ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటుగా గతంలో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని సైతం టార్గెట్ చేయడంలో బీజేపీ నేతలు చేస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరిపాలించిన సమయంలోనే పలు ఘటనలు, నిధుల విషయాన్ని ఉటంకిస్తూ బీజేపీ ఎదురుదాడి చేస్తుంటుంది. అయితే, వారికి మరింత ఊతం ఇచ్చేలా తాజాగా వైసీపీ సమాచారం ఇచ్చింది.
ఇదేంటి చంద్రబాబు ?
ఓ మీడియా సంస్థతో చంద్రబాబు మాట్లాడుతూ, తాను అధికారంలోకి వస్తే రైతులకు ఇంత డబ్బు ఇద్దామని అనుకున్నానని పేర్కొంటూ అది వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం దానిని ఎగ్గొట్టినట్లు విశ్లేషించారు. దీనిపై వైసీపీ మంత్రి కన్న బాబు స్పందిస్తూ, సీనియారిటీ, వయస్సు పెరిగే కొద్దీ ఆలోచనలు, మాట్లాడే మాటల్లో కొంతైనా నిజాయితీ వుంటుదని, చంద్రబాబులో మాత్రం దురదృష్టవశాత్తు అటువంటి లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. రైతుల విషయంలో చంద్రబాబు చెబుతున్న అబద్దాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
దీనికి ఏం జవాబిస్తావు బాబు?
కేంద్ర, రాష్ట్ర పథకాలంటూ లేదా కేంద్రం వాటా, రాష్ట్రం వాటా అంటూ చంద్రబాబు చేసిన వాదన మరింత దిగజారుడుగా ఉందని కన్నబాబు ఎద్దేవా చేశారు. “నిజానికి ఏ పథకం అయినా కేంద్రం వాటా, రాష్ట్రం వాటా, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు.. ఇవన్నీ కలిపితేనే కదా.. బడ్జెట్ నిధులు సమకూరేది. పథకాలకు కూడా అంతే. ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? లేకపోతే కావాలనే ఇలా మాట్లాడుతున్నారా?“ అంటూ ప్రశ్నించారు.
బీజేపీ నేతలకు భలే చాన్స్
చద్రబాబు తన హయాంలో చంద్రన్న బాట.. అంటూ కేంద్రం నుంచి 90 శాతం నిధులు అందించిన ఉపాధి హామీ పథకాన్ని వాడుకున్నారని కన్నబాబు ఆరోపించారు. “ చంద్రన్న బాట పథకంలో రాష్ట్రం వాటా కేవలం పదిశాతం. చంద్రన్న బాట రోడ్లలో మీరు వేసింది కేవలం 10 శాతం మాత్రమే అంటే ఒప్పుకుంటావా చంద్రబాబు? అలానే చంద్రన్న బీమా.. అంటూ మరో పథకం పెట్టారు. ఇదికూడా రెండు కేంద్ర పథకాల కలయికగా ఏర్పడింది. అలాగే, గ్రామీణ గృహ నిర్మాణంలో 1.5 లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వస్తే, వాటికి ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకున్నారు. అలాగే మరో కేంద్ర ప్రభుత్వ పథకానికి తల్లీ బిడ్డ చల్లగా.. అని పేరు పెట్టారు. మరి ఇవన్నీ చంద్రబాబు పథకాలేనా..? జవాబు ఏది చంద్రబాబు?“ అంటూ కన్నబాబు నిలదీశారు.