ముజఫర్నగర్ అల్లర్లకు నిరసనగా లక్నోలో ప్రదర్శన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. file photo
ముజఫర్ నగర్లో 2013వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల సందర్భంగా 100 మందిపై పెట్టిన 38 కేసుల ఉపసంహరణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫార్సు చేశారు. ఆనాడు జరిగిన మత ఘర్షణలలో కనీసం 60 మంది మరణించగా, 40 వేల మంది చెల్లాచెదురయ్యారు. పోలీసు నిషేధాజ్ఞలు ఖాతరు చేయకుండా మహా పంచాయత్లో హిందూ యువకులను రెచ్చకొడుతూ ప్రసంగించిన విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీకి గతవారం బెయిల్ మంజూరయింది . ఆ ప్రసంగం తర్వాతనే ముజఫర్నగర్ మత ఘర్షణలు మొదల్యాయి.
మరోపక్క ఈ వారంలోనే, ఆనాటి మత ఘర్షణల సమయంలో ఇద్దరు హిందూ యువకులను హత్య చేశారన్న అభియోగంపై ఏడుగురు వ్యక్తులకు కోర్టు శిక్ష విధించింది. ఈ వరస పరిణామాలను చూస్తుంటే మతఘర్షణలను రెచ్చగొట్టే వారినీ, మైనారిటీలపై దాడులకు పాల్పడే వారినీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం వదిలేస్తుందని, లేదా వారికి భారతీయ జనతాపార్టీ నుంచి రాజకీయ రివార్డులు లభిస్తాయని అర్ధం అవుతోంది.
ముజఫర్నగర్ అల్లర్లలో మైనారిటీలపై దాడులచేయడంలో కీలక పాత్రవహించిన వారికి రాజకీయ పునరావాసం వెంటనే కల్పించారు. నాటి మతపరమైన అల్లర్లలో నిందితులైన కున్వార్ భారదేంద్ర సింగ్, సంజీవ్ బలియాన్లకు 2014 లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టిక్కెట్లు ఇవ్వడం, విజయం సాధించడం జరిగింది. సంజీవ్ బలియాన్ 2017 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో ముగ్గురు నిందితులు ఉమేష్ మాలిక్, సంగీత్ సోమ్, సురేష్ రానాలు ఉత్తరప్రదేశ్ శాసన సభలో సభ్యులుగా ఉన్నారు.
నిజానికి ఈ క్రమంలో ఆదిత్యనాథ్ తొలి లబ్ధిదారుడు. 1998 లో మొట్టమొదటిసారిగా ఈయన లోకసభకు ఎన్నికయ్యారు. ఆదిత్యనాధ్ తనకు తాను హిందువుల రక్షకుడిగా చిత్రించుకుంటూ వచ్చారు. ముస్లింలను శిక్షించాల్సిన పరిస్థితి వచ్చిందని తాను భావించిన ప్రతిసారీ దానికి అయనే నాయకత్వం వహించారు. 2002 లో తూర్పు ఉత్తరప్రదేశ్లోని మోహన్ ముండేర గ్రామంలో ముస్లింలపై దాడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ దాడిలో 42 ఇళ్లు తగలబెట్టారు.
2007లో గోరఖ్పూర్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ, ఒక హిందూ హత్యకు 10 మంది ప్రాణాలు తీయడంతో బదులు చెప్పాలని ఒక సభలో పిలుపునిచ్చారు. ఆ మరుసటి రోజు ఇద్దరు హత్యకు గురికావడమే కాకుండా భారీఎత్తున హింస జరిగింది. పది సంవత్సరాల తరువాత ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు, 22 ఏళ్లగా ఆతనిపై వున్న కేసులన్నీ ఎత్తివేశారు.
ఆదిత్యనాధ్ పాలనలో మెజారిటీ మతస్థుల హింసకాండను చట్టబద్ధం చేయడం ఆగలేదు. తన హయాంలో పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తున్నారని గొప్పగా చెప్పుకునే ముఖ్యంమంత్రి ఆదిత్యనాధ్. 2017, మార్చి నుంచి 2018, జూలై మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో దాదాపు 3,000 ఎన్కౌంటర్లు నమోదయ్యాయి. నేరస్థులన్న పేరుతో కనీసం 78 మందిని హతమార్చారు. వీరిలో అత్యధికులు ముస్లింలు కాగా మిగిలినవారు దళితులు, ఇతర వెనుకబడిన తరగతులవారు.
ఈ పద్ధతిలో శాంతి భద్రతల విచ్ఛిన్నం, అధికారంలో ఉన్న వారు తమకు అనుకూలమైన న్యాయాన్ని అమలు చేయడం చూస్తే 2000 సంవత్సరం ప్రాంతం నాటి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏలుబడిలోని గుండారాజ్ గుర్తుకు రావచ్చు. అయితే ఆదిత్యనాధ్ హయాంలో జరుగుతున్నది మరింత భయానకమైనది: రాష్ట్రప్రభుత్వానికి ఇష్టం లేని వారిని, ప్రత్యేకించి మైనారిటీలను భయభ్రాతులుగా చేసి వారి నోరు మూయించేందుకు కావాలనే రాజ్యహింసకు పాల్పడుతోంది.
-ఇప్సితా చక్రవర్తి
స్క్రోల్ వెబ్సైట్ సౌజన్యంతో