చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన చీరాల టూటౌన్ సబిన్స్పెక్టర్ విజయకుమార్ పై ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లను కూడ జోడిస్తూ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు బుధవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.జులై 18వ తేదీన మాస్కు పెట్టుకో లేదన్న కారణాన్ని చూపి కొత్తపేట జంక్షన్ వద్ద ఎస్సై విజయ్ కుమార్ తీవ్రంగా కొట్టడంతో కిరణ్ మరణించడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో ఎస్సై విజయకుమార్ పై కేవలం ఐపీసీ 324 సెక్షన్ కింద మాత్రమే కేసు కట్టారు. అయితే మరణించింది ఎస్సీ యువకుడు కావడంతో ఎస్సై పై ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కూడా కేసు పెట్టాలంటూ మృతుడి తండ్రి మోహన రావు పోలీసు ఉన్నతాధికారులను లిఖితపూర్వకంగా కోరారు.
దీనిపై ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ బాలసుందరరావు సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎస్సై విజయ్ కుమార్ పై ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా పెట్టాలంటూ సిఫార్సు చేయడంతో చీరాల టూటౌన్ సిఐ ఇన్చార్జి సీఐ స్రవంతి రాయ్ ఈ మేరకు సదరు సెక్షన్లు సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో తప్పటడుగులు వేసిన ఈ కేసు విచారణ ఇప్పుడు సరైన దారిలో పడింది. తమకు న్యాయం జరుగుతుందనే ఆశ ఇప్పుడిప్పుడే కలుగుతోందని కిరణ్ కుమార్ తండ్రి మోహనరావు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని పోలీసు శాఖ కూడా సంతృప్తి కరమైన రీతిలోనే దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు.ఇందుకు గాను ఎస్పీ సిద్ధార్థ కౌశలు కి కృతజ్ఞతలు చెప్పారు.