టీడీపీని వీడి అనధికారికంగా వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ముగ్గురు సిద్ధమే అంటూ వైసీపీ వర్గాల్లో పుకార్లు వస్తున్నాయి. అంటే ఇప్పటికే 19 కి పడిపోయిన టీడీపీ బలాన్ని 16 కో, 15 కో పరిమితం చేయాలన్నది వైసీపీ వ్యూహం. అది ఎంతో దూరంలో లేదు. అయితే వైసిపిలో చేరిన వారిలో ఎంత మంది ఆ పార్టీలో ఎదగగలరు..? జగన్ నమ్మకాన్ని గెలుచుకోగలరు అనేది ముఖ్యం..!!
రాజీనామాకు ఎవరెవరు సిద్ధం..?
వైసిపిలో చేరినా ఆ పార్టీలో మొహమాటంతోనే ఉండాలి. సరైన గుర్తింపు.., జగన్ స్థాయిలో పూర్తి నమ్మకం రావాలి అంటే ఆ పార్టీ జెండాతో గెలిస్తేనే మంచిది. అప్పుడు టీడీపీకి సరిగా సమాధానం చెప్పుకోవచ్చు. వైసీపీలో పూర్తిగా కలిసిపోవచ్చు. అందుకే ఇప్పుడు చేరిన నలుగురిలో రాజీనామాకు ఎవరెవరు సిద్ధం అనేదే పెద్ద ప్రశ్న..!!
గణేష్ సవాళ్లు చేస్తున్నారు..!!
వాసుపల్లి గణేష్ నిన్న వైసీపీ కి జై కొట్టారు. ఆయన ఎందుకు జై కొట్టారో, టీడీపీని వీడి ఎందుకు అధికార పార్టీలో చేరారో అందరికి తెలియకపోవచ్చు. ఆయన వ్యాపార సామ్రాజ్యాలు, ఆర్ధిక కోతలు కాపాడుకునే క్రమంలో తప్పలేదు. అయితే ఆయన పూర్తిగా వైసీపీ వాదిగా మారిపోయే ప్రయత్నాలు ఆరంభించారు. అందుకే సవాళ్లు చేస్తున్నారు. రాజీనామా చేస్తా, మళ్ళీ వైసీపీ జెండాతో గెలుస్తా.., టీడీపీ కి భవిష్యత్తు లేదు అంటూ స్పీచ్ లు దంచేస్తున్నారు. విశాఖ రాజధానిగా ప్రకటించిన నేపథ్యం, అధికార అండ, ఆర్ధిక అండ చూసుకుని.., గెలుపుపై నమ్మకంతో ఆయన ఉప ఎన్నికకు సై అంటున్నారు.
గన్నవరం వంశీ సిద్ధమే కానీ..!!
ఇక గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ కూడా పూర్తి వైసీపీ వాదిగా మారే క్రమంలో టీడీపీని ఆడేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు తన రాజీనామా విషయమై ప్రకటించారు. తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమే అంటూ చెప్పుకొస్తున్నారు. వైసీపీ జెండాతో గెలిచి పూర్తిగా ఆధిపత్యం చాటాలనేది ఆయన వ్యూహం. కానీ ఆయనకు అక్కడ అంత అనుకూల పరిస్థితులు లేవు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు వర్గం, 2019 లో వైసీపీ తరపున పోటీ చేసి ఒడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వర్గం ఇప్పటికే వంశీపై కత్తులు నూరుతున్నారు. ఈ వర్గాలు సహకారం లేకుండా వైసీపీ గుర్తుతో పోటీ చేసి గెలవడం వంశీకి అసాధ్యమే.
బలరాం ఆ మాట తప్ప..!!
చీరాల కరణం బలరాం మాత్రం రాజీనామా, రాజకీయ అంశాల జోలికి వెళ్లడం లేదు. చీరాల అభివృద్ధి కోసమే వచ్చాను అంటూ ఆయన కుమారుడు వెంకటేష్ చెప్పుకొస్తున్నారు. ఎక్కడా టీడీపీని, చంద్రబాబుని విమర్శించడం లేదు. వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ తరహాలో సవాళ్లు చేయడం లేదు, టీడీపీకి తొడ కొట్టడం లేదు. అసలు రాజీనామా అనే ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఒకవేళ ఈయన రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాలి అని ఆలోచన వచ్చినా అక్కడ బలంగా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ పోటీలో ఉంటారు. అసలే సొంత నియోజకవర్గం కాదు, సొంత వర్గం అంటూ లేదు. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు, ఈ క్రమంలో రాజీనామా, ఉప ఎన్నికలు అంటే పూర్తిగా రిస్క్ అని కరణం అసలు ఆ అంశాలనే ప్రస్తావించడం లేదు. టీడీపీ పట్ల సేఫ్ గేమ్ లో ఉన్నారు.
మద్దాల గిరి సైలెంట్ గానే..!!
ఇక మరో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్. గుంటూరు పశ్చిమ నుండి గెలిచారు. నిజానికి టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో ఈయన గెలుపే అనూహ్యం. వైసీపీ అభ్యర్థి వేణుగోపాలరెడ్డి పై ఉన్న అసమ్మతి, అసంతృప్తి కారణంగానూ.., గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హవా కారణంగానూ గిరి గెలిచారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే పూర్తిగా వెనకడుగు వేసేది గిరి. ఆయన పూర్తిగా సేఫ్ గేమ్ లో ఉన్నారు. రాజీనామా, ఉప ఎన్నిక అనే మాటలకు దూరంగా ఉంటున్నారు. దొరికిందే అవకాశం అన్నట్టుగా నెమ్మది రాజకీయం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే మాత్రం వేణుగోపాల రెడ్డి నుండి పూర్తిగా తిరుగుబాటు వచ్చి, ఉత్కంఠ ఖాయం.