నవ్యాంధ్ర రాజధాని అంటూ చంద్రబాబు హయాంలో జరిగిన భూ దందా పై వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ఫోకస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి భూములపై ప్రత్యేకమైన కమిటీ వేసి ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం SIT అధికారుల పర్యవేక్షణ లో విచారణ జరుగుతోంది. సిట్ అధికారులు కొద్ది రోజుల నుండి ఈ కేసులో దూకుడుగా వ్యవహరించడంతో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో డిప్యూటీ కలెక్టర్ మాధురితో అరెస్టులు మొదలవటంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారి వెన్నులో వణుకు మొదలైనట్లు సమాచారం. డిప్యూటీ కలెక్టర్ మాధురీ తప్పుడు రికార్డులు సృష్టించి తెలుగుదేశం పార్టీకి చెందిన రావుల గోపాలకృష్ణ తో కుమ్మక్కయి అక్రమంగా 10 ఫ్లాట్లను రిజిస్టర్ చేసి కౌలును కూడా 5.26 లక్షలు చెల్లించినట్టు సిట్ విచారణలో తేలింది.
నకిలీ రికార్డులు సృష్టించారని సిట్ విచారణలో స్పష్టమైన ఆధారాలతో అధికారులు గుర్తించారు. డిప్యూటీ కలెక్టర్ మాధురితో పాటు పనిచేసిన ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో ఉండటంతో SIT అధికారులు వారిని విచారించడానికి రెడీ అవుతున్నారట. అమరావతిలో అసలైన భూముల యజమానులను ఒప్పించడానికి ఎవరైతే ప్రయత్నించారో వారికి బహుమానంగా స్థలాలను అక్రమంగా టీడీపీ నాయకులు కట్టబెట్టినట్లు, కొందరికి రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు SIT అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతానికి అమరావతిలో 150 ఎకరాలు భూ కుంభకోణం జరిగినట్టు సమాచారం. కాగా డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్టుతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల వెన్నులో వణుకు మొదలైనట్లు, ఇదే సమయంలో ఇతర ఉన్నతాధికారులు కూడా విచారణ ఎదుర్కోటానికి భయపడుతున్నట్లు సమాచారం.