ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో “సాగర తీర స్వచ్ఛత” కార్యక్రమంలో పాల్గొన్న జగన్… రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ లపై నిషేధం విధించడం జరిగింది. ఇదే సమయంలో సాగర తీరంలో “మెగా క్లీన్ అప్ డ్రైవ్” కార్యక్రమం పేరిట గోకుల్ బీచ్ నుండి భీమ్లీ బీచ్ వరకు ప్లాస్టిక్ తొలగించే కార్యక్రమంలో దాదాపు 22 వేల మంది పాల్గొని బీచ్ నుండి 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. మొత్తం, బీచ్ ఇసుకలో డంప్ చేయబడిన 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించబడ్డాయి” అని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో ఈ రకమైన క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించబడలేదు. అమెరికా దేశానికి చెందిన పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థకు చెందిన సిరిల్, గ్లోబల్ అలయన్స్ సహకారంతో.. ప్లాస్టిక్ వర్గాల నుంచి వివిధ రకాల వస్తువులను తయారు చేయబోతున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ వర్గాల నుంచి తయారుచేసిన కొన్ని వస్తువులను మరియు షూస్.. సన్ గ్లాసెస్ వేసుకుని మరీ చూపించారు. ఈ సంస్థ ద్వారా 20వేల మందికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు రానున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రం రూపొందాలని అందుకు ప్రజలంతా సహకరించాలని సీఎం జగన్ కోరారు. ఇక ఇదే సమయంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ లకి బదులు క్లాత్ తో తయారు చేసిన వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం విషయంలో ఎప్పటికీ తిరుమలలో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ కార్యక్రమంలో సీఎం జగన్ స్పష్టం చేశారు.