అమరావతి, జనవరి 20: ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అమరావతిలో కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమైయ్యారు,
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి ఆలీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ వెల్లడించారు. సీటుతో పాటు హోదా (మంత్రి పదవి) హామీ ఇచ్చిన పార్టీలో చేరతానని కూడా పేర్కొన్నాడు.
ఇటీవల ఒకే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, సీఎం చంద్రబాబును ఆలీ కలిశారు. నూతన సంవత్సరం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపేందుకే వారిని కలిశానని ఆ తరువాత ఒక సందర్బంలో వెల్లడించారు.
ఆలీ ఆదివారం చంద్రబాబుతో సుమారు 15 నిమిషాల సమావేశమై చర్చించారు. సీటుపై హామీ లభించిందా లేదా అన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.
గతంలో ఆలీ వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయాలను ఆయన ఖండించనూ లేదు. వైసిపి ముఖ్యుల నుండి తనకు పార్టీలో చేరమని ఆహ్వానం అందలేదు అని మాత్రం ఆలీ ఒక సందర్భంలో చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆలీ చంద్రబాబును మరోసారి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అలీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ తనకు గురువు, ఆత్మీయుడు అని కూడా పలు సందర్భాల్లో చెప్పారు.
ఈ నేపద్యంలో అలీ దారెటు అని రాజకీయవర్గాలు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు.