Telanaga Politics.. లో కేసీఆర్ తీరే వేరు. కయ్యం.. వియ్యం.. ఏదైనా ఆయనతో సాధ్యమే. ‘తెలంగాణ సీఎం అవుతారు.. కేసీఆర్ సుముఖంగానే ఉన్నారు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతూ ఫెడరల్ ఫ్రంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు..’ ఇవన్నీ మొన్నటివరకూ తెలంగాణలో జోరుగా వినిపించిన మాటలు. అంతేనా.. బీజేపీని కేసీఆర్ దూనమాడిన సందర్భాలెన్నో..! కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిర్దంద్వంగా తోసిపుచ్చారు కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. ప్రలోభాలకు ఏపీ లొంగిపోయిందని.. తెలంగాణ ఇలాంటి వాటికి తలొగ్గదని మంత్రి హరీశ్ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇటివల కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. అక్కడేం జరిగిందో ఏమో.. తెలంగాణలో సీన్ రివర్స్ అయిపోయింది. వ్యవసాయ చట్టాలకు మద్దతివ్వడం.. కేటీఆర్ కాదు.. మరో పదేళ్ల వరకూ నేనే సీఎం అని కేసీఆర్ అనడం కూడా జరిగిపోయింది. అసలేం జరిగింది?
2018లో కేసీఆర్ అలా..
2018 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికలకు కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని వార్తలు వచ్చాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలను కూడా కలిశారు. కానీ.. ఇది జరగలేదు.. కేటీఆర్ సీఎం అంశం కూడా పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. సచివాలయం త్వరగా పూర్తి చేసి.. కేటీఆర్ ను సీఎం చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. కేటీఆర్ సమక్షంలోనే సీఎం అవుతారన్నారు. మంత్రులు శ్రీనివాస గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇదే మాట. కేటీఆర్ కూడా ఖండించింది లేదు. స్వయంగా మంత్రులే వ్యాఖ్యలు చేస్తుంటే ఎంతోకొంత నిజం ఉండకపోదని తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు. అయితే.. మొన్నటి టీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో మరో పదేళ్లు నేనే సీఎం అని కేసీఆర్ అందరికీ షాక్ తోపాటు.. మరోసారి పరిధి దాటి మాట్లాడితే ఊరుకోను.. అని వార్నింగ్ కూడా ఇచ్చారు. కేసీఆర్ మాటకు తిరుగుండదు కాబట్టి అందరూ కామ్ అయిపోయారు.
కేసీఆర్ తీరు మారేంతగా ఏం జరిగిందో..
అయితే.. కేటీఆర్ సీఎం అంశం, వ్యవసాయ చట్టాలకు మద్దతు, బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గడం.. ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ లో ఈ మార్పు ఏంటి? ఎందుకు దూకుడు తగ్గింది. కేటీఆర్ విషయంలో ఎందుకు వెనక్కు తగ్గినట్టు. ఫెడరల్ ఫ్రంట్ ఉండదా? జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనట్టేనా? మొన్నటి వరకూ ఖండించని విషయాన్ని ఇప్పుడెందుకు ఖరాఖండిగా చెప్పినట్టు? అసలు ఏం జరుగింది.. ఏం జరుగుతోంది? ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు కనపడుతోంది ఎందుకు? సీఎం ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇవన్నీ సగటు తెలంగాణ ప్రజల్నే కాదు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరీ ముఖ్యంగా కేటీఆర్ సీఎం అవుతారని ఘంటాపథంగా చెప్పిన మంత్రులు, డిప్యూటీ సీఎం, తదితరుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టైంది. పరిధి దాటి ఎవరు మాట్లాడినా ‘తోలు తీస్తా’ అనేంత సీరియస్ గా గులాబీ బాస్ వార్నింగ్ ఇవ్వాల్సినంత పరిస్థితులేం ఏర్పాడ్డాయని మరింత చర్చ జరిగింది. అయితే..
బీజేపీ ఝలక్ ఇచ్చిందా..?
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో జరిగిన పరిణామాలే పై ప్రశ్నలన్నింటికీ కారణమని తెలుస్తోంది. తాము ఎన్డీఏలో చేరతామని, కేటీఆర్ ను సీఎం చేస్తామని కేంద్ర నాయకత్వం వద్ద ప్రస్తావించారట కేసీఆర్. ఇందుకు బీజేపీ నించి సానుకూల హామీ, సమాధానం రాలేదని తెలుస్తోంది. బీజేపీని దూషించడం, వ్యవసాయ చట్టాలకు ప్రెస్ మీట్లు పెట్టి వ్యతిరేకించడం.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతోనే కేటీఆర్ విషయంలో కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి విషయాన్ని తిరగేయడం వెన్నతో పెట్టిన విద్య అని తెలిసిన కేసీఆర్.. ఈ సమయంలో తానే సీఎంగా ఉండటం మంచిదని భావించారట. అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. బీజేపీని సంతృప్తి పరచేందుకే ఢిల్లీ టూర్ అనంతంర వ్యవసాయ చట్టాలపై ప్రేమ, బీజేపీని తిట్టడం తగ్గించారని అంటున్నారు. ఈ కారణాలే కేసీఆర్ లో మార్పుకు కారణమని తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వార్తలు రౌండ్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే జరిగే రాజకీయ సమీకరణాలే తేల్చాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?