చెన్నై: ప్రధానమంత్రి మోదీయే అన్నాడీఎంకేకు ‘డాడీ’ అని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మ (జయలలిత) మరణించిన తర్వాత.. తండ్రిలా మోదీ తమ పార్టీకి మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. ‘‘మోదీయే ఇప్పుడు మన డాడీ. మనం అమ్మను కోల్పోయిన తర్వాత మోదీ మనకు డాడీలా వచ్చి మద్దతిచ్చి దారి చూపుతున్నారు. మోదీ కేవలం అన్నాడీఎంకేకే కాదు.. మొత్తం జాతికే డాడీ. అందువల్ల ఈసారి బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి అన్నాడీఎంకే నాయకులు ఇలా అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ‘‘తమిళనాడు లేడీ కావాలా.. గుజరాతీ మోడీ కావాలా’’ అని గర్జించారు. నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీని విమర్శించేందుకు ఇది బాగా ఉపయోగపడింది. గుజరాత్ కంటే తమిళనాడు బాగా అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. ఆ ఎన్నికల్లో తమిళనాట 39కి గాను 37 లోక్ సభ స్థానాలను అన్నాడీఎంకే దక్కించుకుంది. ఈసారి బీజేపీ, పీఎంకే, పీటీ తదితర పార్టీలతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుంది. బీజేపీకి ఐదు స్థానాలు కేటాయించారు.