ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం అమరావతి కుంభకోణాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసిపి అమరావతి అడ్డాగా రాజధాని అంటూ చంద్రబాబు మరియు ఆయన బంధువర్గం అదేవిధంగా బినామీలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సిబిఐ ఎంక్వైరీ వేయడానికి రెడీ అయింది. ఈ క్రమంలో చాలా మంది టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా అమరావతి గొడవకి బాలకృష్ణ బంధువు…వియ్యంకుడు అయిన రామారావు పేరు బయటకు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ తరుణంలో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని ఖండిస్తూ అమరావతిలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు అయిన రామారావు సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లోనే 499 ఎకరాల భూమిని 2013వ సంవత్సరంలోనే ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. అప్పటికి చంద్రబాబు అధికారంలో లేరని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా ఇన్ సైడర్ ట్రేడింగ్ విధానం ద్వారా అమరావతి భూములు బినామీ నాయకుల చేత కొనుగోలు చేయించి చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడినట్లు, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు వైసిపి పేర్కొంటుంది. కచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయటం గ్యారెంటీ అన్నట్టుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.