కరోనా వైరస్ రాకతో లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షల విషయం లో ఉత్కంఠత మొన్నటివరకు నెలకొని ఉంది. తాజాగా ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం కంటే ముందుగా తెలంగాణ కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేసింది. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 8వ తారీకు నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని అందరూ భావించారు.
కానీ లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు కోర్టులో విచారణ కొనసాగుతుండటంతో పరీక్షల నిర్వహణ పై మరోసారి ఉత్కంఠత నెలకొంది. పరీక్షల పై రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండటంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా ఉద్ధృతి తగ్గే పరిస్థితులు కనపడక పోవటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రితో చర్చించి తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు గ్రేడ్ ల ద్వారా ఇంటర్ కు ప్రమోట్ చేసే అవకాశాన్ని పరిగణించాలని కోరుతున్నారట.
ఈ సందర్భంగా నిపుణులతో చర్చించి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదవ తరగతి విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాదిరిగానే ఆలోచించాలని కోరుతున్నారు. మరోపక్క మాత్రం వైయస్ జగన్ సర్కార్ పరీక్షలు పెట్టి మాత్రమే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఈ గ్రేడ్లు ఇప్పటి వరకు అన్ని తరగతులలో విద్యార్థుల పర్ఫార్మెన్స్ బట్టి ఇస్తారా లేక వారి పదవతరగతి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మార్కులను బట్టి ఇస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.