సముద్రాల్లో ఏర్పడే ఉపరితల ఆవర్తనం వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫానుగా మారతాయి. తీరాల్ని తాకి అల్లకల్లోలం సృష్టిస్తాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి. కానీ.. ఇవేమీ లేనప్పుడు ఒక మహా ఉత్పాతం.. ప్రళయమై వచ్చింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచి పెట్టేసింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయిన ఆ విధ్వంసమే.. ‘దివిసీమ ఉప్పెన’. 1977 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన ఆ రాకాసి తుఫాను చేసిన భీభత్సం ఇప్పటికీ ఆ ప్రాంతవాసులను కలవరపెడుతూనే ఉంది. నేటితో ఆ మహా ప్రళయానికి 43 ఏళ్లు పూర్తయ్యాయి.
ఆరోజు కాళరాత్రే అయింది..
నవంబర్ నెల, టెక్నాలజీ లేని రోజులు కావడంతో ఎటువంటి తుఫాను సంకేతాలు లేవు. కానీ.. 1977 నవంబర్ 18న సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది. మేఘాలు నల్లగా తీరం దాటి ఊళ్లలో పైకప్పులా పది మీటర్ల ఎత్తులో పరుచుకుంది. భారీ వర్షం పడుతుందని భావించారే కానీ.. ఆ రాత్రి ఓ ప్రళయ రాత్రి కాబోతోందని దివి ప్రజలు ఊహించలేదు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒక్కసారిగా తీరం దాటిన ప్రళయ తుఫాను గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రాకాసి అలలు ఊళ్లను ముంచేసాయి. హోరు గాలికి, రాకాసి అలలకు ప్రజలు బలైపోయారు.
చెట్టుకొకరు.. పుట్టకొకరు..
అధికారిక అంచనానే 10వేలకు పైగా మృతులు. ఇల్లూ, పిల్లా, కుటుంబాలు, పశువులు.. నామరూపాలు లేకుండా పోయాయి. గుట్టలుగా తేలిన శవాలు.. తమ వారెవరో గుర్తుపట్టలేని బంధువులు.. కళేబరాలై తేలిన పశువులు, స్మశానాలుగా మారిన ఊళ్లు, వేళ్లతో సహా పెకిలించబడ్డ చెట్లు.. ఇలా దివిసీమ పెను ప్రళయానికి సాక్ష్యాలుగా నిలిచాయి. పాచిపోయి, కుళ్లిపోయిన మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు జరిగాయి. ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వపరంగా ఆదుకున్నారు. మదర్ థెరిసా కూడా వచ్చి సహాయం చేశారు. మిషనరీలు, గాంధీ పీస్ ఫౌండేషన్, ఆర్ఎస్సెస్ వంటి సంస్థలు ప్రజలకు సాయం అందించాయి. ఎంత సాయం అందించినా కోలుకోలేని విలయం అది. అందుకే ఇప్పటికీ ‘దివిసీమ ఉప్పెన’ అనే పదం.. అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది.