(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు అమరావతి జెఏసి నేతలు కోరారు. జెఏసి ఏ కులానికి అనుకూలం కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజధానుల విషయంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. మరో జెఏసి సభ్యుడు తిరుపతిరావు మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడుకల వేదిక మార్పు ప్రభుత్వ తొందరపాటు నిర్ణయానికి నిదర్శమనీ, దీని వల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం, అధికారుల సమయం వృధా అయ్యిందనీ అన్నారు. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రాజధానిని మార్చవద్దని హితవు పలికారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నెల రోజులుగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. శాసనమండలి గ్యాలరీలోకి ఎంపిలు వచ్చి సభ్యులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ వరకూ వచ్చిన మహిళలు అసెంబ్లీ గోడలను బద్దలు కొట్టుకుని లోపలికి రావడం పెద్ద కష్టతరం కాదని ఆయన హెచ్చరించారు.