అమరావతి:వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మద్దతు తెలియజేస్తూ, చంద్రబాబు ప్రభుత్వాన్నివిమర్శిస్తూ వైసిపి అధినేత జగన్ ట్వీట్ చేయడంపై టిడిపి మహిళా నేతలు మండిపడుతున్నారు.
విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్కు సంబంధించి ప్రెస్మీట్ పెట్టకుండా రామ్ గోపాల్ వర్మను అడ్డుకోవటంపై జగన్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం విదితమే.
వర్మ సైకో డైరెక్టర్ అని టిడిపి అధికార ప్రతినిధి యామిని వ్యాఖ్యానించారు. అలాంటి సైకోకు వైఎస్ జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు. సైకో దర్శకునికి మద్దతు తెలుపుతూ జగన్ తన సైకోయిజం బయటపెట్టారని ఆమె ఎద్దేవా చేశారు.
అమరావతిలో జగన్ కట్టుకున్న ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టుకుంటే మంచిదని యామిని సూచించారు. మే 23 తర్వాత జగన్ శాశ్వతంగా రాష్ట్రానికి టూరిస్టుగా మారిపోతారని ఆమె అన్నారు. రాష్ట్రంలో మళ్లీ టిడిపినే అధికారంలోకి వస్తుందని యామిని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆమె విమర్శించారు.
‘ఓవైపు రాష్ట్రంలో నీటిఎద్దడితో అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణలో 20 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిపై మాట్లాడని జగన్ ఒక బూతు డైరక్టర్ కు మద్దతివ్వటం ఏంటి’ అంటూ టిడిపి మహిళా నేత దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు వెలికితీస్తూ, వాటికి పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంటుందనీ, జగన్ ప్రతిపక్ష నేతగా ఎలా ఉండాలో నేర్చుకోవాలనీ, మంచి మనసుతో ఆలోచించడం అలవర్చుకోవాలనీ దివ్యవాణి హితవు పలికారు.
‘దయ్యాలు లేవు, దేవుళ్లు లేవు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి నాకు చెప్పింది, అందుకే సినిమా తీస్తున్నానంటూ నువ్వు కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం!… రాష్ట్ర ప్రజలేమీ అంత అమాయకులు కాదు’ అని దివ్యవాణి అన్నారు.
లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త వీరగ్రంథం గారు ఎప్పుడో చెప్పారనీ, ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడనీ దివ్యవాణి పేర్కొన్నారు.
పక్క రాష్ట్రాల వాళ్లు కూడా ఎంతో గౌరవించే చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం కాదనీ, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కుటుంబంలో జరిగిన హత్యా రాజకీయాలపై సినిమాలు తీయాలని దివ్యవాణి సవాల్ విసిరారు.