ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం ఎంత హాట్ టాపిక్కో తెలిసిందే. దీనిపి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వం ఆగష్టు 16న విశాఖలో అడుగుపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంది. సీఆర్డీఏను కూడా రద్దు చేసింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. దానిపై స్టేటస్ కో ఇవ్వడం కూడా జరిగింది. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఆగష్టు 17న.. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై సుప్రీం ఏ నిర్ణయం తీర్పు ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.
ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు దాదాపు 300 రోజులుగా ఆ ప్రాంతంలో దీక్షలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సీఆర్డీఏను కూడా రద్దు చేసింది. ఈనేపథ్యంలో ఈ అంశం తుదకు సుప్రీంకోర్టుకు చేరడం సర్వత్రా ఆసక్తిగా మారింది. మూడు రాజధానుల ప్రాధాన్యాన్ని సుప్రీంకు వివరించనుంది ప్రభుత్వం. నిజానికి ఈ పిటీషన్ ఇప్పటికే విచారణకు రావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్లో కొన్ని లోపాలు ఉండటంతో ఈనెల 17కు వాయిదాపడింది. ఇందులో భాగంగానే అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 జోన్లపై గతంలో దాఖలైన పిటిషన్లపై కూడా న్యాయస్థానం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
లసోమవారం సుప్రీంకోర్టు తీర్పులో స్టేటస్ కోను కొట్టివేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ‘విశాఖ’లో పరిపాలనా రాజధానికి శంఖుస్థాపన చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరిగాయి. సీనియర్ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే దసరా సమయానికి కోర్టులో ఉన్న అన్ని పిటీషన్లను పరిష్కరించుకుని అప్పుడు ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో 17న సుప్రీం వెలువరిచే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.