హైదరాబాద్ : తన మీద నమ్మకం ఉంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కూకట్పల్లి సీటు కేటాయించారని మహా కూటమి తరఫున బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మీడియా ఎదుట తొలిసారిగా నందమూరి సుహాసిని మాట్లాడారు. రాజకీయాల్లోకి రావాలనేది తన చిన్ననాటి నుంచి ఉన్న కోరిక అని చెప్పారు.
ప్రజలకు సేవ చేస్తానని నమ్మి తనకు ఈ సీటు కేటాయించారన్నారు. ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడతానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే మా తాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. అప్పటి తెలుగు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించారని.. ఆ సమయంలో తన తండ్రి హరికృష్ణ రథసారథిగా ఉన్నారని నందమూరి సుహాసిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మా తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబును చూసి రాజకీయాల్లోకి రావాలని కోరిక తనలో కలిగిందన్నారు. శనివారం నామినేషన్ వేస్తానని తెలిపారు. ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని నందమూరి సుహాసిని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని మట్టి కరిపించాలని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, తెజస, సీపీఐలు ఒక తాటిపైకి వచ్చి.. మహా కూటమిని ఏర్పాటు చేశాయి.
ఈ నేపథ్యంలో టీడీపీకి 14 సీట్లు కేటాయించారు. అందులోభాగంగా హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి అసెంబ్లీ స్థానాన్ని రాజ్యసభ మాజీ ఎంపీ, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి చంద్రబాబు కేటాయించారు. అయితే కూకట్పల్లి నియోజకవర్గంలో సీమాంధ్రుల ఓట్లు అధికమే కాదు.. అత్యంత కీలకం కూడా.
కాగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి నందమూరి హరికృష్ణ కుమారుల్లో ఒకరైన కళ్యాణ్ రామ్కు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. మరో 10 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ఉండాలని భావిస్తున్నానని.. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగేందుకు కళ్యాణ్ రామ్ సుముఖత వ్యక్తం చేయలేదనే టాక్ వైరల్ అయింది. దీంతో చంద్రబాబు .. సుహాసిని వైపు మొగ్గు చూపారని సమాచారం.