భారత్ – చైనా దేశాల మధ్య గత కొద్ది రోజులుగా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది నిపుణులు చైనా బలగాలు భారత భూభాగం లోకి వచ్చాయని అంటుండగా… భారత ప్రభుత్వం మాత్రం చైనా బలగాలు మన దేశ భూభాగం లోకి అడుగు పెట్టలేదని వాదిస్తున్నది. సరిహద్దు దగ్గర టిబెట్, అక్సాయ్ చిన్ పర్వతాల దగ్గర పెద్ద ఎత్తున చైనా బలగాలు మోహరించి ఉన్నాయని ఉప గ్రహ చిత్రాల ద్వారా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మరో సారి దీనిపై స్పందించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చైనా బలగాలు భారత భూభాగం లోకి ప్రవేశించాయని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు రాహుల్ గాంధీ. తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతిన్నా తానేమీ బెదరను కానీ భారత భూభాగం గురించి నిజం మాత్రమే తాను చెప్తున్నానన్నారు. చైనా బలగాలు మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయంటే తన రక్తం మరుగుతోందని అన్నారు. ఇప్పటికే తాను ఉపగ్రహం ద్వారా తీసిన ఫోటోలను పరిశీలించాననీ, ఆర్మీ మాజీ అధికారులతోనూ భారత్ – చైనా ఘర్షణపై చర్చించాననీ చెప్పారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని తెలిసి కూడా దేశ ప్రజలను తమ అబద్ధాల తో మభ్య పెట్టే వారికి దేశంపై భక్తి లేదని రాహుల్ బీజేపీ నేతలను విమర్శించారు.
దేశంలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, చరిత్ర గురించి రెండు వారాలుగా రాహుల్ గాంధీ వరస వీడియోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు చైనా సరిహద్దు వివాదం గురించి ఓ వీడియోను పోస్ట్ చేశారు.