Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేదికపై రేవంత్ రెడ్డి కేసిఆర్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు సభక హజరు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర కు కోపం తెప్పించాయి.
రేవంత్ ఆరోపణలను ఆయన ఖండించారు. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ సభ కోసం జిల్లా పోలీసులు మూడు రోజులుగా బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహకరించారని అన్నారు. అనుమతికి మించి కార్యకర్తలు తరలివచ్చినా ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా పోలీసులపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇన్ చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను సభా వేదికకు దూరంగా నిలుపుదల చేయడంతో వేలాది మంది సభ వేదిక వద్దకు నడుచుకుంటూ వచ్చారు. కార్యకర్తలు నడుచుకుంటూ వస్తున్న వీడియోను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.