసీర్ నరేంద్ర మోదీపై రాసిన ఒక వ్యాసాన్ని ‘టైమ్’ మ్యాగజైన్ ముఖచిత్ర కథనంగా ప్రచురించింది. ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అని ఆ కథనానికి శీర్షిక ఇచ్చారు. అంటే ఇండియాను చీలుస్తున్న శక్తుల నాయకుడు అని. తసీర్పై ప్రభుత్వం ఆగ్రహానికి కారణం ఇదేనని అందరికీ తెలుసు. అందరికీ తెలుసని ప్రభుత్వానికీ తెలుసు. తెలిస్తే ఏమిటట! మనల్ని ఏం చేయగలరు? ఇదీ వైఖరి.
టైమ్స్ సంచిక విడుదల కాగానే బిజెపి వారు నిప్పులు కక్కారు. తసీర్పై కట్టుకథలు ప్రచారం చేసేందుకు బిజెపి సోషల్ మీడియా సెల్ ఓవర్ టైం పని చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంవిత్ పాత్రా, తసీర్ను పాకిస్థానీగా అభివర్ణించారు. ఓ పాకిస్థానీ నుంచి ఇంకే ఆశించగలం అన్నారు. తసీర్ ఒకటో ఏట నుంచి 20 ఏళ్ల వరకూ ఇండియాలోనే తల్లి దగ్గర పెరిగాడనీ, అతను పాకిస్థాన్లో ఎప్పుడూ లేడనీ సంవిత్ పాత్రాకు తెలియదనుకోలేం. పుట్టుక కారణంగా తసీర్కు బ్రిటిష్ పౌరసత్వం సంక్రమించిందన్న విషయం కూడా ఆయనకు తెలిసే ఉండాలి. అయితేనేం, బురద చల్లాలి కాబట్టి చల్లడమే. కడుక్కునే వాడిది కదా బాధ!
సంవిత్ పాత్రా ఈ పని చేశాడంటే అర్ధం ఉంది. ఆయనకు బిజెపిలో ఆ పదవి ఇచ్చిందే అందుకు. ఏకంగా ప్రధానమంత్రి మోదీ నోట కూడా ఇవే మాటలు వస్తే ఏమనుకోవాలి! ముందు ఆయన, టైం మ్యాగజైన్ విదేశీ పత్రిక అన్నారు. తర్వాత, ‘రచయిత కూడా తాను పాకిస్థానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. అతని విశ్వసనీయత ఎంతో తెలుసుకోవడానికి ఇంకేం కావాలి’ అన్నారు ప్రధాని.
ఆతిష్ తసీర్ జర్నలిస్టు. అతని వ్యాసాన్ని ప్రచురించింది చిన్నా చితకా పత్రిక కాదు. టైం మ్యాగజైన్కు చాలా ఘనమైన చరిత్ర ఉంది. నిజానికి అంత పెద్ద పత్రికలో ఆ వ్యాసం రావడమే ఏలినవారి ఆగ్రహానికి అసలు కారణం. ఆ కథనంలో తసీర్ రాసింది మనకెవరికీ కొత్త కాదు. ఇక్కడ ఇండియాలో స్వతంత్రంగా నడిచే మీడియాలో వస్తున్న కథనాలే అవి. అదే టైం మ్యాగజైన్లో వచ్చేసరికి బ్రహ్మాడం బద్దలయింది.
ఒక జర్నలిస్టుగా ఇండియాలో రాజకీయ పరిస్థితి గురించి నిజాయితీగా తన విశ్లేషణ రాసినందుకు ఆతిష్ తసీర్ తన మాతృభూమికి దూరం అయ్యే ప్రమాదంలో పడ్డాడు. ఇవాళ అతని ఒసిఐ హోదా రద్దు చేసినవారు రేపు వీసా బ్లాక్లిస్టులో చేర్చరని నమ్మకం ఏముంది. న్యూయార్క్లోని భారత కాన్సలేట్ నుంచి ఇప్పటికే ఆ బెదిరింపు కూడా అందింది.
పాకిస్థాన్కు చెందిన తండ్రితో ఏనాడూ సంబంధాలు లేవు కాబట్టి ఆతిష్కు అటువైపు రక్తసంబంధీకులు లేరు. ఈ భూమ్మీద జన్మతో సంక్రమించిన రక్తబంధం అతనికి తల్లి, అమ్మమ్మ మాత్రమే. 70 ఏళ్ల తల్లి, 90 ఏళ్ల అమ్మమ్మ ఇద్దరూ ఇండియాలోనే ఉన్నారు. జననీ జన్మభూమిశ్చ.. అన్నారు. ఇక జననీ లేదు. జన్మభూమీ లేదు. చూశారా ఎంత క్రూరమైన దెబ్బ కొట్టారో ఆతిష్ తసీర్ను!?
-ఆలపాటి సురేశ్ కుమార్