మూడు రాజధానుల బిల్లు ఆమోదం రాష్ట్రంలో రాజకీయ అడుగులను అత్యంత వేగంగా శాసిస్తుంది. రాష్టం మొత్తం మీద ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. రాజధానుల వికేంద్రీకరణ రాష్ట్రానికి లాభమా, నష్టమా అనే చర్చ కాకుండా… జగన్ కి లాభమా, నష్టమా…?? టీడీపీకి లాభమా, నష్టమా..? అనే చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయంపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం ప్రజా ప్రతినిధులకు ఏమి అంతుపట్టడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అనేక ఆలోచనల్లో పడ్డారు. ఒక రకంగా సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు.
వైసీపీలో అంతర్మధనం మొదలు…!
రాజధాని అనేది ఈ రెండు జిల్లాల్లో సెంటిమెంట్ వ్యవహారంగా మారింది. జగన్ కి అధికారం దక్కడంతో ఈ రెండు జిల్లాల ఓటర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకుని, గత ఏడాది ఎన్నికల్లో ఓట్లేశారు. రెండు జిల్లాల్లో కలిపి వైసిపికి 29 మంది శాసనసభ్యులను అందించారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మార్పు ఉంటుందని, వికేంద్రీకరణ ఉంటుందని అసలు ఊహించలేదు.
కానీ అది జరిగిపోవడంతో వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో కొంత వ్యతిరేకత తప్పదు. ఇదే విషయంపై ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలయింది. రాజధాని మార్పు ఉండదు అని కచ్చితంగా చెప్పిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వసంత కృష్ణప్రసాద్ సహా…, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే వీళ్ళందరూ జగన్ కి అత్యంత సన్నిహితులే, నమ్మిన బంటులే… ఈరోజు సాయంత్రం లేదా, రేపు విజయవాడలోని ఓ హోటల్ లో ఈ కీలక నాయకులు అందరూ సమావేశమవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ వేదికగా తమ నిర్ణయాలు వెల్లడించనున్నారు.
టీడీపీ రాజీనామాలకు సిద్ధమే…!
ఈ రెండు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. తాము రాజీనామా చేసి, వైసీపీపై ఒత్తిడి తీసుకు రావచ్చేది వీరి వ్యూహం. రాజధాని సెంటిమెంట్ తో రాజీనామా చేసినా.., ఎలాగూ గెలుస్తారనే ధీమా ఉండడంతో అందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు తప్ప కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా విషయంలో పూర్తిగా సిద్ధంగా ఉన్నారట. అలా చేస్తేనే వైసిపిపైకి ఒత్తిడి పెరుగుతుందని, వాళ్ళనూ రాజీనామా చేయిస్తే.. ఒత్తిడి తెచ్చినా నైతికంగా గెలిచినట్టేనని చంద్రబాబు యోచనగా కనిపిస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?