మూడు రాజధానుల అంశం ఇప్పటికీ ఏపీలో రగులుతూనే ఉంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని భూములిచ్చిన 29 గ్రామాల రైతులు పోరాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై పట్టుదలగా ఉంది. రైతులు ఏకంగా 321 రోజులుగా అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ పోరాటం చేస్తున్నారు. కరోనా తీవ్రతలోనూ వారు తమ ఉద్యమానికి సడలింపు ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వం విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. అయితే.. రీసెంట్ గా దళిత రైతులను అరెస్టు చేయడంతో రైతులు చలో గుంటూరుకు పిలుపునిచ్చారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అందరి చూపూ హైకోర్టుపైనే..
రాజధాని తరలింపుపై హైకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాజధాని తరలింపుపై దాఖలైన పలు పిటిషన్లపై ఈరోజు నుంచి తుది విచారణ ప్రారంభం కానుంది. రాజధాని అంశంపై త్రిసభ్య ధర్మాసనం దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై గతంలో పేర్కొన్న విధంగా రోజువారీ విచారణ చేపట్టనుంది. ఈ విచారణను హైబ్రిడ్ పద్ధతిలో కొనసాగించనుంది. ఈ రోజువారీ విచారణ దాదాపు రెండు వారాలపాటు జరిపే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకూ దాఖలైన అనుబంధ పిటిషన్లలో అత్యధిక శాతం విచారణను ఇప్పటికే పూర్తైంది. మరోవైపు.. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రణాళిక ప్రకారం అనుమతి ఇవ్వాలని గత విచారణలో ప్రభుత్వం కోరింది. గతంలో దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వీటన్నింపినే ఇప్పుడు రోజువారీ విచారణ జరుగనుంది.
రాజధానా.. రాజకీయమా..?
రాజధాని విషయం కాస్తా రాజకీయ రగడగా మారింది. టీడీపీ అమరావతి అంటుంటే.. వైసీపీ మూడు రాజధానులంటోంది. తటస్థులు మాత్రం ఏమీ చెప్పలేకున్నారు. దీంతో ఏపీ రాజధాని ఏదంటే కోర్టులే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. కోర్టులు మాత్రం ఈ విషయంపై ఎటూ తేల్చడం లేదు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సగటు వ్యక్తికి ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. మన రాష్ట్ర రాజధాని ఇదీ.. అని విద్యార్ధులకే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది విచారించదగ్గ విషయం. మరి.. కోర్టు ఏం తీర్పు ఇస్తుందో.. దానిపై వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాల్సిందే.. ఏ నగరం రాజధాని అవుతుందో చూడాల్సిందే.