మొన్నటివరకు ఐపీఎల్ మెయిన్ స్పాన్సర్ గా ఉన్న చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ వివో పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసింది. స్పాన్సర్ రేసులో పలువురు బడా కంపెనీల పేర్లు మొన్నటినుండి సోషల్ మీడియాలో తెగ వినపడుతున్నాయి. ఐపీఎల్ 2020కి స్పాన్సర్ షిప్ అందించేందుకు ఎక్కువగా వినబడుతున్న పేర్లు చూస్తే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, బైజుస్, డ్రీమ్ 11, ఖాన్ అకాడమీ తదితర సంస్థలు. అయితే వీటన్నిటి కంటే ఎక్కువగా అమెజాన్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీసిసిఐ నుండి వినబడుతున్న టాక్. ఇవే కాకుండా మన భారత సంస్థలు అయినా జియో డిజిటల్ లైఫ్, పతాంజలి కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే స్పాన్సర్ షిప్ దక్కించుకునేందుకు అమెజాన్ సంస్థ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్న సమయంలో దసరా, దీపావళి పండుగలు జరగనున్నాయి. ఆ సమయంలో సహజంగానే షాపింగ్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల అమెజాన్ ఐపీఎల్ కి టైటిల్ స్పాన్సర్ గా ఉంటే భారీగా లాభాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. మరోపక్క పండగ టైం కాబట్టి చాలా సంస్థలు కూడా అమెజాన్ తో పాటు పోటీ పడుతున్నాయి.
వివో వల్ల కోల్పోయిన నాలుగు వందల నలభై కోట్ల లో మూడవ వంతు అంటే 120 కోట్లు వచ్చినా చాలని బీసీసీఐ భావిస్తోంది. చైనా ఇండియా సరిహద్దు వివాదం కారణంగా డ్రాగన్ కంట్రీ పై దేశ ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో… చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ వివో తనకు తానుగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న బిసిసిఐకి ఇది మరింత ఇబ్బందికరంగా నష్టాల్లోకి నెట్టింది. ఇటువంటి తరుణంలో 120 కోట్లు బిసిసిఐకి చెల్లించి ఏ కంపెనీ నీ టైటిల్ స్పాన్సర్ గా నిలుస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.