అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇకపై సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అవకాశం కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉపసంహరించింది. ఇంతకు ముందెప్పుడో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటూ తాజాగా గెజెట్ ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ తనిఖీలు చేయాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు చేసేందుకు, దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అధికారం లేదని ఏపీ సర్కార్ పేర్కొంది. సమ్మతి ఉత్తర్వు రద్దు కారణంగా ఏపీలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారించే అధికారం కూడా సీబీఐకి ఉండదు. దరిమిలా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ర్ట ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని పైకి చెబుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీఓ ఏ మేరకు న్యాయబద్ధమైనది అనే విషయంపై పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తన అనుచరులపై దాడి చేస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడాన్ని నిరాకరిస్తూ జీఓ జారీ చేయడం ఏంటని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు.
ఒకప్పుడు సీబీఐని కీర్తించిన చంద్రబాబు.. తాజాగా దానికి రాష్ట్రంలో అనుమతి లేదని నిర్ణయించడం మారోమారు ఆయన అవకాశవాదాన్ని బట్టబయలు చేస్తోందనే వ్యాఖ్యలు వస్తుండడం గమనార్హం.
కాగా.. సీబీఐపై ఇటీవల వచ్చిన అభియోగాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలోనే దానికి ‘సమ్మతి’ ఉత్తర్వులను రద్దు చేసినట్లు ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ విషయంలో పలువురు మేధావుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నామని ఆయన వివరణ ఇచ్చారు.