ఉత్తరప్రదేశ్ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఈ రోజు ఆ ఇద్దరూ లక్నోలో ప్రకటించారు.
ఇది అకస్మాత్తు పరిణామం కాకపోయినా కాంగ్రెస్కు శరాఘాతం కిందే లెఖ్క. జాతీయస్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ పరిణామానికి ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ప్రస్తుతానికి కాంగ్రెస్ దీనిని తేలిగ్గా తీసుకుంటునట్లు కనబడేందుకు ప్రయత్నిస్తున్నది.
ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లకు గాను చెరి 38 సీట్లలో పోటీ చేయనున్నట్లు వారిద్దరూ ప్రకటించారు. మిగిలిన రెండు సీట్లు రాయ్బరేలీ, అమేధీ కాంగ్రెస్కు వదిలిపెడుతున్నారు. రాయ్బరేలీకి సోనియా గాంధీ, అమేధీకి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శుక్రవారం నాటి మీడియా సమావేశంలో అఖిలేష్ కాంగ్రెస్పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు కానీ, మాయావతి చాలా పరుషంగా మాట్లాడారు. కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు వల్ల ప్రయోజనం ఉండదనీ, కాంగ్రెస్ వోట్లు రెండవ పార్టీకి బదిలీ కావనీ ఆమె వ్యాఖ్యానించారు. ఆమె అంతటితో ఆగలేదు. బిజెపి, కాంగ్రెస్ రెండూ రక్షణ ఒప్పందాలలో అవినీతికి పాల్పడిన పార్టీలేనని అన్నారు. ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీని కూడా ఆమె ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్లో ప్రతపక్ష ఐక్యత లేకుండా దేశవ్యాప్త ఐక్యత సాధ్యం కాదు. 2017 శాసనసభ ఎన్నికలలో బిఎస్పి, ఎస్పి, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అయినా బిజెపిని నిలువరించలేక పోయాయి. తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు కుదరక పోవడంతో మాయావతి మనసు మార్చుకున్నారు. 2019 ఎన్నికలలో ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివస్తే ప్రధానమంత్రి కాగల అర్హత తనకు ఉందని మాయావతి భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఆ ఆలోచన ఉంది. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి ప్రతిపక్ష ఐక్యసంఘటన నిర్మించడానికి ఇవి కొంత అడ్డంకి. కాంగ్రెస్తో కలసి పోటీ చేయడమంటే రాహుల్ గాందీ అభ్యర్ధిత్వాన్ని ఒప్పుకోవడం అవుతుందని వారు భావిస్తున్నారు. ఈ అవరోధాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.