అమరావతి, జనవరి 7: ప్రముఖ హస్యనటుడు ఆలీ ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘హోదా ఇచ్చి గౌరవించే పార్టీలో చేరతాను’ అలీ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. . ‘ఏ పార్టీకి అయినా ఒక కండిషన్ పెడతా, దానికి ఒకే అంటేనే వెళతాను’ అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవిపై స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీలో చేరే అవకాశం ఉందని ఆలీ వెల్లడించారు.
ఆలీ వైసిపిలో చేరబోతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఒక పక్క పవన్ కల్యాణ్ను, మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
1999లో తెలుగుదేశం పార్టీలో ఆలీ చేరినా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. రానున్న ఎన్నికల్లో గుంటూరు నుండి ఏదో ఒక రాజకీయ పార్టీ తరపున పోటీ చేయాలని ఆలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తామని తెలుగుదేశం పార్టీలో చెప్పినా, గుంటూరు సీటు ఇవ్వడం సాధ్యపడకపోవడం వల్ల తాను పోటీ చేయలేదని అలీ అన్నారు.
వైసిపిలో ముఖ్య నేతల నుండి ఇంత వరకూ ఎటువంటి ఆహ్వనం రాలేదని ఆలీ పేర్కొన్నారు. జనసేన, టిడిపి, వైసిపీలలో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారన్న విషయంపై ఆలీ స్పష్టత ఇవ్వకుండా త్వరలో ఆయా పార్టీల నేతలను కలిసి తన షరతులు తెలియజేస్తానన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబులను నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేయడానికే వెళ్లినట్లు ఆలీ చెప్పారు.