ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గత కొద్ది నెలల నుండి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఎక్కువగా బయట పడుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై విపక్షాల నుండి అదే రీతిలో కొన్ని వ్యవస్థల నుండి అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. మరో పక్క ప్రభుత్వ అధికారులు మాత్రం ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటం వల్ల కేసులు ఎక్కువ బయటపడటం చాలా కామన్, ఇందులో విమర్శించడానికి ఏమీ లేదని చెప్పుకొస్తున్నారు.
చాలావరకు కరోనా పాజిటివ్ కేసులు గత కొంత కాలం నుండి రికార్డు స్థాయిలో ఏపీలో నమోదు అవుతూ, మరణాలు కూడా అదే రీతిలో సంభవిస్తూ ఉన్నాయి. దీంతో ఏపీ ప్రజలలో భయాందోళనలు గత కొద్ది కాలం నుండి నెలకొన్నాయి. చాలా జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని కంట్రోల్ చేయలేక మళ్ళీ లాక్ డౌన్ అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల రాష్ట్రంలో మూడు రోజుల నుండి పాజిటివ్ కేసులు భారీగా తగ్గటం ఏపీ ప్రజలకు ఊరట కలిగించే బంగారం లాంటి వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో వస్తున్న లెక్కలు బట్టి వైద్య నిపుణులు చెపుతున్నారు. అంతే కాకుండా రికవరీ రేటు కూడా ఉన్న కొద్దీ రాష్ట్రంలో మెరుగుపడటంతో కచ్చితంగా ఏపీ కరోనా వైరస్ ఎదిరించే విషయంలో ధీటుగా నిలబడిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కరోనా కంట్రోల్ అవుతున్నట్లు వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో మినహా మిగతా జిల్లాల్లో చాలావరకు కంట్రోల్ లోకి రావడం జరిగింది.