Andhra Pradesh ‘ఆంధ్రులు ఆరంభ శూరులు’.. ఈ మాటన్నది ఎవరో కాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమం భీకరమైన వేళ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో సీమాంధ్రలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధర్నాలో, ఆందోళనలు, నిరసనలు, దీక్షలు.. ‘తెలంగాణ వద్దు.. సమైక్యాంధ్రే ముద్దు’ అనే నినాదంతో ఏపీ హోరెత్తిపోయింది. ఉవ్వెత్తున లేచిన సీమాంధ్ర పౌరుషాన్ని, చేపట్టిన ఉద్యమాన్ని ఉద్దేశించి ఆనాడు కేసీఆర్.. ఇలా ఒక్క మాటతో తీసిపడేశారు. అప్పటికే రాజకీయాల్లో పండిన కేసీఆర్ మాటలే నిజమయ్యాయి. మెల్లగా సీమాంధ్ర ఉద్యమం తగ్గింది.. తెలంగాణ వచ్చింది. అయితే.. ఇక్కడ సీమాంధ్రులది కాదు తప్పు. రాజకీయ పార్టీలది.. నాయకులది. సరే.. అది వేరే కథ. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నాటి ఆంధ్రజాతి పౌరుషం ఇప్పుడున్న సమస్యలపై కనిపించట్లేదనేదే ఇక్కడ ఉద్దేశం.
Andhra Pradesh పార్టీలే రాజకీయాలు చేస్తుంటే ప్రజలకేం పని..!
ఉవ్వెత్తున జరిగే ఉద్యమాల స్థాయి వ్యవస్థలను, ప్రభుత్వాలను కూడా కదిలిస్తుంది. ప్రజలే స్వచ్ఛందంగా చేసే ఉద్యమాల్లోకి రాజకీయ పార్టీలు చేరి స్వలాభానికి తాపత్రయపడుతుంటే తమెందుకు శ్రమ అనే భావన వచ్చేసింది. ఇందుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఓ ఉదాహరణ. రాష్ట్రం విడిపోకూడదని ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ.. కాంగ్రెస్, టీడీపీ ప్రజల మాటున కుయుక్తులు పన్నాయి. రాష్ట్రం విడిపోతుందని తెలిసినా కాంగ్రెస్.. ఏం మాట్లాడితే ఎటొస్తుందో అనే భయంతో ప్రతిపక్షంలోని తెలుగుదేశం సేఫ్ గేమ్ ఆడేసాయి. అందుకే ప్రజలు ప్రస్తుత సమస్యలపై పెద్దగా స్పందించడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు.. తమకు ఆ సమస్యతో సంబంధం ఉందనుకున్న వారు తప్ప. ఇందుకు నిన్న అమరావతి.. నేడు విశాఖ ఉక్కు సమస్యలే నిదర్శనం. తన హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకూడదంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తెలీటం లేదు వైసీపీకి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయానికి ఏపీ బీజేపీకి ఏం చేయాలో తెలీని పరిస్థితి.
టీడీపీది మొసలి కన్నీరేనా..?
ఈ రెండింటినీ పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లోని వారు తప్పితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు తమకేం పట్టనట్టే ఉన్నారు. లేదంటే.. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనటువంటి రాజధాని సమస్య ఏపీకి మాత్రమే ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు కదలాలి. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని సృష్టించింది. సచివాలయం, హైకోర్టు నిర్మాణం.. కొన్ని భవనాలు సగంలో ఉండగా ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో రాజధాని పక్కకెళ్లిపోయింది. కొత్తగా ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నిరంతరాయంగా ఉద్యమం చేస్తున్నారే కానీ.. మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా ఈ ఊసేలేదు. రాష్ట్రం కోసం రాజధాని అని భూములు తీసుకున్న టీడీపీ కూడా రైతుల పట్ల మొసలి కన్నీరే తప్ప.. ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తానికి ఆ సమస్యను తీసుకెళ్లలేకపోయింది. ఇప్పుడు విశాఖ అంశంలో కూడా అంతే. అక్కడి ప్రజలు, కార్మికుల పోరే కనబడుతోంది. రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం పడే పాట్లే తప్ప వారిలో నిజాయితీ కనిపించడం లేదు.
ఆనాటి స్ఫూర్తి ఏది?
గతంలో ఒక స్వాతంత్రోద్యమం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష, తెలంగాణ కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తి, సమైక్యాంధ్ర కోసం కదిలిన సీమాంధ్ర ప్రజల సంకల్పం నేడు దురదృష్టం కొద్దీ ఇప్పుడు లేదు. వచ్చే అవకాశాలు కూడా లేవు. రాజకీయ క్రీడలే కనిపిస్తుంటే ఇక ప్రజలకేం పని. నిన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ కల్యాణ్ రావాలి’ అన్నారు. సమస్య ఉంటే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఓ మాట మాట్లాడి వెళ్లిపోతారు. ఎటువంటి పదవులు లేని పవన్ మాత్రం స్పందించాలి. మొన్నటివరకూ ప్రజల చాటున ఆడిన గేమ్.. ఇప్పుడు పవన్ మాటున ఆడేస్తోంది టీడీపీ. అమరావతి రైతులు, వరదలకు రైతులు, ఇసుక సమస్య.. ఇలా ఏదైనా పవనే స్పందించాలి. వైసీపీ ఎలానూ కామ్ గానే ఉంటుంది ఏదో హడావిడి తప్ప. బీజేపీ తప్పించుకుంటూ ఓ డైలాగ్ వేయడం తప్ప చేసేదేం లేదు. ఇక ప్రజలకు ఎందుకు శ్రమ. అందుకే ‘లైట్’ తీసుకున్నారు. జరిగేదే జరుగుతుంది కాబట్టి.