బీసీ నాయకుడు సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ బీసీ నేత, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య పై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఈశ్వరయ్య పై ప్రసారం చేస్తున్న కథనాలను ఖండించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి శంకర్ నారాయణ ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు కల్పించి కథనాలు ప్రసారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్ నడుస్తుందని, బీసీ నేతల పై కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజ మెత్తారు. చంద్రబాబు బీసీల పట్ల ఎప్పటినుండో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, బీసీలు హైకోర్టు జడ్జీలుగా కాకుండా అప్పట్లో అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.
ఎన్నికలలో టిడిపికి బీసీలు ఓట్లు వేయలేదు అని ప్రస్తుతం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పరిపాలనలో బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాల కంటే జగన్ హయాంలో బీసీలు సంక్షేమ పథకాల వల్ల భారీగా లబ్ధి పొందుతున్నట్లు శంకర్ నారాయణ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమని స్పష్టం చేశారు.