సిఎం జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో చాలా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వైసిపి నిర్ణయాల పట్ల, ప్రభుత్వ నిర్ణయాల పట్ల కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం తెలిసిందే. అనేక కీలక విషయాల్లో ప్రభుత్వం దెబ్బతిన్నది. ఒక రకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నైతిక స్థైర్యం కూడా కోల్పోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం తరపున కాచ్చు. ప్రతిపక్ష మీడియా తరపున కావచ్చు, కొంత మంది కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మరో పిటిషన్ సిద్ధం అయ్యింది. అన్ని రకాలుగా సమాచార హక్కు చట్టం ద్వారా తీసుుకున్న ఆధారాలతో కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కూడా హైకోర్టు వ్యతిరేకంగా స్పందిస్తే ప్రభుత్వం మరింత ఇరుకున పడటం ఖాయమేనంటున్నారు. ఆ వివరాలలోకి వెళితే..
ప్రకటనలు ఎలా ఇచ్చారంటే..
2019 మే 23వ తేదీ నుండి మార్చి 2020 వరకూ సమాచార శాఖ ఇచ్చిన ప్రకటనల ఖర్చు రూ.17.5 కోట్లు కాగా ఇందులో సింహభాగం అంటే 6.5 కోట్లు విలువైన ప్రకటనలు సాక్షికి ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించి క్లాసిఫైడ్ ప్రకటనలు మే 2019 నుండి మార్చి 2020 వరకూ 82.11 కోట్లు వరకూ ఇవ్వగా అందులోనూ సాక్షికి రూ.34.92 కోట్లు సాక్షి పత్రికకు ఇచ్చారు. సర్క్యులేషన్ పెద్దగా లేని మరి కొ్న్ని పత్రికలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. సమాచార శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్, మే నెలల్లో రూ.13.56 కోట్లు ప్రకటన కోసం ఖర్చు చేయగా అందులో ఎక్కువ భాగం అంటే 6.27 కోట్లు సాక్షి పత్రికకు ఇచ్చారు. మిగతా ప్రభుత్వ శాఖలు ఈ రెండు నెలల్లో రూ.13.43 కోట్లు విలువైన ప్రకటనలు ఇవ్వగా ఇందులో 4.77 కోట్లు విలువైన ప్రకటనలు సాక్షి దినపత్రికకు ఇచ్చారు. ఆడిట్ బ్యూరో ఆప్ సెర్క్యూలేషన్ ప్రకారం జనవరి 2019 నుండి డిసెంబర్ 2019వరకూ సర్క్యులేషన్ లో మొదటి స్థానం ఈనాడు, రెండవ స్థానంలో సాక్షి, మూడవ స్థానంలో ఆంధ్రజ్యోతి దిన పత్రికలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2019 మే 23 నుంచి 2020 మే 30వ తేదీ వరకు ప్రకటనల కోసం రూ.100.80 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో సర్క్యూలేషన్ లో మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి కేవలం 25 లక్షల రూపాయల ప్రకటనలు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం సాక్షి దిన పత్రికకు 52.03 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారు.
జగతి పబ్లికేషన్ సంస్థ నిర్వహిస్తున్న సాక్షి దినపత్రిక, సాక్షి టివిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత సంస్థ అనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పై వివరాలతో విజయవాడకు చెందిన కిలారు నాగ శ్రావణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల పేరిట భారీ స్థాయిలో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందని, ప్రకటనల జారీలో పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని పిటీషన్ లో పేర్కొన్నారు. సాక్షికి ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా సిఎం బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.