మూడు రాజధానులు అంశం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం కూడా తెలపటంతో టిడిపి నేతలు రాజధాని వికేంద్రీకరణ అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిలో భాగంగా నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్పు అంశంపై స్పందించిన నారా లోకేష్ ట్విటర్లో ప్రతిపక్షంలో జగన్ ఉన్న టైంలో ఏపీ రాజధాని లో వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేదాని గురించి చెప్పిన వీడియోను పోస్ట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మిస్తే చంద్రబాబుకి పేరు వస్తుందనే భయంతో వైయస్ జగన్ రాజధాని మార్చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
ట్విట్టర్లో నారా లోకేష్ అసలు వైయస్ జగన్ ని ఉద్దేశించి ఏమన్నారంటే..”స్థానిక యువతకు ఉపాధి కల్పన, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్, గార్డెన్ సిటీ, లంగ్స్పేస్ తో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధానిగా ముహానగరం కడతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు గారు నిర్మించిన అమరావతి ప్రజారాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలి.
మీరు కట్టాలనుకున్న రాజధాని కంటే గొప్పది. అమరావతి నిర్మాతగా చంద్రబాబు గారి పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా? ఐదు కోట్ల ఆంధ్రులకు సమాధానం చెప్పి తీరాలి.” ఈ రకంగా పోస్ట్ పెట్టి అమరావతి నిర్మాణం అయితే క్రెడిట్ చంద్రబాబుకి వస్తుందన్న అక్కసుతో జగన్ రాజధానిని మార్చేస్తున్నారు అన్నట్టుగా లోకేష్ పేర్కొన్నారు.