రీసెంట్ గా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని తమ వైపుకు తిప్పుకున్నాయి. తేజశ్వీ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ – కాంగ్రెస్ – లెఫ్ట్ కలసి మహాఘట్ బంధన్ (ఎమ్ జీబీ) గా, అధికారంలో ఉన్న నితిశ్ ఆధ్వర్యంలో జేడీయూ – బీజేపీ కూటములు కలిసి పోటీపడ్డాయి. ఎన్నో సర్వేలు, ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 10న 243 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. జేడీయూ – బీజేపీ కూటమి విజయం సాధించింది. మళ్లీ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే.. ఈ ఎన్నికల ఫలితాల్లో అందరినీ ఆకర్షించిన పార్టీ.. ‘ఎంఐఎం’. హైదరాబాద్ కు చెందిన అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలోని ఈ పార్టీ బీహార్ లో 5 స్థానాలు గెలుచుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
బీజేపీ-ఎంఐఎం కలిసే ఇలా చేశారా..?
‘ఇన్నాళ్లూ మమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి బీహార్ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం. మా సత్తా చాటుకున్నాం. ఇప్పటినుంచి ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూడా పోటీ చేస్తాం. మా తడాఖా ఏంటో చూపిస్తాం’ అని గెలుపు తర్వాత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇదే ఉత్సాహంతో త్వరలో బెంగాల్ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. కానీ.. ఎంఐఎం తమ బలం నిరూపించుకునే క్రమంలో చేస్తున్న తప్పును తెలుసుకోలేక పోయింది. బీజేపీని శత్రువుగా భావించే ఎంఐఎం.. కావాలనే ఇలా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందనే అనుమానాలూ లేకపోలేదు. ఇది వీరిద్దరూ కలిసి ఆడిన పొలిటికల్ డ్రామా అనే మాట నిజమైతే ఆ పార్టీని ముస్లింలు నమ్మే పరిస్థితులు కూడా ఉండవు. బీజేపీ అంటే పడని ఎంఐఎం.. మహాఘట్ బంధన్ కూటమిలో కలవకుండా సొంతంగా పోటీ చేసింది. దీంతో ఆర్జేడీ.. కూటమికి పడాల్సిన ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడిపోయి ఓట్లు చీలిపోయాయి. దీంతో బీజేపీ–జేడీయూకు ఓట్లు ఎక్కువ తేలాయి. దీంతో నితీశ్ విజయానికి ఎంఐఎం కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఓవైసీ రాజకీయ జీవితంలోనే ఒక మచ్చ..
బీహార్ ఎన్నికల్లో ఓవైసీ వ్యవహరించిన తీరు ఆయన రాజకీయ జీవితానికే మచ్చ తెచ్చింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత దేశంలోని ముస్లింల్లో బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి రాష్ట్ర ఎన్నిక కావడంతో బీజేపీ అక్కడ అధికారంలోకి రానివ్వకూడదని ముస్లింలు కంకణం కట్టుకున్నారు. కానీ.. ఎంఐఎం రూపంలో బీజేపీకి లబ్ది జరగుతుందని వారు ఊహించలేదు. గతంలో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ( 2015లో ఈ అవార్డును వెనక్కు ఇచ్చేశారు ) మున్నావర్ రాణా.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల్లో విభజన తెచ్చేందుకే ఓవైసీ ప్రయత్నిస్తున్నారని.. మరో జిన్నాగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వంటి వ్యక్తులు ముస్లింలను విభజిస్తూ, రాజకీయాలకు వాడుకుంటూ, బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతున్నట్టు అర్ధమవుతోంది. నేను బ్రతికుండగా ఇటువంటి వాటిని జరగనివ్వను అని కూడా అన్నారు. పశ్చిమ బెంగాల్లో దీనిని కొనసాగనివ్వను అని అన్నారు.
ముస్లింల్లో వ్యతిరేకత వస్తుందా..
గెలుపుపై మీమాంశలో ఉన్న నితీశ్–మోదీ మళ్లీ బీహార్ పీఠం చేజిక్కించుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ చేసిన పని దేశవ్యాప్తంగా ముస్లింలో ఆగ్రహం తెప్పిస్తోంది. ‘5 సీట్లు గెలిచామని సంబరపడుతున్నారు గానీ.. బీజేపీ కూటమిని మళ్లీ గద్దెనెక్కడానికి మీరే కారణమనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది మీకు వ్యక్తిగత విజయమే తప్ప ముస్లింల ఐక్యతా బలం కాదు. మహాఘట్ బంధన్ తో కలిసుంటే.. బీజేపీ ఖచ్చితంగా అధికారానికి దూరమయ్యేది. దీంతో మీరు బీజేపీ వ్యతిరేకి కాదు.. మోదీ మద్దతుదారుడు అని అర్ధమైంది’ అని చురకలు వేస్తున్నారు. ‘బెంగాల్ కూడా కావాలి.. రండి ఓవైసీజీ..’ అని బీజేపీ అంటున్న కార్టూన్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.