టిడిపి నేతలను వైసీపీ ప్రభుత్వం వెంటాడుతోంది.అవకాశం చిక్కితే ఎవరిమీదైనా కేసులు పెట్టేయటానికి పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు.తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులకు చిక్కిపోయారు.పశ్చిమ గోదావరి జిల్లా లో వరద బాధితులను పరామర్శించే పర్యటనలో ఉండగా ఆయన నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పడం తెలిసిందే.ఆకివీడులో ఈ సంఘటన జరిగింది లోకేష్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి ఒరిగింది. సకాలంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తదుపరి పర్యటన ముగించుకొని లోకేష్ వెళ్లిపోయారు ఈ ప్రమాద ఘటనపై ఆకివీడు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఆయనపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు.అంతటితో ఆ కథ ముగిసిపోలేదు .కరోనా నిబంధనలను ఉల్లంఘించి లోకేష్ పర్యటన సాగించారని ఇంకో అభియోగాన్ని కూడా పోలీసులు మోపారు. ఆయన వెనుక పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని కరోనా ఎపిడమిక్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై పెట్టిన కేసులో అదనపు సెక్షన్లు జోడించారు.ఈ క్రమంలో 279, 184, 54A కింద ఆకివీడు పోలీసులు లోకేష్పై కేసు నమోదు చేశారు.అయితే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని టిడిపి ధ్వజమెత్తింది.టిడిపి నేతలను టార్గెట్ చేసుకొని జగన్ ప్రభుత్వం ఎవరి మీద పడితే వారి మీద కేసులు పెడుతోందని టిడిపి పార్టీ వారు అంటున్నారు.
ఇంతకు ముందే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరుల మీద ఎడాపెడా కేసులు పెట్టేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు నేరుగా లోకేష్ ని టార్గెట్ చేసిందని వారు విమర్శిస్తున్నారు.వైసిపి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతకంటే పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలు బహిరంగ సభలు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని,తెలుగుదేశం విషయానికొచ్చేసరికి మాత్రం వారు ద్వంద ప్రమాణాలు అనుసరిస్తున్నారని శాసన మండలిలో టిడిపి విప్ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు.వరద బాధితుల పరామర్శకు ప్రతిపక్ష నేత రావటం కూడా తప్పేనా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో వైసిపికి వారే బుద్ధి చెబుతారని వెంకన్న అన్నారు.