Acharya CM Jagan: జగన్ వయసు 50 ఏళ్ళు.. జగన్ రాజకీయ అనుభవం గట్టిగా 15 ఏళ్ళు.. సీఎంగా మూడేళ్లు.. ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు..! ఇన్నాళ్లలో ఎప్పుడైనా జగన్ ఒక సినీ వేదికపై కనిపించారా..!? ఇన్నేళ్ళలో ఏనాడైనా జగన్ ఒక సినీ వేడుకలో పాల్గొన్నారా..!? కానీ ఆ అరుదైన వేదిక సాకారం కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపుదిద్దుకున్న “ఆచార్య” సినిమా ముందస్తు విడుదల (ప్రీ రిలీజ్) వేడుకకు సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్టు సమాచారం.. అదే జరిగితే అదొక వండర్.. అదొక చారిత్రిక ఘట్టమే..! ఇంతకు జగన్ ఈ చారిత్రక ఘట్టానికి ఎందుకు సిద్ధమవుతున్నారు..!? ఈ వండర్ కి ఎందుకు శ్రీకారం చుట్టారో తెలియాలంటే మాత్రం కాస్త లోతుగా ఆలోచించాలి.. ఇది పక్కాగా సీఎం జగన్ వేసిన పొలిటికల్ “స్కెచ్”!
Acharya CM Jagan: “పొత్తు” ఎత్తుకు పై ఎత్తు..!!
టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయన్నది దాదాపు ఖరారైన అంశమే. పవన్ కళ్యాణ్ వైసీపీకి బద్ధ శత్రువు.. వేదిక ఎక్కినా.. మైక్ దొరికినా వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు. సో.. టీడీపీ కూడా జనసేనపై ఆశలు పెట్టుకుంది, జనసేన కూడా టీడీపీతో అడుగులకు సిద్ధమవుతోంది.. సో.., ఈ పొత్తు పూస్తే రాష్ట్రంలో కొన్ని రాజకీయ సమీకరణాలు మారతాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో కచ్చితమైన మార్పు కనిపిస్తుంది. సామజిక పరంగా కూడా కాపు వర్గాలు ఆ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాపు వర్గాలు.. పవన్ కి పూర్తిగా మద్దతుగా నిలవలేవు.. అలా అని చంద్రబాబుని నమ్మలేవు.. అందుకే ఈ ఇద్దరూ కలిస్తే మాత్రం ఒక నమ్మకంతో కాపు వర్గాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.. అంటే ఈ పొత్తుతో జగన్ కి కాపు వర్గాలు కొంత మేరకు దూరమవ్వడం ఖాయం.. ఆ నాలుగు జిల్లాల్లో చాల మేరకు ఓట్లు నష్టపోవడం ఖాయమే..! కొన్ని సీట్లపై జగన్ ఆశలు వదులుకోవాలి. అందుకే.. దానికి ఒక పరిష్కారమే ఈ “చిరంజీవి మచ్చిక సూత్రం”..!
చిరుతో సావాసం.. రాజకీయ అవకాశం..!
చిరంజీవి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీల్లో చురుగ్గా లేరు.. కాంగ్రెస్ నుండి అధికారికంగా బయటకు రానప్పటికీ.., ఒక రకంగా చిరు ప్రస్తుతం న్యూట్రల్ వర్గానికి చెందిన వారు. ఆయనకు ఆ జిల్లాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటూ కాపు సామాజికవర్గ మద్దతు కూడా బలంగానే ఉంది. న్యూట్రల్ గా ఉన్న చిరుని మచ్చిక చేసుకుంటే.. ఆయన ఫాలోయింగ్, కాపు వర్గాల్లో కొంత మేరకు వైసీపీకి దగ్గరవ్వచ్చేమోననేది సీఎం జగన్ ఆలోచన. “పవన్ కళ్యాణ్ కి కాపు వర్గాలను దూరం చేసి.. చిరు ద్వారా ఆ వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నంలో సీఎం జగన్ ఉన్నారనేది అంతర్గత అంశం. మరోవైపు చిరంజీవి కూడా ఎటువంటి లాభాపేక్ష, రాజకీయ దురద లేకుండా సైలెంట్ గా తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. తనకు ఇప్పుడు తన సినిమా బతకడమే ముఖ్యం.. తన సినీ రంగం మూడు కాలాల పాటూ ఉండడమే ముఖ్యం.. అందుకే ఎన్ని మెట్లయినా దిగి, రాజకీయంతో సంబంధం లేకుండా జగన్ దగ్గరకు వస్తూ, పోతూ చక్కని బాటలు వేశారు..!
ఈ నేపథ్యంలో “చిరు, జగన్”ల స్నేహం లక్ష్యం ఒక్కటే. నీ సినీ రంగం నేను చూసుకుంటా.. నీ పెద్దరికం నిలబెడతా.. నీకు అండగా ఉంటా.. – నీ రాజకీయ బలం నేను వాడుకుంటా.., నీ సామజిక బలం నాకు అనుకూలంగా మార్చుకుంటా” ఇదే అంతర్గత అంశం, ఆలోచనతో సీఎం జగన్ కూడా కొన్ని మెట్లు దిగుతున్నారు.. నిజానికి జగన్ బాలకృష్ణ అభిమాని. కానీ రాజకీయాల్లోకి వచ్చాక అభిమానాలు చెల్లవు. కేవలం రాజకేయమే చూడాలి. ఓట్ల లాభనష్టాలే లెక్క వేయాలి.. సో జగన్ అదే చేస్తున్నారు. ఆచార్య వేడుకకు హాజరవ్వడం ద్వారా ఓ రాజకీయ ప్రయత్నం అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు..!