రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అయన పరిపాలనా తీరు కారణంగా పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి. పరిశ్రమలు రావడం లేదంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీతో సహా ఇతర రాష్ట్రాలు తీవ్ర ఆశ్చర్యపోయే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు ఏవీ బయట పెట్టని ఈ విషయాన్ని ది పయనీర్ అనే ఆంగ్ల దిన పత్రిక వెలుగులోకి తీసుకుని వచ్చింది.
అది ఏమిటంటే.. ఏపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నమ్మకంతో అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ట్రస్ట్ తొమ్మిది బిలియన్ డాలర్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 67,500 కోట్ల రూపాయల రుణాన్ని ఏపి ప్రభుత్వానికి ఇవ్వనుందట. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఇవ్వడానికి అంగీకరించిందట ఆ ట్రస్ట్. అంతే కాకుండా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మరో 28వేల కోట్ల రూపాయల రుణానికి అదనపు ప్రతిపాదనగా ఉందట. ఈ ఋణం కోసం ఏపి అధికారులు రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నారట. దాదాపు పది వేల కోట్ల రుణానికి ఓకే చెప్పిన సదరు ట్రస్ట్… కండిషన్స్ అప్లై అన్నట్టు భారత ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిబంధన పెట్టిందట. అంతా ఓకే అయితే నాలుగు శాతం వడ్డీతో 40ఏళ్లలో ఈ ఋణం తీర్చాల్సి ఉంటుంది.
ఇంత పెద్ద మొత్తంలో ఓ ప్రైవేట్ ట్రస్ట్ నుండి ఋణం తీసుకోవాలంటే ఫెమా, ఆర్బీఐ నిబంధనలు అడ్డుపడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీనికి సంబందించిన క్లియరెన్స్ కోసమే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కలాంలు ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈఒ అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సలహాదారు అవినాష్ మిశ్రా ల ను కలిసారని అంటున్నారు.
ఇంత పెద్ద ఋణం ఎలా సాధ్యమన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే మాదిరిగా ఏపికి అంత పెద్ద ఎత్తున ఋణం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆ ట్రస్ట్ ఎవరిది? అనే సందేహాలు వస్తున్నాయి. నిజం గా ఆ కధనం కరెక్ట్ అయి కేంద్రం అనుమతి తీసుకోని ఏపికి అంత పెద్ద ఋణం తీసుకోని వస్తే దటీజ్ జగన్ అనాల్సిందే.