(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
అంతర్వేదిలో రథం దగ్ధం అంశం రాష్ట్రంలో రాజకీయంగా ఎంత వివాదం రేపుతుందో అందరికీ తెలిసిందే. రథం దగ్ధంపై స్పష్టమైన కారణం ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం ప్రాధమిక అంచనాకు రాలేకపోతున్నది. ఏవో వైసీపీ నేతలు, కొంత మంది మంత్రులు కొన్ని కారణాలు చెబుతున్నప్పటికీ ఇవేవీ జనం గానీ, ప్రతిపక్షాలకు కానీ నమ్మశక్యంగా ఉండటం లేదు. అందుకే దీనిపై అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ రథం దగ్ధం విషయంలో బిజెపి ఆశించినంతగా స్పందించలేదని ఏపి బిజెపి నేతలు అంత చురుగ్గా వ్యవహరించలేదని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు మాత్రం సమచారం అందుతోంది.
ఆర్ ఎస్ ఎస్ సీరియస్..ఫిర్యాదుల వెనుక వాళ్లేనా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అంటే అందరికీ తెలిసిందే. ఇది బిజెపికి వెనుక ముందు ఒక రకంగా కళ్లు, ముక్కు, చెవులు, చేతులు అన్నీ కూడాగా ఆర్ ఎస్ ఎస్ ఉంటుంది. దానితో పాటు భజరంగ్ దళ్, విహెచ్ పి ఇవి కూడా బిజెపికి అనుబంధంగా చేసే హైందవ సంఘాలు. ఎక్కడ హింధూ దేవాలయాలపై దాడులు జరిగినా అధ్యాత్మిక సంబంధమైన ఏటువంటి వివాదం చెలరేగినా ఈ సంఘాలు వెంటవెంటనే స్పందిస్తుంటాయి. రాష్ట్రంలో అంతర్వేది రథం దగ్ధం విషయంలో విహెచ్ పి, భజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్ ఆశించినంతగా ఏపి బిజెపిలోని నాయకులు స్పందించలేదని ఇటీవల కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా ప్రకటనలకు, పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారని, సంఘటన జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని ప్రభుత్వంతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుుకునేలా వ్యవహరించలేదనీ, ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడంలోనూ విఫలమైయ్యారనీ కొన్ని ఫిర్యాదులు చేశారన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ ఏపి బిజెపి నేతలు ఆశించినంతగా స్పందించలేదని మాత్రం ఆర్ ఎస్ ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పవన్ తీరుపైనా విమర్శలు, ఫిర్యాదులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే బిజెపి వాదిగా మారుతున్నారు. పూర్తి హిందూ వాదిగా మారుతున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న తరుణంలో ఆయన కూడా హైందవత్వాన్ని నెత్తిపై మోస్తూ ఓ వర్గానికి, ఓ మతానికి పరిమితం అయ్యే రాజకీయం చేస్తున్నారు. అయినప్పటికీ రథం దగ్ధం విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతగా స్పందించలేదనీ ఆయన సరిగా స్పందించి ఉంటే ప్రభుత్వ ప్రతిస్పందన వేరేలా ఉండేదనీ రాజకీయంగా కూడా మంచి మైలేజీ వచ్చేదనీ కేంద్రానికి ఫిర్యాదు అందినట్లు ఆర్ ఎస్ ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది,. ఇవి ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న అంశాలు మాత్రమే. ఒక వేళ ఫిర్యాదులు వెళ్లినా వెళ్లకపోయినా ఈ విమర్శలు రావడం మాత్రం బిజెపి నేతలకు ఒక తలనొప్పి వ్యవహారంగానే మారుతోంది.